
ముళ్ల పందుల మాంసం స్వాధీనం
దొడ్డబళ్లాపురం: బన్నేరుఘట్ట ఫారెస్ట్ రేంజ్ పరిధిలో రిజర్వ్ ఫారెస్ట్లో ఇద్దరు వేటగాళ్లు ముళ్లపందులను వేటాడి మాంసం తరలిస్తుండగా అటవీశాఖ అధికారులు దాడి చేశారు. 27 కేజీల ముళ్లపందుల మాంసాన్ని, వాటి రక్తం నింపిన కవర్లు, రెండు బైక్లను అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. కాగా నిందితులు పరారయ్యారు. వీరిని నాగరాజు(25),నంజ(28)గా గుర్తించారు.వీరు బన్నేరుఘట్ట నేషనల్ పార్క్లో పని చేస్తున్నట్లు గుర్తించారు.
డ్రగ్స్ విక్రేతల అరెస్టు
దొడ్డబళ్లాపురం: బెంగళూరులో హెరాయిన్, గంజాయి లాంటి మత్తు పదార్థాలు విక్రయిస్తున్న నలుగురు డ్రగ్ పెడ్లర్లను జిగణి పోలీసులు అరెస్టు చేశారు. బెంగళూరు రూరల్ జిల్లా అనేకల్ తాలూకా బుక్కసాగర చెరువు వద్ద మత్తు పదార్థాలు విక్రయిస్తుండగా పోలీసులు దాడి చేశారు. బిగ్ బాస్కెట్లో పని చేస్తూ మాస్తేనహళ్లిలో నివసిస్తున్న ఒడిశావాసి అక్షయ్(24), ఫ్లిప్ కార్ట్లో పనిచేస్తూ వీరసంద్రలో నివసిస్తున్న అసోంలోని దెమాజి జిల్లాకు చెందినబిస్వజిత్ దావో(24), అసోం రాష్ట్రం కరిమాగంజ్ జిల్లాకు చెందిన జాకీర్ హుసేన్(24), డ్రైవర్గా పనిచేస్తూ బెంగళూరులో ఉంటున్న మంగళూరు జిల్లా తిరుపాళ్య నివాసి సర్వుద్దీన్(28)ను అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి 88గ్రాముల ఏడీఎంఏ, కిలో గంజాయి, 4.06గ్రాముల హెరాయిన్, 4 సిరంజిలు, 4మొబైళ్లు, రెండు బైక్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టులో హాజరుపరిచి పరప్పన అగ్రహార జైలుకు తరలించారు.
మద్యం మత్తులో బైక్ను ఢీ
● భార్య కళ్లముందే భర్త మృతి
కుందుర్పి: కళ్యాణదుర్గం నియోజకవర్గం కుందుర్పి మండల సరిహద్దున గల పరశురాంపురం– చెళ్లకెర ప్రదాన రహదారి పుర్లేపల్లివద్ద బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కుందుర్పి మండలం ఎనుములదొడ్డి నివాసి కురుబ ఉమేష్ (42) చనిపోయాడు. మృతుడు ఉమేష్ భార్య లక్ష్మిదేవితో ఉదయం కలసి చెళ్లకెరలో జరిగిన పెళ్లికి వెళ్లి బైక్లో తిరిగి వస్తున్నారు. వడ్డెపాళ్యం గ్రామానికి చెందిన కురాకుల కాంత, శివన్న, కాంతరాజులు ఒకే బైక్లో మద్యం మత్తులో వేగంగా వచ్చి ఢీకొన్నారు. ఉమేష్ తీవ్ర గాయాలతో అక్కడే మృతి చెందగా భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. కళ్ల ముందే భర్త చనిపోవడంతో భార్య కన్నీరుమున్నీరుగా విలపించింది. నిందితులు ఫుల్లుగా మద్యం తాగి మత్తులో ఇష్టానుసారం నడుపుతూ వచ్చి ఢీకొనడంతో ఓ కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది. మృతునికి ఇద్దరు కుమార్తెలు,ఒక కుమారుడు ఉన్నారు. పరశురాంపురం పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
ప్రైవేటు కంపెనీ ఉద్యోగి హత్య
దొడ్డబళ్లాపురం: ప్రైవేటు కంపెనీ ఉద్యోగి హత్యకు గురైన సంఘటన చిత్రదుర్గలో జరిగింది. బాగల్కోటె జిల్లా ఇళకల్ తాలూకాకు చెందిన బసవరాజు బెంగళూరులోని జియో కంపెనీలో పని చేస్తున్నాడు. కుమార్తెను స్కూల్లో చేర్చడానికి అడ్మిషన్ కోసం మంగళవారం స్వంత ఊరు ఇళకల్కు బస్సులో వెళ్తుండగా మార్గం మధ్యలో చిత్రదుర్గ బస్టాండులో దిగాడు. సమీపంలో ఉన్న బార్లో మద్యం తాగాడు. అతని వద్ద డబ్బు ఉన్నట్లు అదే బార్లో మద్యం తాగుతున్న విజయ్, రహీం అనే ఇద్దరు వ్యక్తులు గమనించారు. బసవరాజును మభ్య పెట్టి రైల్వేస్టేషన్ సమీపంలోని నిర్జనప్రదేశానికి తీసుకువచ్చి హత్య చేసి నగదుతో ఉడాయించారు. చిత్రదుర్గ పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టి నిందితులను అరెస్టు చేశారు.
కోనేరులో చేపల మృత్యువాత
దొడ్డబళ్లాపురం: దొడ్డబళ్లాపురం పట్టణంలోని రోజిపురలో ఉన్న పురాతన కోనేరులో చేపలు మృత్యువాత పడుతున్నాయి. కోర్టు ముందు ఉన్న పురాతన కోనేరును పరిసర సంరక్షకులు కలిసి శుభ్రం చేసి ఫెన్సింగ్ వేసి సంరక్షించారు. స్థానికులు కొన్ని రోజుల క్రితం అందులో చేపలు వదిలారు. ఇటీవల చేపలు వందలాదిగా హఠాత్తుగా మృత్యువాతపడ్డాయి. విషయం తెలుసుకున్న నగరసభ కమిషనర్ కోనేరును పరిశీలించారు. కోనేటిలో ఉన్న కలుషిత నీటిని శుభ్రం చేసి కొత్తగా నీరు వదిలి చేపలు వదులుతామని కమిషనర్ తెలిపారు. హఠాత్తుగా చేపలు ఎందుకు మృతిచెందాయో తెలుసుకునేందుకు నీటిని ల్యాబ్కు పంపించారు.

ముళ్ల పందుల మాంసం స్వాధీనం

ముళ్ల పందుల మాంసం స్వాధీనం