
చంద్రబాబు సర్కార్పై సమర శంఖం
సాక్షి ప్రతినిధి, కాకినాడ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఏ ఒక్క హామీ కూడా అమలు చేయని నేపథ్యంలో జూన్ 4న వెన్నుపోటు దినంగా పాటించాలని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపునిచ్చారు. పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు పార్టీలోని అన్ని స్థాయిల్లో నాయకులు, శ్రేణులు వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని విజ్ఞప్తి చేశారు. శుక్రవారం తనను కలిసిన మీడియాతో రాజా మాట్లాడారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలను వంచించి, వందకు పైగా హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని ఆక్షేపించారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా చంద్రబాబు, కూటమి నేతలు ఏ ఒక్క హామీ అయినా అమలు చేసి ఉంటే ముందుకు వచ్చి చెప్పాలని డిమాండ్ చేశారు. మే నెల ముగిసిపోతోందని, ఖరీఫ్ సీజన్ మొదలవుతూండటంతో రైతులు వ్యవసాయ పనులకు సిద్ధమవుతున్నారని అన్నారు. అయినప్పటికీ వారికి పెట్టుబడి సాయం ఇవ్వాలనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వానికి లేకపోవడం అన్యాయమన్నారు. జగన్ ముఖ్యమంత్రిగా ఉండగా పీఎం కిసాన్తో కలిపి రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా ఏటా రూ.13,500 రైతుకు అందించారన్నారు. చంద్రబాబు గద్దెనెక్కాక రైతు భరోసా కేంద్రాల పేరును రైతు సేవా కేంద్రాలుగా మార్చడం తప్ప చేసిందేమీ లేదని ఎద్దేవా చేశారు. ఖరీఫ్ ప్రారంభమైనా రైతుల ఖాతాల్లో ఒక్క రూపాయి అయినా పెట్టుబడి సాయంగా జమ చేశారా అని నిలదీశారు. అన్ని వర్గాలకూ చంద్రబాబు, కూటమి నేతలు ఇచ్చిన హామీలు అమలయ్యేంత వరకూ పార్టీ యావత్తూ ప్రజలు, బాధితులను సమన్వయం చేసుకుంటూ ఉద్యమిస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే జూన్ 4న వెన్నుపోటు దినాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమం పోస్టర్లను ఒకటి రెండు రోజుల్లో కాకినాడలో ఆవిష్కరిస్తామని రాజా చెప్పారు.
ఫ ఒక్క హామీనైనా అమలు చేశారా?
ఫ వెన్నుపోటు దినం
విజయవంతం చేయాలి
ఫ మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దాడిశెట్టి రాజా పిలుపు