
హక్కుల కమిషన్ తనిఖీ
హొసపేటె: కొప్పళ నగరంలోని జిల్లా స్టేడియంలోని ఇటీవల స్విమ్మింగ్ పూల్లో ఈతకు వెళ్లి బాలుడు మరణించిన సంఘటనపై కర్ణాటక రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యుడు శేఖర్గౌడ జి.రహమత్నాళ సంఘటనా స్థలాన్ని తనిఖీ చేశారు. బాలుడి తల్లిదండ్రులను కలిసి తన సానుభూతిని తెలపడానికి ఆయన బాలుడి ఇంటికి కూడా వెళ్లారు. దీనిపై కొప్పళ టౌన్ పోలీస్ స్టేషన్లో 26న కేసును నమోదు చేశారు. వేసవి సెలవులు కావడంతో చాలా మంది ఈత నేర్చుకోవడానికి వస్తారు. స్విమ్మింగ్పూల్ వద్ద అందరికీ నాణ్యమైన లైఫ్ జాకెట్లు ఇవ్వాలని, తగినంత సంఖ్యలో లైఫ్గార్డ్లను నియమించాలని తదితర జాగ్రత్తలు తీసుకోక పోవడం ఈ ఘటనకు కారణమై ఉండవచ్చని అధికారులకు సూచించారు.
అభివృద్ధి పనులకు భూమిపూజ
హొసపేటె: విజయనగర జిల్లా కూడ్లిగి నియోజకవర్గ సరిహద్దు ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు రోడ్ల అభివృద్ధికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్ శ్రీనివాస్ తెలిపారు. బుధవారం తాలూకాలోని గుడేకోటె, హొసహళ్లి ఫిర్కాల్లో రోడ్డు అభివృద్ధి, వంతెన నిర్మాణం వంటి వివిధ పనులకు భూమిపూజ చేసిన తర్వాత ఆయన మాట్లాడారు. మొళకాల్మూరు, చెళ్లకెరె, జగళూరు వంటి సరిహద్దు తాలూకాలను కలిపేలా అనేక రోడ్లకు ఏళ్ల తరబడి తారు వేయలేదన్నారు. దీంతో కొన్ని రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. వాటి అభివృద్ధికి ఒక డ్రైవ్ ప్రారంభిస్తామని అన్నారు. మొత్తం రూ.11 కోట్ల ఖర్చుతో రోడ్లు, వంతెనల నిర్మాణ పనులను చేపడతారన్నారు. బీడీసీసీ బ్యాంక్ అధ్యక్షుడు తిప్పేస్వామి, మాజీ టీపీ సభ్యుడు పాపా నాయక్, ఇంజినీర్ షఫి, ఏపీఎంసీ అధ్యక్షుడు కురిహట్టి బోసయ్య, న్యాయవాది ఓంకారప్ప, రమేష్, మంజునాథ్, ఎమ్మెల్యే సన్నిహితుడు, జెడ్పీ ఇంజినీరింగ్ విభాగం అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు.
కులగణనపై సర్కార్ తప్పుదోవ
రాయచూరు రూరల్: కశ్మీర్లో పహల్గాం ఘటన నేపథ్యంలో పాకిస్థాన్తో యుద్ధానికి భారత్ సిద్ధంగా ఉందని ప్రధాని నరేంద్ర మోదీ ప్రకటించారని శాసన సభ్యుడు శివరాజ్ పాటిల్ వెల్లడించారు. బుధవారం బసవేశ్వర సర్కిల్ వద్ద విలేఖర్లతో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ నేతలు బీజేపీపై చేస్తున్న మోసపూరిత ప్రకటనలు, అవహేళనకరంగా వ్యాఖ్యానించడాన్ని తప్పుబట్టారు. కులగణన విషయంలో ప్రభుత్వం ప్రజలను దారి తప్పిస్తుందన్నారు. ఈ విషయంలో రాష్ట్ర నేతలు చేస్తున్న వ్యాఖ్యలను ఖండించారు. రాహుల్ గాంధీని కాంగ్రెస్ నేతలు ఎక్కడ దాచారో వెల్లడించాలన్నారు. రాష్ట్రంలో పాలన యంత్రాంగం పూర్తిగా స్తంభించి పోయిందన్నారు. నగరసభ సభ్యులు నాగరాజ్, శశిరాజ్, నేతలు రవీంద్ర, ఆంజనేయ, నరసింహులులున్నారు.

హక్కుల కమిషన్ తనిఖీ

హక్కుల కమిషన్ తనిఖీ