బోట్క్లబ్ (కాకినాడ సిటీ): వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర యువజన విభాగంలో జిల్లా నుంచి 11 మంది నేతలకు పదవులు దక్కాయి. పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు శుక్రవారం రాత్రి ఉత్తర్వులు ఇచ్చింది. పార్టీ యువజన విభాగం జోనల్ ప్రెసిడెంట్గా దాడిశెట్టి శ్రీనివాస్ (తుని నియోజకవర్గం), ప్రధాన కార్యదర్శిగా తోట రాంజీ (జగ్గంపేట), కార్యదర్శులుగా బదిరెడ్డి సతీష్ గోవిందుబాబు (ప్రత్తిపాడు), మధిరెడ్డి దొరబాబు (పిఠాపురం), సంయుక్త కార్యదర్శులుగా కరణం భాను (పెద్దాపురం), ఎంజీకే కిషోర్ (కాకినాడ సిటీ), ఎం.హేమంత్ కుమార్ (తుని), వలవల భూషణం (పిఠాపురం); ప్రధాన కార్యదర్శిగా సూర్రెడ్డి తిరుమల రాయుడు (ప్రత్తిపాడు), సంయుక్త కార్యదర్శులుగా తోట అయ్యన్న (జగ్గంపేట), అక్షింతల లక్ష్మణమూర్తి రాజా (జగ్గంపేట నియోజకవర్గం) నియమితులయ్యారు.
ఆలయ బాధ్యతల నుంచి ఏఈఓ తొలగింపు
అన్నవరం: ఒక మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అన్నవరం దేవస్థానం ఏఈఓ కె.కొండలరావును సత్యదేవుని ఆలయ బాధ్యతల నుంచి తప్పించి గోశాల, గార్డెన్స్ విభాగానికి మార్చారు. ఆయన స్థానంలో గోశాల, గార్డెన్స్ విభాగం ఏఈఓ పి.జగ్గారావును నియమించారు. ఈ మేరకు ఈఓ వీర్ల సుబ్బారావు శుక్రవారం ఆదేశాలిచ్చారు. ఈ నెల 13న సత్యదేవుని శ్రీపుష్పయాగానికి వచ్చిన తమపై కొండలరావు అనుచితంగా ప్రవర్తించారని, తన భార్యను తోసివేయడంతో ఆమె కింద పడిపోయిందని హైదరాబాద్కు చెందిన భక్తుడు హోతా కామేశ్వరశాస్త్రి రాష్ట్ర ముఖ్యమంత్రి కార్యాలయానికి ఫిర్యాదు చేసిన విషయం విదితమే. దీనిపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఈఓను సీఎంఓ అధికారులు ఆదేశించారు. దీనిపై విచారణాధికారిగా ఆలయ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ను ఈఓ నియమించారు.
12 కేంద్రాల్లో కానిస్టేబుల్స్ మెయిన్స్
కాకినాడ క్రైం: జిల్లావ్యాప్తంగా ఆదివారం జరిగే కానిస్టేబుల్స్ మెయిన్స్ పరీక్షల కోసం 12 కేంద్రాలు ఏర్పాటు చేశామని ఎస్పీ బిందుమాధవ్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ ఈ పరీక్ష జరుగుతుందన్నారు. సూరంపాలెం ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ, కాకినాడలోని ప్రభుత్వ ఐటీఐ, టెక్నాలజీ కాలేజీ, మోహన్ కాలేజీ, ఐడియల్ కాలేజ్ ఆఫ్ టెక్నాలజీ, వీఎస్ లక్ష్మీ కాలేజీల్లో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు వివరించారు. అభ్యర్థులు ఉదయం 9 గంటలకే పరీక్ష కేంద్రానికి చేరుకోవాలన్నారు. హాల్ టికెట్టుతో పాటు ఒరిజినల్ గుర్తింపు పత్రాలు తప్పకుండా తీసుకురావాలన్నారు. ఎలక్ట్రానిక్ పరికరాలు, సెల్ఫోన్లు అనుమతించబోమని స్పష్టం చేశారు. హెల్ప్ లైన్ నంబర్లు 94949 33233 (వాట్సాప్), డయల్ 112, 94407 96501, 94407 96513 సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ సూచించారు.
రేపటి నుంచి 500 క్యూసెక్కుల విడుదల
కాకినాడ సిటీ: తూర్పు డెల్టాలోని రైతులు ఖరీఫ్ విత్తనాలు వేసుకొనేందుకు వీలుగా గోదావరి కాకినాడ, సామర్లకోట, బ్యాంక్ కాలువలకు ఆదివారం నుంచి రోజుకు 500 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేయనున్నారు. కలెక్టర్ షణ్మోహన్ సగిలి శుక్రవారం ఒక ప్రకటనలో ఈ విషయం తెలిపారు. అలాగే, పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం, ఏలేరు రిజర్వాయర్ల నుంచి జూలై మొదటి వారంలోను, పంపా రిజర్వాయర్ నుంచి ఆగస్టు మొదటి వారంలోను నీటిని విడుదల చేస్తామని వివరించారు.
సత్యదేవుని సన్నిధిలో పాట్నా హైకోర్టు న్యాయమూర్తి
అన్నవరం: పాట్నా హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ రాజీవ్రాయ్ తన కుటుంబ సభ్యులతో కలిసి శుక్రవారం సత్యదేవుని దర్శించి, పూజలు చేశారు. ఆలయం వద్ద వారికి పండితులు ఘన స్వాగతం పలికారు. స్వామివారి దర్శనానంతరం పండితులు వేదాశీస్సులు, స్వామివారి ఫొటో, ప్రసాదాలను ఈఓ వీర్ల సుబ్బారావు అందజేశారు.