
‘పది’ ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ప్రథమస్థానంలో నిలిచిన మానుకోట
నాలుగు నెలలు ప్రత్యేక ప్రణాళిక అమలు
విద్యార్థుల దత్తతతో మంచి ఫలితాలు
అధికారి నుంచి అటెండర్ వరకు శ్రమించిన వైనం
సాక్షి, మహబూబాబాద్: గిరిజనులు, ఆదివాసీలు అధికంగా ఉన్న మానుకోట జిల్లా పదో తరగతి ఫలి తాల్లో ప్రభంజనం సృష్టించింది. ఫలితాల్లో రాష్ట్రంలోనే ప్రథమస్థానంలో నిలిచి ఔరా అనిపించుకుంది. కాగా ఈ అద్భుత విజయం వెనుక విద్యాశాఖ అధికారులు, ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు,సిబ్బంది భాగస్వామ్యం, కఠోర శ్రమ ఉండగా.. విద్యార్థులు పట్టుదలతో ఉత్తమ మార్కులు సాధించి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చారు.
నాలుగు నెలల ప్రణాళిక
పదో తరగతి ఫలితాలే జిల్లా విద్యాశాఖ పనితీరుకు నిదర్శనంగా నిలుస్తాయి. ఇంతటి ప్రాధాన్యత ఉన్న పదో తరగతి ఫలితాలపై కలెక్టర్ అద్వైత్ కుమార్ సింగ్, అదనపు కలెక్టర్ లెనిన్ వత్సల్ టొప్పో, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ రెడ్డి ప్రత్యేక ప్రణాళిక రూపొందించారు. దానిని పకడ్బందీగా అమలు చేసి ఫలితాల్లో రాష్ట్రంలోనే ముందు వరుసలో నిలిపారు. ప్రధానంగా పరీక్షలకు ముందు అంటే నవంబర్ నుంచి ఫిబ్రవరి వరకు నాలుగు నెలల ప్రణాళిక రూపొందించారు. ప్రతీరోజు స్లిప్ టెస్ట్ పెట్టడం, విద్యార్థుల ప్రతిభను గుర్తించడంతోపాటు చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టే అవకాశం వచ్చింది. అదే విధంగా పరీక్షలకు ముందు ప్రతీ పాఠశాలకు ప్రత్యేక మెటీరియల్ పంపించి వార్షిక పరీక్షలను పోలిన పేపర్లతో పరీక్షలు రాయించారు. ఈ ప్రయోగమే మెరుగైన విద్యార్థులకు మరింత మెరుగ్గా, వెనకబడిన వారు కనీస ఉత్తీర్ణత స్థాయికి వచ్చారు.
మూడు సంవత్సరాల్లో ఎంతో మార్పు
గత మూడు సంవత్సరాలుగా పదో తరగతి ఫలితాలను చూస్తే అనూహ్య మార్పు వచ్చినట్లు స్పష్టం అవుతుంది. 2022–23 సంవత్సరంలో రాష్ట్రంలో మానుకోట జిల్లా 22వ స్థానంలో ఉంది. 2023–24 సంవత్సరంలో కాస్త పైకి వచ్చి 12వ స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఏకంగా అన్ని జిల్లాలను కిందకు నెట్టి మానుకోట మొదటి స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ స్కూల్స్ విజయ ఢంకా
ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ప్ర భుత్వ, ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో చదివే విద్యార్థులు సత్తా చాటి విజయ ఢంకా మోగించారు. జిల్లాలోని 18 ఆశ్రమ పాఠశాలల్లో గత ఏడాది 91.88శాతం ఉత్తీర్ణత సా ధించారు. ఐదు సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్లో గత ఏడాది 97.12 శాతం ఉత్తీర్ణత సాధించగా.. ఈ ఏడాది రెండింటిలో నూరు శాతం ఉత్తీర్ణత సాధించారు. ఐదు ట్రైబల్ వెల్ఫేర్ పాఠశాలల్లో గత ఏడాదికి త గ్గకుండా నూరుశాతం ఉత్తీర్ణత పొందారు. ఇలా బీసీ వెల్ఫేర్లో 98.62 నుంచి నూరుశాతం ఉత్తీర్ణకు చేరా రు. కేజీబీవీలు, మోడల్ స్కూ ల్స్ అన్ని కేటగిరీల్లో గతం కన్నా మెరుగైన ఉత్తీర్ణత పొంది జిల్లాను రాష్ట్రంలో ప్రథమంగా నిలిపారు.
మూడేళ్లుగా ఫలితాలు ఇలా..
సంవత్సరం హాజరైన పాసైన రాష్ట్రంలో
విద్యార్థులు విద్యార్థులు జిల్లా స్థానం
2022–23 8,461 7,227 22
2023–24 8,178 7,738 12
2024–25 8,184 8,126 01
మేనేజ్మెంట్ వారీగా ఉత్తీర్ణత వివరాలు
పాఠశాల 2023–24 2024–25
ఉత్తీర్ణతశాతం ఉత్తీర్ణతశాతం
ఎయిడెడ్ 88.89 85.71
ఆశ్రమ 91.89 99.08
బీసీ వెల్ఫేర్ 98.62 100.00
ప్రభుత్వ 97.25 94.74
కేజీబీవీ 94.58 99.80
మోడల్ స్కూల్స్ 98.48 99.59
ప్రైవేట్ 98.22 99.90
మైనార్టీ రెసిడెన్షియల్ 99.46 98.80
సోషల్ వెల్ఫేర్ 97.12 100.00
ట్రైబల్ వెల్ఫేర్ 100.00 100.00
జిల్లా పరిషత్ 90.40 98.80
దత్తత కార్యక్రమంతో..
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులను ఆ స్కూళ్లలో బోధించే ఉపాధ్యాయులు దత్తత తీసుకునే కార్యక్రమం మొదలు పెట్టారు. ఇలా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యను బట్టి ఒక్కో ఉపాధ్యాయుడు ఐదు నుంచి పది మంది విద్యార్థులను దత్తత తీసుకున్నారు. ఆ విద్యార్థులు క్రమం తప్పకుండా పాఠశాలకు, ప్రత్యేక తరగతులకు హాజరయ్యేలా చూడడం, అ దేవిధంగా విద్యార్థి ఇంటివద్ద ప్రశాంత వాతావరణంలో చదువుకునేలా తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇవ్వడం, తరచూ తల్లిదండ్రులతో దత్తత తీసుకున్న ఉపాధ్యాయుడు మాట్లాడి సమస్యలు ఉంటే పరిష్కరించే ప్రయత్నం చేశారు. దీంతో విద్యార్థులకు తల్లిదండ్రులకు చదువుపై నమ్మకం కలిగించేలా చేశారు