
పంట అవశేషాలను కాల్చొద్దు..
మహబూబాబాద్ రూరల్ : వరి, పత్తి, మొక్కజొన్న పంటలు సాగు చేసిన రైతులు కోతలు పూర్తయ్యాక పంట అవశేషాలను కాల్చకుండా నేలలో కలియదున్నాలని మహబూబాబాద్ మండలంలోని మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ ఎస్.మాలతి, పంట ఉత్పత్తి శాస్త్రవేత్త బి.క్రాంతికుమార్ రైతులకు సూచిస్తున్నారు. దేశంలో ప్రతీ సంవత్సరం 500 నుంచి 600 మిలియన్ టన్నుల పంట అశేషాలు ప్రధానంగా వరి, పత్తి, మొక్కజొన్న నుంచి ఉత్పన్నమవుతున్నాయన్నారు. ఇందులో 20 నుంచి 30 శాతం వరకు రైతులు కాల్చివేస్తున్నారని, తద్వారా పర్యావరణ సమస్యలు తలెత్తుతాయని తెలిపారు. గ్రామాల్లో రైతుల స్థితిగతులు మారి పశువుల, మూగజీవుల పెంపకం తగ్గడం వల్ల పశుగ్రాసం వాడడం లేదన్నారు. ఈ అవశేషాలు ప్రధానంగా పంజాబ్, హరియాణా, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికంగా కాల్చడం వల్ల వాటి పక్కన ఉన్న ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో భారీస్థాయిలో గాలి కాలుష్యం నమోదవుతోందని గుర్తు చేశారు. ఇక్కడ ప్రధాన సమస్య వరి, గోధుమ, మొక్కజొన్న, పప్పు దినుసు పంటలను కాల్చివేయడమని, తెలంగాణ రాష్ట్రంలో సగటున 30 నుంచి 40శాతం వరి, 90 నుంచి 95శాతం పత్తి అవశేషాలను కాల్చివేస్తున్నారన్నారు.
కలియదున్నండి
మల్యాల కృషి విజ్ఞాన కేంద్రం
సమన్వయకర్త మాలతి
రైతులకు సూచనలు