
వెన్నుపోటు దినానికి వలంటీర్ల మద్దతు
కర్నూలు(సెంట్రల్)/ బొమ్మలస్రతం: వైఎస్ఆర్ కాంగ్రెస్పార్టీ ఈ నెల 4న నిర్వహించనున్న వెన్నుపోటు నిరసన దినానికి వలంటీర్ల సంపూర్ణ మద్దతు ఉంటుందని నంద్యాల, కర్నూలు జిల్లా వలంటీర్ల సంఘం అధ్యక్షులు హరికృష్ణ, నూర్ అహ్మద్ తెలిపారు. చంద్రబాబునాయుడు వెన్నుపోటుకు మొదట బలైంది వలంటీర్లేనని, రూ.10 వేల జీతం ఇస్తానని ఊడదీయడంతో ఉపాధి లేకుండా రోడ్డన పడ్డామని ఆవేదన వ్యక్తం చేశారు. తమనే కాకుండా సమాజంలోని మహిళలు, వృద్ధులు, యువకులు, విద్యార్థులు, నిరుద్యోగులు, ఉద్యోగులకు కూడా వెన్నుపోటు పోడిచారన్నారు. ఎండీయూ బండ్లను నడుపుకొని ఉపాధిని తొలగించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా ప్రతి వర్గాన్ని మోసం చేసిన చంద్రబాబునాయుడుకు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. వెన్నుపోటు దినానికి వలంటీర్లు పెద్ద ఎత్తున హాజరై మద్దతు తెలపాలని ఆయన కోరారు.
జలప్రసాద కేంద్రంలో
మంటలు
మహానంది: మహానంది దేవస్థానం ప్రాంగణంలోని బుకింగ్ కౌంటర్ (చిన్న గేటు) వైపు ఉన్న జలప్రసాద కేంద్రంలో సోమవారం మంటలు ఎగిసిపడ్డాయి. ఎలక్ట్రికల్ విభాగం సిబ్బంది శ్రీనివాసులు, దశరథ మరమ్మతులు చేస్తుండగా తీగల వద్ద షార్ట్ సర్క్యూట్ అవడంతో మంటలు చెలరేగాయి. దీంతో వారు వెంటనే అప్రమత్తమై పరుగులు తీస్తూ బయటికి చేరుకుని విద్యుత్ సరఫరా నిలిపివేసి సరిచేయడంతో ప్రమాదం తప్పింది.
పురుగు మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆస్పరి: మండల కేంద్రానికి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద సోమవారం ఓ వ్యక్తి పురుగు మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు హెడ్ కానిస్టేబుల్ ప్రభాకర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాలు.. సి.బెళగల్ మండలం పోలకల్ గ్రామానికి చెందిన మంగళి నాగేశ్ (45)కు భార్య సుజాత ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. వీరిలో పెద్దకూతురు లక్ష్మికి వివాహం చేశారు. నాగేశ్ పోలకల్ గ్రామం నుంచి కర్నూలులో ఉంటున్న కూతురు లక్ష్మి, అల్లుడు శివ వద్దకు వెళ్లి రెండు రోజులు అక్కడే ఉన్నాడు. మద్యం అలవాటు ఉన్న నాగేశ్కు మతిస్థిమితం సరిగా లేదు. ఈ క్రమంలో సోమవారం ఆస్పరి సమీపంలోని శ్మశాన వాటిక వద్ద పురుగు మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అటుగా పొలాలకు వెళ్లే రైతులు గమనించి స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వెళ్లి చూసేసరికి నాగేశ్ మృతి చెందాడు. ఈ విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలపడంతో భార్య సుజాత, కుటుంబసభ్యులు వచ్చి మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. భార్య సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు.