45 మంది వైద్యులు.. 74 మంది సిబ్బందితో సేవలు
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో ముగ్గురు ప్రొఫెసర్లు, ఆరుగురు అసోసియేట్ ప్రొఫెసర్లు, ఏడుగురు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు, ఒక సీఎస్ఆర్ఎంఓ, ఒక డిప్యూటీ ఆర్ఎంఓ, 27 మంది అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఉన్నారు. వీరిలో రేడియేషన్, సర్జికల్, మెడికల్ ఆంకాలజిస్టులు, ప్లాస్టిక్ సర్జన్లు, పెథాలజి, మైక్రోబయాలజీ, బయోకెమిస్ట్రీ, అనెస్తీషియా, గ్యాస్ట్రో ఎంట్రాలజిస్టులు, సైకియాట్రిస్టులు ఉన్నారు. వీరితో పాటు ఇద్దరు నర్సింగ్ సూపరింటెండెంట్లు, 40 మంది స్టాఫ్నర్సులు, 16 మంది పారామెడికల్ సిబ్బంది, ఆరుగురు నాల్గవ తరగతి సిబ్బంది పనిచేస్తున్నారు.
కర్నూలు(హాస్పిటల్): కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాలలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి 2012–2019 పంచ వర్ష ప్రణాళికలో కేంద్ర ప్రభుత్వం రూ.120కోట్లను మంజూరు చేసింది. ఇందులో 60శాతం కేంద్రం, 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నిధులు విడుదల చేసేలా ఒప్పందం కుదిరింది. ఇన్స్టిట్యూట్ నిర్మాణానికి సాంకేతిక సహకారం కోసం టాటా ట్రస్ట్తో అప్పటి రాష్ట్ర ప్రభుత్వం 2017 జూన్లో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ పలుమార్లు పరిశీలనలు, చర్చలు చేపట్టాక టాటా ట్రస్ట్ 2018 నవంబర్లో తుదిరూపునిచ్చారు. ఈ ఆసుపత్రిలో రెండు లీనియర్ యాక్సిలరేటరిలు, ఒక సీటీ సిమ్యులేటర్, ఒక హైడోస్ రేట్ బ్రాకోథెరపి మిషన్ల ఏర్పాటుకు అవసరమైన నాలుగు బంకర్ల నిర్మాణానికి అప్పట్లో టాటా అటానమిక్ ఎనర్జీ అనుమతులు మంజూరు చేశారు. అన్ని అనుమతులు లభించాక 2019 జనవరిలో స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్కు శంకుస్థాపన చేశారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో పనులు నిలిచిపోయాయి. ఆ తర్వాత కోవిడ్ రావడం, ఇతరత్రా కారణాలతో భవన నిర్మాణం ముందుకు సాగలేదు. ఈ నేపథ్యంలో 2022లో క్యాన్సర్ విభాగానికి రేడియేషన్ థెరపి ఎండీ పీజీ సీటును నేషనల్ మెడికల్ కౌన్సిల్ మంజూరు చేసింది. ఈ క్రమంలో అప్పట్లో ఆగిపోయిన నిధులను రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసి పనులు ప్రారంభమయ్యేలా చేసింది. 2024 మార్చి నాటికి భవన నిర్మాణ పనులు పూర్తయ్యాయి.
‘కె’ ఆకారంలో భవన నిర్మాణం
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ను కర్నూలులోని ‘కె’ అక్షరం స్ఫూరించేలా నిర్మించారు. ఇందులో సివిల్ పనులు పూర్తి కావడం, ముఖ్యమైన లీనియర్ యాక్సిలరేటరి, సీటీ సిమ్యులేటర్ యంత్రాలు రావడంతో 2024 మార్చి 7న అప్పటి ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్రెడ్డి ఈ ఆసుపత్రిని ప్రారంభించారు. అనంతరం ఓపీ సేవలకు సైతం శ్రీకారం చుట్టారు. అయితే ఆసుపత్రిని పూర్తిస్థాయిలో ప్రారంభించాలంటే అవసరమైన వైద్యపరికరాలు, వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టాల్సి ఉండగా తీవ్ర జాప్యం జరిగింది. ఈ విషయమై ‘సాక్షి’లో వరుస కథనాలు రావడంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించి నిధులు విడుదల చేసి పూర్తిస్థాయిలో ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసింది. వైద్యపరికరాలు, అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్లు, ఆక్సిజన్ పైప్లైన్ ఏర్పాటు, అవసరమైన 120 పడకలు, ఐసీయూ బెడ్స్ తదితరాలను ఏర్పాటు చేశారు.
