
విద్యారంగంలో ఫీజుల దోపిడీ అరికట్టాలి
ఆసిఫాబాద్రూరల్: విద్యాహక్కు చట్టాన్ని పకడ్బందీగా అమలు చేసి ఫీజుల దోపిడీ అరికట్టాలని గురువారం పీడీఎస్యూ ఆధ్వర్యంలో డీఈవో కార్యాలయంలో సిబ్బందికి వినతిపత్రం అందజేశారు. పీడీఎస్యూ జిల్లా ప్రధాన కార్యదర్శి తిరుపతి మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల పరిస్థి తి అధ్వానంగా ఉందని, తక్షణమే ప్రభుత్వ పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. జిల్లా వ్యాప్తంగా పుట్టగొడుగుల్లా ప్రైవేట్ పాఠశాలలు వెలిశాయని, వాటిల్లో ఇష్టానుసారంగా ఫీజులు దండుకుంటున్నారని ఆరోపించారు. కొన్ని పాఠశాలల్లో టై, బెల్ట్, పుస్తకాలు విక్రయిస్తూ విద్యాసంస్థల్లో వ్యాపారం చేస్తున్నారని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలల్లో పేద విద్యార్థులకు 25 శాతం సీట్లు కేటాయించాలన్నారు. కార్యక్రమంలో సంఘం నాయకులు సమీర్, హరీశ్ తదితరులు పాల్గొన్నారు.