
రేపు రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డుల ప్రదానం
లబ్బీపేట(విజయవాడతూర్పు): జాతీయ వైద్యుల దినోత్సవాన్ని పురస్కరించుకుని వృత్తిపట్ల నిబద్ధత, సేవాభావంతో సేవలందిస్తున్న వైద్యులను రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులతో సత్కరించనున్నట్లు రూట్స్ హెల్త్ ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ పోలవరపు విజయభాస్కర్ తెలిపారు. ఈ నెల 6వ తేదీన ఇచ్చే అవార్డులకు ఏపీ, తెలంగాణాకు చెందిన పలువురు వైద్యులను ఎంపిక చేసినట్లు తెలిపారు. నగరంలోని ఓ హోటల్లో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో అవార్డుల ప్రదానోత్సవ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డాక్టర్ విజయభాస్కర్ మాట్లాడుతూ మొగల్రాజపురం సిద్ధార్థ ఆడిటోరియంలో జరిగే ఈ కార్యక్రమంలో మంత్రి పార్థసారథి, జిల్లా కలెక్టర్ లక్ష్మీశలు అతిథులుగా పాల్గొని అవార్డులను ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. గుంటూరుకు చెందిన కార్డియాలజిస్ట్ డాక్టర్ ఆర్.మురళిబాబురావుకు జీవన సాఫల్య పురస్కారం ఇస్తున్నట్లు తెలిపారు. రూట్స్ హెల్త్ సర్వీసెస్ అవార్డులను విజయవాడకు చెందిన సీనియర్ జనరల్ సర్జన్ డాక్టర్ లింగమనేని సుబ్బారావు, ప్రముఖ గైనకాలజిస్ట్ డాక్టర్ అవిర్నేని శశిబాల, హైదరాబాద్కు చెందిన సీనియర్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్, ఆయుర్వేద విభాగంలో ఫిజీషియన్ డాక్టర్ ఏ గాయత్రీదేవి, న్యాచురోపతి విభాగంలో ఫిజీషియన్ డాక్టర్ చింతా రవికుమార్, సేవా రంగంలో హీల్ పేరడైజ్ చైర్మన్ డాక్టర్ కోనేరు సత్య ప్రసాద్కు అవార్డులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫౌండేషన్ సభ్యులు చందు శ్రీనివాస్, డాక్టర్ పద్మజ, జయకామేశ్వరి, కె.పూర్ణిమ తదితరులు పాల్గొన్నారు.