
సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ
గన్నవరం: స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో భారీ చోరీ జరిగిన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. అర్ధరాత్రి దొంగలు కార్యాలయంలోకి చొరబడి సుమారు రూ. 13.56లక్షల విలువైన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు, తోక బిళ్లలను అపహరించుకుపోయారు. పోలీసుల సమాచారం ప్రకారం.. స్థానిక చింతలపేటలోని సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో పనిచేసే అధికా రులు, సిబ్బంది బుధవారం సాయంత్రం విధులు ముగించుకొని తాళాలు వేసి ఇళ్లకు వెళ్లిపోయారు. తిరిగి గురువారం విధులకు హాజరైన సిబ్బంది కార్యాలయ తలుపు గొళ్లెం పగులకొట్టి ఉండడం గమనించి సబ్రిజిస్ట్రార్ వీవీవీ ప్రసాద్కు సమాచారం ఇచ్చారు. దీంతో కార్యాలయానికి చేరుకున్న సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలోని రికార్డు రూమ్ తలుపులు తీసి ఉండి స్టాంపులు భద్రపరిచిన బీరువా పగులకొట్టి ఉండడటాన్ని గుర్తించారు.
ఆధారాల సేకరణ..
సబ్రిజిస్ట్రార్ ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు కార్యాలయాన్ని పరిశీలించారు. రంగంలోకి దిగిన క్లూస్ టీమ్ దొంగల వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ రవీంద్రనాథ్, జిల్లా రిజిస్ట్రార్ మూర్తి, డీఎస్పీ సీహెచ్ శ్రీనివాసరావు, సీఐ బీవీ శివప్రసాద్ కార్యాలయాన్ని సందర్శించి అధికారులు, సిబ్బంది నుంచి చోరీ ఘటనపై వివరాలు సేకరించారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు నేతృత్వంలోని బృందం కార్యాలయ పరిసరాల్లోని సీసీ ఫుటేజ్లను సేకరించి దొంగలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ ఘటనపై సబ్రిజిస్ట్రార్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
ఇవి మిస్సింగ్..
సుమారు రూ.13,56,300 విలువైన రూ. 50 నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, రూ.100 ధర కలిగిన నాన్ జ్యూడీషియల్ స్టాంప్ పేపర్లు 3,600, తోక బిళ్లలు రూ.50 ధర కలిగినవి 12,500, రూ.100 ఖరీదు కలిగినవి 4,609 చోరీకి గురైనట్లుగా ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో ఉన్న సీసీ కెమెరాలు ఆఫ్ చేసి ఉండడం పట్ల ఆఫీస్లో పనిచేసే ప్రైవేట్ సిబ్బంది వ్యవహరశైలిపై పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు..
ఈ చోరీ ఘటన వల్ల గురువారం స్థానిక సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కార్యకలాపాలు పూర్తిగా నిలిచిపోయాయి. చోరీకి సంబంధించి పోలీసులు ఆధారాలు సేకరణ, విచారణ కారణంగా రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిచిపోయినట్లు సబ్ రిజిస్ట్రార్ ప్రసాద్ తెలిపారు. తిరిగి శుక్రవారం రిజిస్ట్రేషన్ ప్రక్రియ యథావిధిగా కొనసాగుతుందని పేర్కొన్నారు.
రూ.13.56లక్షల విలువైన స్టాంప్లు అపహరణ గన్నవరంలో నిలిచిపోయిన రిజిస్ట్రేషన్లు

సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో చోరీ