
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య
ఆదిలాబాద్ జిల్లాలో వేర్వేరు కారణాలతో ముగ్గురు బలవన్మరణం చెందారు. అనుమానాస్పద స్థితిలో వివాహిత, నీట్లో ర్యాంక్ రాదోనని బెంగతో యువకుడు ఉరేసుకున్నారు. మద్యానికి బానిసైన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అనుమానాస్పద స్థితిలో వివాహిత..
ఉట్నూర్రూరల్: అనుమానాస్పద స్థితిలో వివాహిత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మండల కేంద్రంలోని పాత ఉట్నూర్లో ఈ ఘటన చోటుచేసుకుంది. మృతురాలి బంధువులు తెలిపిన వివరాలు.. మండలంలోని గంగాపూర్కు చెందిన సంజీవ్ మూడో కుమార్తె సుప్రియ(22)ను ఐదేళ్ల క్రితం ఉట్నూర్ మండలం పాత ఉట్నూర్కు చెందిన జాడి రాధాకృష్ణతో వివాహమైంది. వీరికి ఓ పాప(4) సంతానం. రాధాకృష్ణ కూలీ పనిచేసుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. గతకొన్ని రోజులుగా వరకట్నం తేవాలని భార్యను మానసికంగా వేధించసాగాడు. ఈక్రమంలో ఆదివారం మద్యం తాగి ఇంటికి వచ్చాడు. భార్యభర్తల మధ్య గొడవ జరిగింది. రాత్రి మనస్తాపంతో చీరతో ఇంట్లో ఉరేసుకుంది. గమనించిన భర్త, బంధువుల సహాయంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. భర్త బంధువులు ఈ విషయాన్ని సుప్రియ తల్లిదండ్రులకు చెప్పారు. బంధువులతో కలిసి వారు అక్కడికి చేరుకుని రోదించారు. తన కూతురిని అల్లుడు కొట్టి హత్య చేసి ఉరేసి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరిస్తున్నాడని ఆరోపించారు. తండ్రి ఫిర్యాదుతో సోమవారం కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మోగిలి తెలిపారు. విచారణ అనంతరం పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు.
నీట్లో ర్యాంక్ రాదనే బెంగతో యువకుడు..
ఉట్నూర్రూరల్: నీట్లో ర్యాంక్ రాదనే బెంగతో యువకుడు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మండలకేంద్రంలో చోటుచేసుకుంది. సీఐ మోగిలి కథనం ప్రకారం..మండల కేంద్రంలోని మెయిన్ రోడ్డులో గంగాధర్కు ఏకై క కుమారుడు మనోజ్ (18) ఇంటర్ పూర్తి చేసి నీట్ పరీక్ష కోసం లాంగ్టర్మ్ కోచింగ్ తీసుకున్నాడు. ఇటీవల రాసిన నీట్ పరీక్షలో మంచి ర్యాంక్ రాదేమోనని బెంగతో సోమవారం ఇంట్లో ఉరేసుకున్నాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందాడు. వైద్యులు పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని అప్పగించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కుమారుడు డాక్టర్ కావాలని ఆశయంతో కష్టపడి చదివిస్తే అప్పుడే నూరేళ్లు నిండాయని తల్లిదండ్రులు రోదిస్తున్న తీరు అందరిని కంటతడి పెట్టించింది. పరీక్షల్లో ఫెయిల్, ర్యాంక్ రావని విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవద్దని మళ్లీ సాధిస్తామని మనోధైర్యంతో ముందుకు వెళ్లాలని, తల్లిదండ్రులకు పుత్రశోకం మిగిల్చవద్దని పలువురు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
మద్యానికి బానిసై యువకుడు..
ఆదిలాబాద్టౌన్: ఆదిలాబాద్రూరల్ మండలం అంకోలికి చెందిన యువకుడు పుట్ట భవన్ (25) మద్యానికి బానిసై ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆదివారం సాయంత్రం పట్టణంలో పురుగుల మందు తాగి పడిపోగా, స్థానికులు గమనించి రిమ్స్కు తరలించారు. రాత్రి చికిత్స పొందుతూ మృతిచెందాడు. తండ్రి హన్మాండ్లు ఫిర్యాదుతో కేసు దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ కరుణాకర్రావు తెలిపారు.

వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య