
దరఖాస్తుల ఆహ్వానం
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: స్థానిక పిల్లలమర్రి సమీపంలోని తెలంగాణ సోషల్ వెల్ఫేర్ మహిళా డిగ్రీ కళాశాలలో వివిధ కోర్సులలో చేరేందుకు విద్యార్థినులు దరఖాస్తు చేసుకోవచ్చని టీజీఎస్డబ్ల్యూఆర్డీసీ (డబ్ల్యూ) ప్రిన్సిపాల్ డా.జె.జయప్రద ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇక్కడ బీఎస్సీ–ఎంపీసీ, ఎంపీసీఎస్, బీజెడ్సీ, ఎంజెడ్సీ, ఎంఎస్సీఎస్/ఎంఎస్డీఎస్, బీకాం (కంప్యూటర్స్), బిజినెస్ అనాలటిక్స్, బీఏ హెచ్ఈపీలలో సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. వీటిలో ప్రవేశం పొందాలనుకునే ఇంటర్ పాసైన వారు ఈనెల 23వ తేదీలోగా నేరుగా కళాశాలలో దరఖాస్తులను అందజేయాలని పేర్కొన్నారు. పదో తరగతి, ఇంటర్ మెమోలు, టీసీ, బోనఫైడ్, తాజా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ జిరాక్స్లతో పాటు ఐదు పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు జత చేయాలన్నారు. పూర్తి వివరాలకు సెల్ నంబర్లు 79950 10679, ఆమె 94901 16872లలో సంప్రదించవచ్చని సూచించారు.
‘డబుల్’ పేరుతో బీఆర్ఎస్ మాయమాటలు
అడ్డాకుల: గత బీఆర్ఎస్ ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇళ్ల పేరుతో మాయమాటలు చెప్పి ప్రజలను మోసం చేసిందని ఎమ్మెల్యే జి.మధుసూదన్రెడ్డి విమర్శించారు. ఆదివారం అడ్డాకులలో 47 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల మంజూరు పత్రాలను అందజేశారు. అలాగే ఇళ్ల నిర్మాణాలకు భూమిపూజ చేసి పనులు ప్రారంభించి మాట్లాడారు. ఇళ్లు లేని నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లను అందజేసి వారికి ఆవాసం కల్పించడానికి ప్రభుత్వం ఒక్కో ఇంటికి రూ.5 లక్షలు మంజూరు చేస్తోందన్నారు. లబ్ధిదారులకు దశల వారికి ఇళ్ల బిల్లులను వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామని చెప్పారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగోలేకున్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ పేదల సంక్షేమానికి తమ ప్రభుత్వం కృషిచేస్తుందన్నారు. అలాగే తమ ప్రభుత్వం అర్హులకు రేషన్ కార్డులను అందించే ప్రక్రియ చేపట్టిందని తెలిపారు. పనిచేసే తమ ప్రభుత్వానికి ప్రజల ఆశీర్వాదాలు అవసరమని, వచ్చే స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించి అభివృద్ధికి పట్టం కట్టాలని కోరారు. కార్యక్రమంలో పార్టీ మండలాధ్యక్షుడు శ్రీహరి, అరవింద్రెడ్డి, జగదీశ్వర్, విజయమోహన్రెడ్డి, దశరత్రెడ్డి, లక్ష్మీనారాయణ, శేఖర్రెడ్డి, శ్రీనివాస్రెడ్డి, సయ్యద్ షఫి, రంజిత్, పరశురాములు, రాజు, రాములు పాల్గొన్నారు.
లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకెళ్లాలి
మహబూబ్నగర్ మున్సిపాలిటీ: సమయం ఎంతో విలువైందని, సద్వినియోగం చేసుకుంటే జీవితంలో ఉన్నత శిఖరాలకు చేరుకోవచ్చని ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్రెడ్డి అన్నారు. ఆదివారం జిల్లాకేంద్రంలోని వల్లభ్నగర్లో పంచతత్వ యువ ఊర్జా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సుమారు నెల రోజుల పాటు చిన్నారులకు వేసవి శిక్షణ శిబిరం నిర్వహించారు. ఆదివారం రాత్రి ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. త్వరలోనే పాఠశాలలు పునః ప్రారంభమవుతున్నందున చదువుపై ప్రత్యేకంగా దృష్టిపెట్టాలన్నారు. దీని వల్ల జ్ఞానంతోపాటు ఉత్తమ మార్గాన్ని, భవిష్యత్ను అందిస్తుందన్నారు. ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, అందుకనుగుణంగా ముందుకు సాగాలని సూచించారు. అలాగే సెలవులు వృథా కాకుండా పిల్లలకు చెస్, కరాటే, సంప్రదాయ నృత్యాలు, భగవద్గీత, స్పోకెన్ ఇంగ్లిష్ నేర్పించిన నిర్వాహకులను అభినందించారు. అనంతరం విద్యార్థులకు అవార్డులు ప్రదానం చేశారు. కాగా, వారు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆనంద్గౌడ్, వన్టౌన్ సీఐ అప్పయ్య, ఫౌండేషన్ సభ్యులు సాయికుమార్, నవీన్, ప్రశాంత్, నాయకులు రఘు, అక్బర్ తదితరులు పాల్గొన్నారు.
కోయిల్సాగర్లో
పెరుగుతున్న నీటిమట్టం
దేవరకద్ర: కోయిల్సాగర్ ప్రాజెక్టులో నీటిమట్టం క్రమంగా పెరుగుతోంది. ప్రాజెక్టులో ప్రస్తుతం 11.7 అడుగుల మేర నీటిమట్టం నిల్వ ఉంది. పాత అలుగు స్థాయి నీటిమట్టం 26.6 అడుగులు కాగా.. గేట్ల స్థాయి వరకు 32.6 అడుగులు. జూరాల ఎత్తిపోతల పథకం నీటి విడుదల ఇలాగే కొనసాగితే ఈ నెలాఖరు వరకు పాత అలుగుకు నీటిమట్టం చేరే అవకాశం ఉంది.

దరఖాస్తుల ఆహ్వానం