
నోరూరిస్తున్న ఫలరాజు
సాక్షి,బళ్లారి: అన్ని పండ్లలోకి మామిడి పండును ఫలరాజు అని అంటారు. ఏడాదిలో మే నుంచి జూలై లేదా ఆగస్టు వరకు నాలుగు నెలల కాలాన్ని మామిడి పండ్ల సీజన్గా పిలుస్తారు. ఈ మామిడి పండ్లు పండించాలంటే ఒక ఏడాది లేదా రెండేళ్లు అయితే సరిపోదు. మామిడి మొక్కలు నాటిన తర్వాత కనీసం నాలుగు లేదా ఐదేళ్ల తర్వాత మామిడి చెట్ల నుంచి కాయలు కోయడానికి వీలుంటుంది. చెట్లు బాగా ఏపుగా పెరిగిన తర్వాత అంటే ఏడెనిమిది సంవత్సరాల తర్వాతే మామిడి చెట్ల నుంచి ఓ మోస్తరుగా మామిడికాయలు విరివిగా కాస్తాయి. అంటే మామిడి చెట్లు నాటిన తర్వాత దాదాపు ఎనిమిదేళ్ల పాటు కంటికి రెప్పలా, చంటిపిల్లవాడిని పెంచినట్లుగా మామిడి చెట్లను పెంచిన రైతుకు మామిడి పండ్ల సీజన్ వచ్చిన తర్వాత ఏడాదికి ఒకసారి మాత్రమే చేతికి డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది. మామిడి పండ్లు కాసిన తర్వాత రైతులు ఈసారి తమ కష్టాలు తీరతాయని ఆశతో ప్రతి మామిడికాయ వద్దకు వెళ్లి లెక్కించుకుని బాగా కాశాయని సంబరపడి పోతాడే కాని తీరా మార్కెట్కు వచ్చిన తర్వాత ధరలు చూసి మామిడి రైతు కుదేలవుతున్నారు. ఈసారి మామిడి కాయలు ఎక్కడ చూసినా పెద్దగా కాయలేదని రైతులు పేర్కొంటున్నారు.
దిక్కుతోచని స్థితిలో రైతులు
కాసిన కాయలను మాగబెట్టి పండ్లు చేసి అమ్ముకుందామని మార్కెట్కు తెస్తే ధరలు ఉన్నఫళంగా తగ్గిపోవడంతో మామిడి రైతులు తమ గోడును ఎవరికి చెప్పుకోవాలో తెలియక దిక్కు తోచని స్థితిని ఎదుర్కొంటున్నారు. ఈసారి మామిడి పండ్ల సీజన్ ప్రారంభంలో ధరలు కొంతమేరకు ఉండేవని, అయితే గత రెండు వారాలుగా అమాంతంగా పడిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బాదామి, తోతాపురి, సింధూర రకం మామిడి పండ్ల ధరలు భారీగా తగ్గిపోతున్నాయని అంటున్నారు. మామిడి రైతుల వద్ద కిలోకు రూ.10 నుంచి రూ.15లోపు ధరకు కొనుగోలు చేస్తున్నారు. బళ్లారి నగరంలోని ఏపీఎంసీకి ప్రతి రోజు కర్ణాటకలోని వివిధ ప్రాంతాలతో పాటు, పొరుగున ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు, అనంతపురం జిల్లాల నుంచి పెద్ద ఎత్తున మామిడి పండ్లను తీసుకు వచ్చి అమ్మకాలు సాగిస్తుంటారు. తీరా ఇక్కడికి వచ్చిన తర్వాత ధర చూసి రైతులు కనీసం రవాణా ఖర్చులు, కాయలు కోయడానికి అయిన ధరలు కూడా పలకడం లేదంటున్నారు. ఒక్క బళ్లారి ఏపీఎంసీలోనే కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి మార్కెట్లోను మామిడి ధరలు పడిపోయాయని వ్యాపారులు పేర్కొంటున్నారు.
వ్యాపారులు రాకుంటే ఏం చేయలేం
కొనుగోలు చేసే వ్యాపారులు రాకపోతే తాము ఏమీ చేయలేమని ఏపీఎంసీల్లో పని చేసే దళారులు అంటున్నారు. పొలాల్లో మామిడి కాయలను కూడా తాము కోయడం లేదని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తనకు నాలుగు ఎకరాల మామిడి తోట ఉందని, ప్రారంభంలో తోట మొత్తం రూ.50 వేలకు ఇచ్చానని, అయితే మార్కెట్లో ధరలు పడిపోవడంతో సదరు వ్యాపారి కాయలు కోయడం లేదన్నారు. తాము కాయలు కోసి మార్కెట్కు తీసుకుని వస్తే అమ్ముడు పోవడం లేదని మామిడి తోట సాగు చేసిన రైతు కన్నీటి పర్యంతం అయ్యారు. ఈసారి మామిడిపంట బాగా తగ్గినప్పటికీ ధరలు మాత్రం పెరగలేదన్నారు. ఇందుకు కారణాలు తెలియడం లేదని రైతులు పేర్కొంటున్నారు. ఈ ఏడాది కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు తదితర రాష్ట్రాల్లో ఏకకాలంలో మామిడిపంట చేతికందిందని, దీంతో పాటు వర్షాలు కూడా బాగా కురుస్తుండటం వల్ల కాయలు నేలరాలిపోతున్నాయని, దీంతో రైతులు అందరూ ఒకేసారి కాయలు కోస్తున్నారని, ధరలు పడిపోవడానికి ఇది కూడా ఒక కారణంగా చెబుతున్నారు. వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో అక్కడక్కడ జోరుగా వర్షాలు కురుస్తుండటం కూడా మామిడి రైతులకు ఽశాపంగా మారింది.
అల్ఫాన్సా, మల్లికా రకాలకు డిమాండ్
మామిడి పండ్లలో అల్ఫాన్సా, మలగూబ, రసపురి, సక్కరగుత్తి, తోతాపురి, మల్లికా, సింధూర, కేసరి తదితర రకాలు ఉన్నాయని, వీటిలో అల్ఫాన్సా, మల్లికా రకాలు అంతో ఇంతో ధర పలుకుతున్నాయని, ఈ పండ్ల తోటలు ఉన్న రైతులకు కొంతమేరకు పెట్టుబడులు, కూలీలు, రవాణా ఖర్చులు వస్తున్నాయని, మిగిలిన పండ్ల ధరలు రోజురోజుకు తగ్గిపోతుండటంతో ఆయా మామిడి పండ్లు సాగు చేసిన రైతులు ఈసారి నష్టాలు చవిచూస్తున్నారు. రైతుల నుంచి ఽతక్కువ ధరకు కొనుగోలు చేసిన చిన్న చిన్న వ్యాపారులు వినియోగదారులకు కిలో రూ.30 నుంచి రూ.50లకు బహిరంగ మార్కెట్లో విక్రయిస్తున్నారు. రైతులకేమో గిట్టుబాటు ధర లేక అవస్థలు పడుతున్నారు. దళారులు తమకు వచ్చే కమీషన్ తీసుకుని చేతులు దులుపుకుంటున్నారంటున్నారు. వ్యాపారులు మార్కెట్లో తీసుకున్న ధర కంటే నాలుగింతల ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారన్నారు. నష్టపోయేది తామేనని, తమను పట్టించుకునే నాథుడు లేరని వాపోయారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మామిడి రైతుల గురించి ఆలోచించడం లేదన్నారు. ప్రభుత్వాలు గిట్టుబాటు ధరలు కల్పించకపోతే తమకు ఏటేటా నష్టాలు తప్పవని మామిడి తోటల రైతులు మండిపడుతున్నారు.
మామిడి పండ్ల ధరలు తగ్గుముఖం
హోల్సేల్గా భారీగా తగ్గిన మామిడి ధర
రిటైల్గా అయితే వ్యాపారులకు లాభాలు
పండ్ల తోటల్లో కాయలు కూడా కోయని వైనం
అమాంతంగా ధర పతనంతో రైతులకు నష్టాలు

నోరూరిస్తున్న ఫలరాజు