వైభవంగా వేణుగోపాలుని కల్యాణం | - | Sakshi
Sakshi News home page

వైభవంగా వేణుగోపాలుని కల్యాణం

Jun 7 2025 12:12 AM | Updated on Jun 7 2025 12:12 AM

వైభవంగా వేణుగోపాలుని కల్యాణం

వైభవంగా వేణుగోపాలుని కల్యాణం

కొత్తపేట: ఆత్రేయపురం మండలం వాడపల్లి వేంకటేశ్వర స్వామి క్షేత్రంలో కొలువైన రుక్మిణీ, సత్యభామ సమేత వేణుగోపాలస్వామి వార్షిక కల్యాణం శుక్రవారం రాత్రి వైభవంగా నిర్వహించారు. దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావు పర్యవేక్షణలో, ఆలయ ప్రధాన అర్చకుడు ఖండవిల్లి ఆదిత్య అనంత శ్రీనివాసరావు ఆధ్వర్యంలో అర్చకులు, వేదపండితులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి అభిషేకాలు, విశేషార్చనలు జరిపారు. సాయంత్రం కల్యాణాన్ని ప్రారంభించారు. ప్రదానం నుంచి తలంబ్రాలు వరకూ ప్రతి క్రతువునూ వేదపండితులు, అర్చక స్వాములు శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే వ్యాఖ్యాన పండితులు ప్రతి ఘట్టాన్ని కళ్లకు కట్టినట్టు వివరించారు. స్వామి, అమ్మవార్లకు దేవస్థానం తరఫున డీసీ, ఈఓ చక్రధరరావు పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ కల్యాణ మహోత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. అధిక సంఖ్యలో హాజరైన భక్తులకు ఈఓ ఆధ్వర్యంలో ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారు.

అభివృద్ధి పనుల పరిశీలన

కొత్తపేట: వాడపల్లి క్షేత్రంలో జరుగుతున్న అభివృద్ధి పనులను కొత్తపేట ఆర్‌డీఓ పి.శ్రీకర్‌ శుక్రవారం పరిశీలించారు. ఈ క్షేత్రానికి పెరుగుతున్న భక్తుల తాకిడికి అనుగుణంగా సౌకర్యాలు, రహదారుల ఆధునీకరణ, వాహనాల పార్కింగ్‌ స్థలం అభివృద్ధి, ఏడు వారాల ప్రదక్షిణకు అనుకూలంగా మాడ వీధుల విస్తరణ వంటి పనులు చేపట్టారు. ఆయా పనులపై ఆర్‌డీఓ శ్రీకర్‌, దేవదాయ – ధర్మాదాయ శాఖ డిప్యూటీ కమిషనర్‌, దేవస్థానం ఈఓ నల్లం సూర్యచక్రధరరావుతో సమీక్షించారు. దానిలో భాగంగా స్వాతంత్య్ర సమరయోధుల స్థూపాన్ని పరిశీలించారు.

అన్నప్రసాద భవనానికి విరాళాలు

వాడపల్లి క్షేత్రంలో వకుళమాత అన్నప్రసాద భవన నిర్మాణానికి భక్తులు విరివిగా విరాళాలు సమర్పిస్తున్నారు. దానిలో భాగంగా భీమవరానికి చెందిన సీవీ చంటి, శాంతి దంపతులు రూ.1,15,000 విరాళంగా సమర్పించారు. వారు శుక్రవారం స్వామివారిని దర్శించుకున్నారు. దాతలకు ఈఓ నల్లం సూర్యచక్రధరరావు స్వామివారి చిత్రపటాలను అందచేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement