
వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి
ఖిలా వరంగల్: రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఓ యువకుడు వరంగల్లోని సంరక్ష ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. దీనికి వైద్యుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపిస్తూ మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. ఈవిషయం తెలిసిన వెంటనే ఏసీపీ నందిరామ్నాయక్.. మిల్స్కాలనీ ఎస్సై శ్రీకాంత్, స్పెషల్ పోలీసులతో కలిసి ఘటనా స్థలికి చేరుకున్నారు. ఆందోళనకారులకు నచ్చచెప్పడంతో వారు ఆందోళన విరమించి మృతదేహాన్ని స్వగ్రామం తరలించారు. పోలీసులు, మృతుడి బంధువుల కథనం ప్రకారం.. వరంగల్ జిల్లా గీసుగొండ మండలం మొగిలిచర్లకు చెందిన కొత్తపెల్లి రమణ (28) కాంగ్రెస్ పార్టీ యూత్ లీడర్గా కొనసాగుతున్నాడు. శనివారం మధ్యాహ్నం 2గంటల సమయంలో ద్విచక్రవాహనంపై నగరానికి వచ్చాడు. పనులు ముగించుకుని అనంతరం ఇంటికి బయలుదేరాడు. మొగిలిచర్ల గ్రామంలోని ప్రధాన రహదారిపై రాత్రి 11.30 గంటల సమయంలో గూడ్స్ వాహనం.. బైక్ను వెనక నుంచి ఢీకొంది. దీంతో రమణ రోడ్డుపై పడడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. హుటాహుటిన బంధువులు 108లో రమణను వరంగల్లోని సంరక్ష ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం మృతి చెందాడని వైద్యులు పేర్కొన్నారు. ఈవిషయం తెలిసి మృతుడి కుటుంబీకులు, బంధువులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. వైద్యుల నిర్లక్ష్యంతోనే (వైద్యం వికటించడంతోనే) తమ కుమారుడు మృతి చెందాడంటూ కుటుంబ సభ్యులు, బంధువులు ఆందోళన చేపట్టారు. ఈ విషయం తెలిసిన పోలీసులు ఆసత్రి వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఏసీపీ నందిరామ్ నాయక్.. వైద్యులు, బంధువులతో మాట్లాడి ఆందోళన విరమింపజేశారు. అనంతరం గీసుగొండ పోలీస్ స్టేషన్లో మృతుడి తండ్రి కొత్తపెల్లి భిక్షపతి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్స్పెక్టర్ మహేందర్ తెలిపారు.
కుటుంబీకులు, బంధువుల ఆరోపణ
సంరక్ష ఆస్పత్రి ఎదుట ఆందోళన
ఘటనాస్థలికి చేరుకుని ఆందోళన
విరమింజేసిన పోలీసులు

వైద్యుల నిర్లక్ష్యంతోనే యువకుడి మృతి