
బైక్ ప్రయాణికులకు హెల్మెట్ రక్ష
సాక్షి,బళ్లారి: ద్విచక్ర వాహనాల్లో వెళ్లే వారికి శ్రీరామ రక్షగా హెల్మెట్ పని చేస్తుందని జిల్లా ఎస్పీ శోభారాణి పేర్కొన్నారు. ఆమె శుక్రవారం నగరంలోని తన కార్యాలయంలో హెల్మెట్ వాడకంపై ఏర్పాటు చేసిన జాగృతి సమావేశంలో విలేకరులతో మాట్లాడారు. హెల్మెట్ ధరించక పోవడంతో ఎన్నో అనర్థాలు జరుగుతాయన్నారు. ప్రమాదాలు జరిగినప్పుడు హెల్మెట్ లేకపోతే ప్రాణాపాయం సంభవిస్తుందన్నారు. నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారందరూ హెల్మెట్ ధరించాలన్నారు. శుక్రవారం నుంచి హెల్మెట్ ధరించకపోతే రూ.500లు జరిమానా వేస్తామన్నారు. అయితే పోలీసులకు దొరికితే రూ.500లు కట్టి వెళ్లవచ్చులే అని నిర్లక్ష్యంగా ఉండకూడదన్నారు. హెల్మెట్ వాడకం మీ ప్రాణ రక్షణ కోసమేనన్నారు. పాఠశాల, కళాశాలల్లో పని చేసే ఉపాధ్యాయులు, లెక్చరర్లతో పాటు అక్కడ చదువుకునే విద్యార్థులు ద్విచక్ర వాహనాల్లో వెళితే తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ఆయా పాఠశాల, కళాశాలల యజమాన్యాలు ఈ విషయంపై విద్యార్థులు, సిబ్బందికి జాగృతి కల్పించాలన్నారు.
యాజమాన్యాలూ బాధ్యులే
ఒకవేళ విద్యార్థులు కూడా హెల్మెట్ ధరించకపోతే జరిమానాతో పాటు ఆయా కళాశాల, పాఠశాలల యాజమాన్యాలను కూడా బాధ్యులను చేస్తామన్నారు. మద్యం సేవించి వాహనాలు నడిపితే కూడా కచితంగా కేసులు నమోదు చేస్తామన్నారు. మద్యం సేవించిన తర్వాత ఎట్టి పరిస్థితితుల్లోను వాహనాలు నడపకూడదన్నారు. హెల్మెట్పై గతంలో కూడా ఎన్నో అవగాహన సదస్సులు నిర్వహించారన్నారు. ప్రస్తుతం తూతూమంత్రంగా నియమాలు జారీ చేస్తున్నారా? అని విలేకరులు ప్రశ్నించగా అలాంటిది ఏమీ లేదన్నారు. కచ్చితంగా ఇప్పటి నుంచి కట్టుదిట్టమైన చర్యలు తీసుకుని ప్రజల ప్రాణాలు రక్షిస్తామన్నారు. ఎలాంటి రాజకీయ ఒత్తిళ్లు వచ్చినా హెల్మెట్పై వెనక్కు తగ్గేది లేదన్నారు. అనంతరం ఆమె పలువురు పోలీసు అధికారులతో కలిసి శ్రీకనక దుర్గమ్మ ఆలయం పక్కనే రోడ్డులో ప్రజలకు హెల్మెట్ వాడకంపై అవగాహన కలిగిస్తూ ద్విచక్ర వాహనాల్లో వెళ్లేవారికి హెల్మెట్లు అందజేశారు. కార్యక్రమంలో ఏఎస్పీ రవికుమార్, డీఎస్పీ నందారెడ్డి, ట్రాఫిక్ సర్కిల్ ఇన్స్పెక్టర్ అయ్యనగౌడ పాటిల్ తదితరులు పాల్గొన్నారు.
పోలీసుల కోసం కాదు, మీ ప్రాణ రక్షణకే
తప్పకుండా ధరించాలి: ఎస్పీ శోభారాణి