
జోగుళాంబ క్షేత్రంలో భక్తుల సందడి
అలంపూర్: అష్టాదశ శక్తిపీఠాల్లో ఒకటైన అలంపూర్ జోగుళాంబ అమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తుల పోటెత్తారు. సెలవు దినం కావడంతో వివిధ ప్రాంతాలకు చెందిన భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు జోగుళాంబ అమ్మవారి ఆలయాల్లో కుంకుమార్చన పూజలు, బాలబ్రహ్మేశ్వర స్వామి వారి ఆలయాల్లో అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. పాఠశాలలు, కళాశాలల వేసవి సెలవులు ముగియనుండటంతో భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చారు. దీనికి తోడు మృగశిరకార్తె కావడంతో రైతులు, వ్యవసాయ సంబంధిత వ్యాపారులు సైతం తెల్లవారుజాము నుంచే రావడం జరిగింది. దీంతో పట్టణ పురవీధులు వాహనాలతో రద్దీగా మారాయి. దూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్థానిక పుష్కర ఘాట్లో స్నానాలు అచరించి స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అర్చకులు భక్తులకు తీర్ధ ప్రసాదాలు అందజేసి వేద ఆశీర్వచనం పలికారు. జోగుళాంబ రైల్వే హాల్ట్ వద్ద గేట్ పడిన ప్రతి సారి ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. ఆలయ అధికారులు భక్తులకు తగు సౌకర్యాలు కల్పించారు. స్థానిక అన్నదాన సత్రంలో భక్తులకు అన్నప్రసాద వసతి కల్పించారు.