జన్నారం: జన్నారం అటవీ డివిజన్ పరిధిలోని ఇందన్పల్లి రేంజ్లో ఆదిలాబాద్ జిల్లా సివిల్ న్యాయమూర్తి ప్రమీల జైన్ కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం పర్యటించారు. న్యాయమూర్తికి రేంజ్ అధికారి కారం శ్రీనివాస్ మొక్క అందించి స్వాగతం పలికారు. అనంతరం మైసమ్మకుంట, ఘనిషెట్టి కుంట, వాచ్టవర్ ప్రాంతాలను పరిశీలించారు. అడవి అందాలను చూసి మురిసిపోయారు. అడవి అభివృద్ధి, వన్యప్రాణుల సంరక్షణకు తీసుకుంటున్న చర్యలను రేంజ్ అధికారి న్యాయమూర్తికి వివరించారు.
సైబర్ వలలో యువకుడు●
● రూ.2.12 లక్షలు పోగొట్టుకున్న వైనం
● మందమర్రిలో ఘటన..కేసు నమోదు
మందమర్రిరూరల్: సైబర్ వలలో పడి యువకుడు రూ.2.12 లక్షలు పోగొట్టుకున్నాడు. మందమర్రిలో ఈఘటన చోటుచేసుకుంది. ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం..పట్టణానికి చెందిన యువకుడికి గూగుల్లో రివ్యూ ఇస్తూ డబ్బులు సంపాదించవచ్చని ఒక టెలీగ్రామ్ పేరిట నేరగాళ్ల నుంచి మేసెజ్ వచ్చింది. దానికి అంగీకరించడంతో అతన్ని 3వేల మంది ఉన్న టెలీగ్రామ్ గ్రూప్లో యాడ్ చేశారు. ముందుగా పెట్టుబడి రూపంలో కొన్ని డబ్బులు పెట్టాడు. అధిక మొత్తంలో ఆశచూపి తర్వాత రూ. 2.12 లక్షలు పెట్టించారు. తర్వాత నగదు విత్ డ్రా చేసుకోవడానికి వీలు లేకుండా నేరగాళ్లు హ్యాక్ చేశారు. దీంతో మోసపోయానని గ్రహించిన యువకుడు పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు.
తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉమ్మడి జిల్లా మహాసభ
పాతమంచిర్యాల: జిల్లాకేంద్రంలోని చార్వాక ట్రస్టు భవన్లో ఆదివారం తెలంగాణ ప్రజాఫ్రంట్ ఉమ్మడి జిల్లా 3వ మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర నాయకుడు సంజీవరావు మాట్లాడుతూ ప్రజాస్వామిక తెలంగాణ కోసం పోరాడాలని పిలుపునిచ్చారు. సామ్రాజ్యవాద దేశాల మెప్పు కోసం పాలకులు పాటుపడుతున్నారని విమర్శించారు. ఓపెన్ కాస్టుల విధ్వంసం, టైగర్జోన్లతో ప్రజలు నిర్వాసితులుగా మారుతున్నారన్నారు. ఓపెన్కాస్టుల విధ్వంసాన్ని ఆపాలని, టైగర్జోన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
మంచిర్యాల జిల్లా కమిటీ ఎన్నిక
అధ్యక్షుడిగా శ్రీ మన్నారాయణ, ప్రధాన కార్యదర్శి జైపాల్సింగ్, ఉపాధ్యక్షులుగా చంద్రయ్య, పోశం, అనంద్ సంతోష్, శ్రీనివాస్, సభ్యులుగా ఎన్నుకున్నారు. సమావేశంలో జైపాల్సింగ్, శ్రీమన్నారాయణ, ప్రజాకళామండలి నాయకులు సమ్మయ్య, చంద్రమౌళి, శ్రీనివాస్, రాజన్న, కుమార్ పాల్గొన్నారు.
ఆర్జీయూకేటీలో ముగిసిన టెక్ఫెస్ట్
బాసర: బాసర ఆర్జీయూకేటీలో మూడు రోజులుగా నిర్వహిస్తున్న అంత:ప్రజ్ఞ టెక్ఫెస్ట్ కార్యక్రమం ఆదివారంతో ముగిసింది. ఇంజినీరింగ్ విద్యార్థుల వినూత్న ఆలోచనలు, సామర్థ్యాలను ప్రదర్శించేందుకు టెక్ఫెస్ట్ నిర్వహించినట్లు ఇన్చార్జి వీసీ గోవర్ధన్ తెలిపారు. ఇందులో విద్యార్థుల ప్రాజెక్టు నమూనాలు, పోస్టర్ ప్రజెంటేషన్లు, తదితర ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. ఓఎస్డీ ప్రొఫెసర్ మురళీదర్శన్, ఏవో రణధీర్ సాగి, అసోసియేటెడ్ డీన్స్, వివిధ అన్ని శాఖల అధికారులు పాల్గొన్నారు.
26న మామిడిపండ్ల తోటల వేలం
ఉట్నూర్రూరల్: ఐటీడీఏ ఉట్నూర్ పరిధిలోని ఉద్యాన నర్సరీలో మామిడిపండ్ల తోటల వేలం ఈనెల 26న నిర్వహించనున్నట్లు ఐటీడీఏ పీవో ఖుష్బూ గుప్తా ఒక ప్రకటనలో తెలిపారు. బంగినపల్లి, దసేరి, తోతాపరి, రసాలు, హిమాయత్, లాంగ్ర తదితర మామిడి హైబ్రిడ్ రకాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న వ్యాపారులు రూ.10 వేల డిపాజిట్ చెల్లించి ఉదయం 10 గంటలకు జరిగే వేలంలో పాల్గొనాలని కోరారు. వేలంలో తోట దక్కించుకున్నవారు సగం నగదును వెంటనే చెల్లించాలని మిగతాది వారంలో చెల్లించాలని సూచించారు. ఆ తర్వాతే కాయలు కోయడానికి అనుమతి ఉంటుందని పేర్కొన్నారు. వివరాలకు సెల్ 8897478825, 9441020755 నంబర్లలో సంప్రదించాలని సూచించారు.
ఇందన్పల్లి రేంజ్లో న్యాయమూర్తి