
ఘటనాస్థలిలో సౌకర్యాలు కరువు
బనశంకరి: రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) విజయోత్సవంలో బెంగళూరు చిన్నస్వామి మైదానం వద్ద జరిగిన ఘోర విషాదంపై రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం సుమోటోగా కేసు నమోదు చేసింది. పదుల సంఖ్యలో ప్రజలు, బాధితుల బంధువులు హైకోర్టుకు ఈమెయిల్స్ రూపంలో ఫిర్యాదులు పంపుతున్నారు. ఈ నేపథ్యంలో గురువారం వాడీవేడిగా విచారణ సాగింది. హైకోర్టు జడ్జిలు వీ.కామేశ్వరరావ్, సీఎం.జోషి విచారణ సాగించారు. అడ్వొకేట్ జనరల్ శశికిరణ్ శెట్టి హాజరై సర్కారు అన్ని ఏర్పాట్లు చేసిందని చెప్పే ప్రయత్నం చేశారు.
ప్రభుత్వం సుమారు 1600 మంది పోలీసులను భద్రతకు నియమించింది. స్టేడియం వద్ద అంబులెన్సులు, తాగునీటి వాహనం వంటి సదుపాయాలను కల్పించిందన్నారు. జడ్జిలు స్పందిస్తూ అంబులెన్స్ ఘటనా స్థలంలో ఉందా అని ప్రశ్నించగా, అంబులెన్స్లు ఉన్నాయని, కానీ అవి సరిపోలేదని ఏజీ తెలిపారు.
పిటిషన్దారుల న్యాయవాది అరుణ్శామ్ వాదిస్తూ రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఈ ఘటన సంభవించింది. నిజాలను దాచిపెడుతున్నారని చెప్పారు. ఆర్సీబీ ఆటగాళ్లకు విధానసౌధ ముందు సన్మానం చేయాలని నిర్ణయం తీసుకుంది ఎవరు అనేది స్పష్టం చేయాలి. వారు దేశం, రాష్ట్రం కోసం క్రికెట్ ఆడలేదని, కానీ వారిని సన్మానించే ఉద్దేశం ఏమిటి, ఏ కారణంతో రెండు కార్యక్రమాలు ఒకేసారి ఏర్పాటుచేశారు. ప్రజలను నియంత్రించడానికి ఎలాంటి చర్యలు చేపట్టారు. రక్షణకు తీసుకున్న చర్యలు ఏమిటనేది తెలపాలని కోర్టుకు మనవి చేశారు. అంబులెన్స్లను ఏ ప్రదేశంలో ఉంచారు అనేది కోర్టుకు వివరించాలని కోరారు. ఏ విషయం దాచలేదని, అందరికీ నోటీస్ జారీ చేశారని, ఎవరినీ వదిలిపెట్టేదిలేదని ఏజీ తెలిపారు. వాదప్రతివాదనలు ఆలకించిన కోర్టు విచారణ మంగళవారానికి వాయిదా వేసింది.
నిజాలను దాచిపెడుతున్నారు
హైకోర్టులో వాదనలు
కోర్టుకు పలువురు ఫిర్యాదులు