
గిరి గ్రామాల్లో విత్తనపూజ
● ప్రారంభమైన ‘మొహతుక్’ ● చంచి భీమల్ దేవునికి పూజలు ● అనాదిగా వస్తున్న ఆచారం
గ్రామాల్లో విత్తన పూజలు
మృగశిర కార్తె ప్రవేశించడంతో ప్రతీ గ్రామాల్లో విత్తన పూజలు(మొహతుక్) కొనసాగుతున్నాయి. ఆదివాసీ కులదేవతలకు విత్తనాలు చూపించాకే తమతమ పొలాల్లో విత్తనాలు నాటుతున్నాం. అనాదిగా వస్తున్న ఆచారం.
– దుర్పతబాయి, మాజీ జెడ్పీటీసీ, కెరమెరి
దేవతలకు చూపించాకే!
పొలాల్లో విత్తనాలు నాటేకంటే కొద్ది రోజుల ముందు కులదైవాలకు విత్తనాలను చూపిస్తాం. అక్కడ ప్రత్యేక పూజలు చేశాకే పొలానికి వెళ్లి జొన్నగట్కాను ఆరగిస్తారు. అనంతరం నేలతల్లికి ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటడం ప్రారంభిస్తాం.
– ధర్మారావు, దేవారి సాకడ(సీ)
కెరమెరి(ఆసిఫాబాద్): ఏడాదిలో ఆరు మాసాలు ఏవో పండుగలు చేస్తూ.. తమకు తామే సాటిగా నిలుస్తున్నారు ఆదివాసీలు. తమ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడడంలో వారు ముందుంటున్నారు. మృగశిరకార్తె ప్రవేశించడంతో ఉమ్మడి జిల్లాలోని గిరి గ్రామాల్లో విత్తనపూజకు శ్రీకారం చుట్టారు. విత్తన (మొహతుక్) పూజలు పొలాల్లో రెండురోజులుగా కొనసాగుతున్నాయి. ప్రతీఏటా జరుపుకునే విత్తన పూజలతోనే తమతమ పొలాల్లో విత్తనాలు నాటడం ప్రారంభిస్తారు.
దేవతలకు విత్తనాలను చూపించారు
ఈ మాసంలో అన్ని గ్రామాల్లో గ్రామ పటేల్ ఇంట్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఆదివాసీల కు లదైవమైన పాటేరు అమ్మోరు, జంగుబాయి, గాంధారి కిల్ల, పద్మాల్పురి కాకో వద్దకు వెళ్లి విత్తనాలను చూపించారు. అక్కడే దేవతల ఆశీర్వాదం తీసుకుని తిరుగుపయనమయ్యారు. అనంతరం గ్రామంలో ఉన్న ఆకీపేన్, అమ్మోరు, పొచమ్మ వద్దకు విత్తనాలతో పూజలు చేశారు. అక్కడే పటేల్ ఇచ్చే విత్తనాలను తమతమ ఇళ్లకు తీసుకెళ్లారు. మళ్లీ అదేరోజు అర్ధరాత్రి 2.5 కిలోల జొన్నలను ఇంట్లోనే పడతారు. పట్టిన జొన్నలతో గట్కా తయారు చేసి ఆరగిస్తారు. జొన్న గట్క ఆరగించాక అర్ధరాత్రి అడవికి వెళ్లి (కుమ్ముడ్) చెట్టు ఆకులను తీసుకువచ్చారు. ఆ ఆకులతో డొప్పలు తయారు చేసి అన్ని ఇళ్లల్లో ఇస్తారు. అందులో పూజ చేసిన విత్తనాలు వేస్తారు. ఈ పూజలు మరో రెండు రోజులు కొనసాగుతాయి.
విత్తన పూజలు(మొహతుక్)!
మృగశిర కార్తె ప్రవేశం నుంచి విత్తన పూజలు(మొహతుక్) పొలాల్లో సంప్రదాయ బద్ధంగా చేస్తారు. విత్తన పూజ చేసే రోజు రైతు కుటుంబమంతా ఉదయం పొలంబాట పడతారు. జొన్నతో గట్కా తయారీ చేసి కులదైవతలతోపాటు, నేలతల్లికి సమర్పిస్తారు. అనంతరం పొలంలో విత్తనాలు చల్లి అరకకు ప్రత్యేక పూజలు చేసి విత్తనాలు నాటుతారు. గ్రామపటేల్ ఇంటి ఎదుట మహిళలు అందరూ పాటలు పాడుతూ, సంప్రదాయ నృత్యాలు చేస్తారు. పురుషులు గిల్లిదండా ఆట ఆడుతారు. అనంతరం సహపంక్తి భోజనం చేస్తారు. తర్వాత భేటింగ్ అయ్యారు.
చంచి భీమల్ దేవుడి కల్యాణంతో..
ఆదివాసీల ఇష్టదైవమైన చంచి భీమల్ దేవుడి కల్యాణం సందర్భంగా ఏటా మే నెలలో విత్తనాలను భీమల్ దేవుడికి చూపిస్తారు. ఆ రోజు ఆదివాసీలు భీమల్ దేవుడికి సంప్రదాయ పూజలు చేస్తారు. అడవుల్లో లభించే ఆకులతో ఆరు డొప్పలను తయారు చేస్తారు. అందులో పొలాల్లో పండించే అన్ని విత్తనాలను కలిపి దేవునికి చూపిస్తారు. అనంతరం వాటిని ఇళ్లకు తీసుకెళ్లి దాచి పెడుతారు. ఆ రోజు పిండి వంటలు చేసి ఆరగిస్తారు. మృగశిర కార్తె ప్రారంభంతో దాచి పెట్టిన విత్తనాలను తమ పంట పొలాల్లో చల్లుతారని చెబుతున్నారు.
ఇంద్రాదేవికి విత్తన పూజలు
ఇంద్రవెల్లి: ఆదివాసీల ఆరాధ్యదైవం మండలకేంద్రంలోని ఇంద్రాదేవి ఆలయంలో విత్తన పూజలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం ఉమ్మడి జిల్లా నుంచి ఆదివాసీలు తరలివచ్చి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అమ్మవారికి తయారీ చేసిన నవధాన్యాలతో నైవేద్యం సమర్పించారు. ఖరీఫ్ సీజన్లో వర్షాలు కురువాలని, పంటలు బాగా పండాలని అమ్మవారికి మొక్కుకున్నారు.

గిరి గ్రామాల్లో విత్తనపూజ

గిరి గ్రామాల్లో విత్తనపూజ

గిరి గ్రామాల్లో విత్తనపూజ

గిరి గ్రామాల్లో విత్తనపూజ