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో అత్యాధునిక పద్ధతుల్లో అరుదైన శస్త్రచికిత్సలను నిర్వహిస్తున్నాం. ప్రతిరోజూ ఓపీ 20 నుంచి 25, ఐపీ 120 పడకల్లో రోగులకు చికిత్స అందుతోంది. రోజూ డే కేర్ కీమోథెరపీ 10 మందికి అందిస్తున్నాం. పది మంది రోగులు రోజూ అడ్మిషన్ పొందుతున్నారు. ఐసీయూలో ఆరు పడకలు ఉండగా నిత్యం నలుగురైదుగురికి చికిత్స అందుతోంది. అర్హులైన రోగులందరికీ ఉచితంగా చికిత్స చేస్తున్నాం.
– డాక్టర్ సీఎస్కే ప్రకాష్,
డైరెక్టర్, స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, కర్నూలు
క్యాన్సర్కు సంబంధించిన అన్ని రకాల శస్త్రచికిత్సలను కర్నూలులోని స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో విజయవంతంగా నిర్వహిస్తున్నారు. కార్పొరేట్ ఆసుపత్రిని తలదన్నే వసతులు, సౌకర్యాలు, వైద్య పరికరాలతో రాయలసీమ ప్రజలకు ఉత్తమ వైద్యసేవలు అందిస్తున్నారు. 45 మంది నిష్ణాతులైన వైద్యులు, 70 మందికి పైగా నర్సులు, పారామెడికల్ సిబ్బంది నిత్యం అందుబాటులో ఉంటూ రోగులకు ప్రాణం పోస్తున్నారు. ఆసుపత్రికి వెళితే కార్పొరేట్ స్థాయి అనుభూతి కలిగేలా నిర్మాణం పూర్తి చేసుకోవడం విశేషం.
స్టేట్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్లో
అత్యాధునిక పరికరాలు
అరుదైన శస్త్రచికిత్సలు చేస్తున్న వైద్యులు
అన్ని రకాల క్యాన్సర్లకు ఆధునిక చికిత్స
నిత్యం 120 పడకలు ఫుల్
ఆసుపత్రి నిర్మాణంలో
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం చొరవ
ప్రస్తుతం ఒక ఆపరేషన్ థియేటర్లోనే
చికిత్స
మరో రెండు థియేటర్లు వస్తే
మెరుగైన వైద్యం
కర్ణాటక రాష్ట్రం బళ్లారి పట్టణానికి చెందిన 70 ఏళ్ల ధర్మరాజుకు రెండు నెలల క్రితం కడుపునొప్పి, ఉబ్బరం తదితర సమస్యలతో ఆసుపత్రికి వచ్చారు. పరీక్షలు నిర్వహించగా డియోడినం మూడో భాగంలో 7 సెంటిమీటర్ల న్యూరో ఎండోక్రైన్ ట్యూమర్ అనే అరుదైన క్యాన్సర్ను గుర్తించారు. లిమిటెడ్ రిసెప్షన్ ఆఫ్ డియోడినం అనే ఆపరేషన్ నిర్వహించి అతనికి ఊపిరి పోశారు.
కర్నూలుకు చెందిన 69 ఏళ్ల ఎం.రాజశేఖర్ బీపీకి నాలుగు రకాల మందులు వాడేవాడు. ఇది ఎందుకు అని పరీక్షించగా అతనికి కుడి పక్క కిడ్నీపైన జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే అరుదైన బీపీని పెంచే గడ్డ ఉందని గుర్తించారు. ఆపరేషన్ చేసి 12 సెంటిమీటర్ల జెయింట్ ఫియోక్రోమోసైటోమా అనే కణితిని తొలగించారు. ఆ తర్వాత ఎలాంటి మందుల అవసరం లేకుండానే బీపీ నియంత్రణలోకి వచ్చింది.
45 మంది వైద్యులు.. 74 మంది సిబ్బందితో సేవలు


