
నిర్వహణ భారం
తొర్రూరు: గ్రామ పంచాయతీల్లో పరిశుభ్రతే లక్ష్యంగా చెత్త సేకరణ నిమిత్తం గత ప్రభుత్వ హయాంలో ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. గ్రామాల్లో జనాభాకు అనుగుణంగా ట్రాక్టర్తో పాటు ట్రక్కు, ట్యాంకర్లను తీసుకున్నారు. వాటితో చెత్త సేకరణతో పాటు మొక్కలకు నీటిని సరఫరా చేశారు. పాలకవర్గాలు ఉన్న సమయంలో ట్రాక్టర్ కిస్తీలతో పాటు నిర్వహణ సక్రమంగా ఉండేది. ప్రత్యేక పాలన వచ్చిన తర్వాత పంచాయతీలకు నిధులు రాకపోవడంతో వాటి నిర్వహణ అస్తవ్యస్తంగా మారింది. ట్రాక్టర్లు మరమ్మతు చేయించలేక అధికారులు చేతులెత్తేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో కొన్ని నెలలుగా చెత్త సేకరణ నత్తనడకన సాగుతుండగా, చిన్న పంచాయతీల్లో పూర్తిగా నిలిచిపోయింది. కిస్తీలు చెల్లించలేక, మరమ్మతులు చేయించలేని పరిస్థితి ఉండడంతో పల్లెల్లో అపరిశుభ్రత తాండవిస్తోంది.
మరమ్మతులు చేయించలేక...
జిల్లాలో 461 పంచాయతీలుండగా అన్ని చోట్ల చెత్త సేకరణ కోసం ట్రాక్టర్లను కొనుగోలు చేశారు. వాటికి సంబంధించిన కిస్తీలు ప్రతినెల రూ.6 వేల నుంచి రూ.12 వేల వరకు చెల్లించాల్సి ఉండగా పంచాయతీల్లో నిధులు లేక ఏడాదిన్నర కాలంగా పెండింగ్లో ఉన్నాయి. పంచాయతీల్లో ఉన్న కొద్ది నిధులు పారిశుద్ధ్య పనులకే సరిపోతుండగా మిగతా పనులకు ఆటంకంగా మారింది. ట్రాక్టర్లు తీసుకుని ఐదేళ్లు దాటడంతో తరచూ మరమ్మతులకు గురవుతున్నాయి. వాటిని బాగు చేయించాలంటే రూ.30 వేల వరకు ఖర్చవుతుండడంతో పంచాయతీలకు భారంగా మారింది. కనీసం డీజిల్కు డబ్బులు లేక కొన్ని పల్లెల్లో వారానికి ఓసారి మాత్రమే చెత్త సేకరణ చేస్తున్నారు. పెద్ద పంచాయతీల్లో డీజిల్, కిస్తీలకు సంబంధించిన నగదు సర్దుబాటు చేస్తున్నా.. చిన్న పంచాయతీల్లో మాత్రం ట్రాక్టర్లు తిప్పలేని పరిస్థితి ఉంది.
చిన్న పంచాయతీల్లో తిప్పలు..
జిల్లాలోని దంతాలపల్లి, పెద్దవంగర, గంగారం, చిన్న గూడూరు, ఇనుగుర్తి, సీరోలు తదితర మండలాల్లోని చిన్న పంచాయతీల్లో పన్నుల రూపంలో వచ్చే ఆదాయం రూ.50 వేల లోపే. ఇప్పటికే విద్యుత్ దీపాలు, బ్లీచింగ్, సభలు నిర్వహించిన సందర్భాల్లో షామియానాలు, భోజనాల ఖర్చులకు అప్పులు చేస్తున్నారు. నిధుల కొరతతో ట్రాక్టర్లకు డీజిల్ ఖర్చులెందుకని ప్రకృతి వనాలకు నీళ్లు పో యడం కూడా విస్మరిస్తున్నారు. మరో పక్క బ్యాంకులు బకాయిలు చెల్లించనందుకు వడ్డీ వేస్తూనే.. ఇంకో పక్క వాహనం సీజ్ చేస్తామని నోటీసులు జారీ చేస్తున్నారు.
ఆటంకాలను అధిగమించి చెత్త సేకరణ చేస్తున్నాం
పంచాయతీల్లో ట్రాక్టర్ల నిర్వహణకు సంబంధించి నిధుల కొరత వాస్తవమే. ప్రభుత్వం నుంచి ఏ నిధులు వచ్చినా మొదటి ప్రాధాన్యం ట్రాక్టర్లకు ఇస్తున్నాం. ఏదో రకంగా చెత్తను సేకరిస్తూ గ్రామాలను స్వచ్ఛంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నాం.
– ఆర్. పుల్లారావు, డీఎల్పీఓ, తొర్రూరు
గుదిబండగా జీపీ ట్రాక్టర్ల మెయింటనెన్స్
డీజిల్కు నగదు లేక మూలకు పడుతున్న వైనం
గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం

నిర్వహణ భారం

నిర్వహణ భారం