
భూమి కోల్పోయి.. అప్పులు పెరిగి..
సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటోడ్రైవర్ ఆత్మహత్యాయత్నం
శివ్వంపేట(నర్సాపూర్): సెల్ఫీ వీడియో తీసుకుంటూ ఆటో డ్రైవర్ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శివ్వంపేట మండలం కొత్తపేటలో సోమవారం చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు.. కొత్తపేట గ్రామానికి చెందిన కంచన్పల్లి శేఖర్ ఉపాధి కోసం పట్నం వెళ్లి సూరారం, బాచుపల్లిలో ఆటో నడుపుకుంటూ జీవిస్తున్నాడు. ఫ్రీ బస్ వల్ల ఆటో గిరాకీ లేకపోవడంతో ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. సుమారు రూ. 20 లక్షల వరకు అప్పులు అయ్యాయి. ట్రిపుల్ఆర్లో 20 గుంటల భూమి కోల్పోగా ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వ లేదు. ఇటు ఆటో నడవక, అటు కోల్పోయిన భూమికి నష్టపరిహారం రాక అప్పులు తీర్చే మార్గం లేకుండా పోయింది. దీనికితోడు మూడు ఎకరాల సీలింగ్ భూమి ఇతరులు కబ్జా చేశారు. పలుమార్లు తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా సమస్య పరిష్కారం కాలేదు. కేసీఆర్ సార్ మంచోడని కేసీఆర్ తనను ఆదుకోవాలని కోరాడు. సీఎం రేవంత్రెడ్డితో ఏమి కాదన్నాడు. అప్పు తీర్చే మార్గం లేక పురుగుల మందు తాగుతూ ఆత్మహత్య చేసుకుంటున్నట్లు సెల్ఫీ వీడియో తీసి గ్రూపులలో షేర్ చేశారు. ఇది చూసిన గ్రామస్తులు, కుటుంబ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకొని బాధితుడిని నర్సాపూర్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్త సంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఆత్మహత్యాయత్నం చేయడం ఇది రెండోసారని తెలిసింది.