
మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి
రాయచూరు రూరల్: రాయచూరు వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆవరణలో మొక్కల పెంపకానికి ప్రాధాన్యత కేటాయించి పర్యావరణాన్ని సంరక్షించాలని వైస్ చాన్సలర్ హన్మంతప్ప పేర్కొన్నారు. ఆయన శనివారం వర్సిటీలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించి మాట్లాడారు. భవిష్యత్తులో అధిక ఉష్ణోగ్రతల నుంచి రక్షణకు ప్రతి ఒక్క విశ్వవిద్యాలయాల్లో, ఇళ్ల ముందు మొక్కలు పెంచేలా విద్యార్థులు చైతన్యం తేవాలన్నారు.
సీఎం, డీసీఎం, హోం మంత్రి రాజీనామా చేయాలి
రాయచూరు రూరల్: ఆర్సీబీ విజయోత్సవ వేడుకలో 11 మంది మృతికి కారకులైన రాష్ట్రంలో అధికారం చెలాయిస్తున్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ప్రజా ప్రతినిధులు రాజీనామా చేయాలని బీజేపీ జిల్లాధ్యక్షుడు వీరనగౌడ డిమాండ్ చేశారు. శనివారం పాత్రికేయుల భవనంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. బెంగళూరులో ఆర్సీబీ విజయోత్సవం సందర్భంగా జరిగిన తొక్కిసలాట ఘటనకు నైతిక బాధ్యత వహించి ముఖ్యమంత్రి సిద్దరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, రాష్ట్ర హోం మంత్రి పరమేశ్వర్ తమ పదవులకు రాజీనామా చేయాలన్నారు.
సస్పెన్షన్ సరికాదు
హొసపేటె: బెంగళూరు పోలీస్ కమిషనర్ దయానంద్ సస్పెన్షన్ సరికాదని, వెంటనే వెనక్కు తీసుకోవాలని హొసపేటె వాల్మీకి నాయక సామాజికులు డిమాండ్ చేశారు. శనివారం నగరంలో నిరసన తెలిపారు. సస్పెన్షన్ను వాపసు తీసుకోవాలని, లేని పక్షంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని అసిస్టెంట్ కమిషనర్ వివేక్కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తాయప్ప, శ్రీనివాస్, జంబయ్య నాయక్ పాల్గొన్నారు.
రాయచూరులో భారీ వర్షం
రాయచూరు రూరల్: నగరంలో శనివారం భారీ వర్షం కురిసింది. ఎక్కడ చూసిన రోడ్లు బురదగుంటలుగా మారాయి. గంట పాటు కురిసిన వానకు రంగమందిరం వెనుక, జహీరాబాద్ కాలనీలో పెద్ద చెట్లు కూలిపోవడంతో విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కూరగాయల మార్కెట్ బురదమయంగా మారడంతో పాటు నీరు చేరడంతో కాయగూరలు తడిసి పోయాయి.
పండిట్ తారానాథ్ జయంతి
రాయచూరు రూరల్: నగరంలో పండిట్ తారానాథ్ 134వ జయంతిని ఆచరించారు. శుక్రవారం హందర్ద్ హైస్కూలులో తారానాథ్ చిత్రపటానికి పాఠశాల పాలక మండలి అధ్యక్షుడు శరత్ కళస పుష్పాంజలి ఘటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తారానాథ్ విద్యా రంగాభివృద్ధికి చేసిన సేవలను కొనియాడారు. సభ్యులు పురుషోత్తం ఇన్నాణి, అంబాపతి పాటిల్, శ్రీనివాస్, రాఘవేంద్ర తదితరులున్నారు.
11న తుంగభద్ర
నీటి విడుదలపై సమీక్ష
హొసపేటె: కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మూడు రాష్ట్రాల వరప్రదాయిని తుంగభద్ర డ్యాం కింద ప్రధాన ఎగువ కాలువ( టీబీ హెచ్ఎల్సీ) అంచనా నీటి కేటాయింపులపై కీలక టీబీ బోర్డు తొలి నీటి సమీక్ష సమావేశం ఈ నెల 11న జరగనుంది. ఈ విషయానికి సంబంధించి ఆంధ్ర, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన సంబంధిత ఎస్ఈలకు ఇప్పటికే తగిన సమాచారం పంపించారు. ఇందులో భాగంగా అనంతపురం హెచ్ఎల్సీ ఎస్ఈకు కబురు పంపారు. 11వ తేదీన వెబ్ ద్వారా నీటి సమీక్ష జరగనుంది. ప్రస్తుత 2025–26 వ సంవత్సరానికి సంబంధించి తుంగభద్ర జలాశయానికి ఎన్ని టీఎంసీల నీరు లభ్యం అవుతాయన్న దానిపై అంచనా వేస్తారు. అంచనాల ప్రకారం మండలి అధికారులు నీటి కేటాయింపులు చేస్తారు. బోర్డు కార్యదర్శి, వెబ్ ద్వారా జలాశయం పరిధిలో ఉన్న అన్ని ప్రాజెక్టుల ఎస్ఈలతో కలిసి చర్చిస్తారు. ఈ దఫా కురిసే వానలను పరిగణనలోకి తీసుకుని అంచనాలను తయారు చేస్తారు. అదే విధంగా ప్రధాన కాలువలకు ఎప్పుడు నీరు విడుదల చేస్తారన్న దానిపై కూడా కీలక నిర్ణయాన్ని తీసుకొంటారు.

మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి

మొక్కల పెంపకానికి ప్రాధాన్యత ఇవ్వాలి