
ఆలయాల్లో గాలి సతీమణి పూజలు
సాక్షి,బళ్లారి: కర్ణాటక మాజీ మంత్రి గాలి జనార్ధన్రెడ్డి సతీమణి లక్ష్మీ అరుణ గత నాలుగు రోజుల నుంచి రాష్ట్రంలో వివిధ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు చేస్తూ టెంపుల్ రన్ చేస్తున్నారు. జనార్ధన్రెడ్డిని మైనింగ్ కేసులో సీబీఐ ప్రత్యేక కోర్టు దోషిగా నిర్ధారించి ఏడేళ్ల జైలు శిక్ష విధించి చంచలగూడ జైలుకు తరలించిన సంగతి తెలిసిందే. అనంతరం ఆయనను మరో కేసులో విచారణ కోసం బెంగళూరులోని పరప్పన అగ్రహార జైలుకు తరలించారు. సీబీఐ కోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ జనార్ధన్రెడ్డి తరపున న్యాయవాదులు హైకోర్టును ఆశ్రయించారు. ఈనేపథ్యంలో తన భర్తకు మంచి జరగాలని ఆమె రాష్ట్రంలోని వివిధ ఆలయాల్లో పూజలు, హోమాలు చేయిస్తున్నారు. ఆంజనేయ స్వామి జన్మస్థలం అయిన అంజనాద్రిలో ప్రత్యేక పూజలు చేసిన అనంతరం పట్టాభిరామ ఆలయంలో పూజలు చేసి అనంతరం ఉడిపి శ్రీకృష్ణుడిని దర్శనం చేసుకొని అక్కడి స్వామిజీ ఆశీస్సులు పొందారు. అనంతరం కొల్లూరు మూకాంబిక ఆలయంలో పూజలు, హోమాలతో పాటు శత్రు నివారణ సంకష్ట పూజలను కూడా నిర్వహించారు. అక్కడి నుంచి బ్రహ్మలింగేశ్వర ఆలయంలో పూజలు చేశారు. అనంతరం అసోం రాష్ట్రంలో ప్రముఖ దేవాలయం అయిన కామాక్షి దేవిని దర్శించుకున్నారు. ఈమె గత వారం రోజులుగా పలు ఆలయాల్లో పూజలు చేస్తుండటం విశేషం.