
గద్వాల: మొక్కలు పెంచడానికి ఉపయోగపడే జీవశైదిల్య (బయో– డీగ్రాడేబుల్) ద్వారా తయారు చేసిన కవరును కేటీదొడ్డి మండలం చింతలకుంటకు చెందిన విద్యార్థిని శ్రీజ రూపొందించారు. స్వగ్రామంలో పదో తరగతి వరకు చదివిన శ్రీజ ప్రస్తుతం హైదరాబాద్లో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. నర్సిరీలలో ప్లాస్టిక్ బ్యాగులు, కవర్లలో మట్టి నింపి మొక్కలు పెంచుతున్నారు. ఆ మొక్కలు తీసిన తర్వాత కోట్ల సంఖ్యలో పారవేసిన ప్లాస్టిక్ ఉండిపోతుంది. ఇది పర్యావరణానికి హానికరం. దీనిని నివారించడానికి విద్యార్థి తన నైపుణ్యంతో అద్భుతమైన ఆవిష్కరణ చేపట్టింది. వేరుశనగ పొట్టును గుజ్జుగా చేసి వాటిద్వారా మొక్కల కుండీలను తయారు చేసింది. ఈ గుజ్జులో సహజసిద్ధమైన నైట్రోజన్, ఫాస్పరస్ ఎక్కువ మోతాదులో ఉంటుంది. మొక్కతోపాటు కుండిని భూమిలో నాటడం వల్ల భూమిలో కలిసిపోవడమే కాకుండా ఎరువుగా ఉపయోగపడుతుందని వివరించింది. శ్రీజ రూపొందించిన ఆవిష్కరణకు రాష్ట్ర, జాతీయస్థాయిలో గుర్తింపు లభించింది.
బయోపాట్ పరిశ్రమ..
శ్రీజ సృజనాత్మక ఆలోచన ఏకంగా పరిశ్రమ ఏర్పాటుకు బాటలు వేసింది. శ్రీజ రూపొందించిన పర్యావరణహిత కుండల (బయోపాట్) తయారీకి రాష్ట్రంలో సూక్ష్మ పరిశ్రమ ఏర్పాటు దిశగా అడుగులు పడ్డాయి. ప్రభుత్వ సంస్థ టీ–వర్క్స్, చైనా బహుళజాతి కంపెనీ హయర్కు చెందిన ‘జీఈ ఆప్లయన్సెస్’లు గద్వాలలో సంయుక్తంగా ఏర్పాటు చేసేందుకు ముందుకొచ్చాయి. ఆ దిశగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది.