నాణ్యమైన విద్యకు నవోదయం | - | Sakshi
Sakshi News home page

నాణ్యమైన విద్యకు నవోదయం

Jun 4 2025 12:12 AM | Updated on Jun 4 2025 12:12 AM

నాణ్య

నాణ్యమైన విద్యకు నవోదయం

రాయవరం: జవహర్‌ నవోదయ విద్యాసమితిలో 6వ తరగతి ప్రవేశానికి నోటిఫికేషన్‌ విడుదలైంది. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు కార్పొరేట్‌ స్థాయి విద్యనందించేందుకు 1986లో జవహర్‌ నవోదయ విద్యాలయాలను కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. దేశవ్యాప్తంగా 661 నవోదయ విద్యాలయాలు ఉండగా..కాకినాడ జిల్లా పెద్దాపురంలో ఉంది. కాకినాడ, తూర్పుగోదావరి, డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా పరిధిలోని విద్యార్థులు ఇక్కడ దరఖాస్తుకు అర్హులు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరవ తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఆరవ తరగతి నుంచి ఇంటర్మీడియెట్‌ వరకు ఉచిత విద్యను ఇక్కడ అందిస్తారు. విద్యతో పాటు అధునాతన సౌకర్యాల కల్పన, ప్రయోగాత్మక విద్య, క్రీడలు, క్రమశిక్షణ, ప్రతిభకు పెద్దపీట వేయడం ఈ విద్యా సంస్థల ప్రత్యేకత. పరీక్షకు ఎవరు అర్హులు, పరీక్షా విధానం, రిజర్వేషన్‌ తదితర వివరాలతో ‘సాక్షి’ ప్రత్యేక కథనం.

ఒక్కసారే అవకాశం

ఈ ఏడాది డిసెంబర్‌ 13న నిర్వహించే ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన వారికి విద్యాలయలో ప్రవేశం లభిస్తుంది. ఆన్‌లైన్‌ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. పెద్దాపురం జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో మొత్తం 80 సీట్లు ఉంటాయి. ఆరవ తరగతిలో ప్రవేశానికి ప్రస్తుతం ఆయా మండలాల్లో ఐదో తరగతి చదువుతున్న బాలబాలికలు అర్హులు. ఈ ప్రవేశ పరీక్షకు ఒక్కసారి మాత్రమే హాజరయ్యే అవకాశం ఉంది. 2026–27 విద్యా సంవత్సరంలో అడ్మిషన్‌ పొందగోరే బాలబాలికలు 2014 మే ఒకటో తేదీ నుంచి 2016 జూలై 31 మధ్య జన్మించి ఉండాలి. ప్రభుత్వం గుర్తించిన పాఠశాలల్లో 3,4 తరగతులు ఉత్తీర్ణత సాధించి ఐదో తరగతి చదువుతున్న వారు మాత్రమే అర్హులు.

రిజర్వేషన్‌ విధానం

గ్రామీణ ప్రాంత విద్యార్థులకు 75 శాతం తగ్గకుండా సీట్లు కేటాయిస్తారు. షెడ్యూల్‌ కులాలకు 15 శాతం, షెడ్యూల్‌ తరగతులకు ఏడు శాతం, దివ్యాంగులకు మూడు శాతం రిజర్వేషన్‌ కల్పిస్తారు. ప్రవేశాల్లో బాలికలకు 33 శాతం రిజర్వేషన్లు వర్తింపజేస్తారు.

వసతులు

బాలబాలికలకు వసతి గృహాలు, భోజనం, విద్య, నోట్‌బుక్స్‌, స్కూల్‌ యూనిఫామ్‌, షూస్‌, టాయిలెట్‌ సామగ్రి ఉచితం. అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు నవోదయ విద్యాలయాల్లో బోధన చేస్తారు. శాస్త్ర, సాంకేతికతతో కూడిన విద్య, క్రీడలు, యోగా ద్వారా విద్యార్థికి సంపూర్ణ వ్యక్తిత్వ వికాసం కల్పిస్తారు. తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్‌ వరకు నామమాత్రపు రుసుం ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు, బాలికలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది. ఆన్‌లైన్‌ దరఖాస్తును పూర్తి చేసిన తర్వాత దరఖాస్తు ఫారాన్ని ప్రింట్‌ తీసుకుని దగ్గర ఉంచుకోవాలి. హాల్‌ టికెట్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవడానికి ఇది ఉపకరిస్తుంది. జూలై 29వ తేదీ లోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందజేయాల్సి ఉంది. దరఖాస్తుకు రుసుం చెల్లించనవసరం లేదు.

2026–27 విద్యా సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల

జూలై 29 వరకు ఆన్‌లైన్‌లో

దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు

ఈ ఏడాది డిసెంబర్‌ 13న ప్రవేశ పరీక్ష

గతేడాది జిల్లాల వారీగా వచ్చిన దరఖాస్తులు ఇలా.. జిల్లా వచ్చిన దరఖాస్తులు

కోనసీమ 3,869

తూర్పుగోదావరి 1,741

కాకినాడ 3,361

పరీక్షా విధానమిదీ..

నవోదయ ప్రవేశ పరీక్షను 2025 డిసెంబరు 13న ఉదయం 11.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు నిర్వహిస్తారు. విద్యార్థులు భాషను(తెలుగు/ఇంగ్లీషు) ఎంచుకొని పరీక్ష రాసే వీలుంది. ప్రవేశ పరీక్షలో 80 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు పరీక్ష నిర్వహియిస్తారు. మూడు విభాగాల్లో ప్రశ్నలు కేటాయిస్తారు. మేధాశక్తిపై 40 ప్రశ్నలు 50 మార్కులకు, గణితం(అర్ధమెటిక్‌), ఎంచుకున్న భాషపై ఒక్కొక్క విభాగానికి 20 ప్రశ్నలు వంతున 40 ప్రశ్నలు 50 మార్కులకు ఉంటాయి. తప్పుడు సమాధానాలకు నెగిటివ్‌ మార్కులు ఉండవు. దివ్యాంగులకు 40 నిమిషాల అదనపు సమయాన్ని కేటాయిస్తారు. పరీక్షలను సెంట్రల్‌ బోర్డు ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ) నిర్వహిస్తుంది. ఎంపికై న వారికి మొదటి రెండు సంవత్సరాలు తెలుగు/ఇంగ్లిషు భాషల్లో బోధిస్తారు. అనంతరం ఇంగ్లిషులోనే బోధన చేస్తారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు హెచ్‌టీటీపీఎస్‌://నవోదయ.జీవోవీ.ఇన్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

అధికారులు అవగాహన కల్పించాలి

అధిక సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యేలా విద్యాశాఖ అధికారులు అవగాహన కల్పించాలి. గతేడాదికి మించి దరఖాస్తులు వచ్చేలా ఎంఈవోలు పర్యవేక్షణ చేయాలి

– బి.సీతాలక్ష్మి, ప్రిన్సిపాల్‌, జవహర్‌

నవోదయ విద్యాలయ, పెద్దాపురం

నాణ్యమైన విద్యకు నవోదయం 1
1/1

నాణ్యమైన విద్యకు నవోదయం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement