
నలిగిపోతున్న నాలుగో సింహం
● పోలీస్శాఖ బదిలీల్లో నాయకుల పాత్ర ● ఇద్దరు అధికార పార్టీ నేతల ఆధిపత్య పోరు ● అయోమయంలో పోలీస్ అధికారులు
జగిత్యాలక్రైం: జిల్లాలోని ఇద్దరు అధికార పార్టీ నాయకుల మద్య పోలీసు అధికారులు సతమతమవుతున్నారు. ఇటీవల ఓ డీఎస్పీ బదిలీ కాగా.. అధికార పార్టీ నాయకులతోపాటు, పొరుగు నియోజకవర్గ నేతలు సదరు డీఎస్పీ పోస్టింగ్ను రద్దు చేయించారు. ఇది గిట్టని అధికార పార్టీకే చెందిన మరో నాయకుడు ఏకంగా తన నియోజకవర్గంలో ఉన్న ఇద్దరు సీఐలను బదిలీ చేయించారు. పైగా తాను సిఫార్సు చేస్తేనే పోస్టింగ్ వచ్చిందని, తన వ్యతిరేక నాయకుడిని కలిస్తే పోస్టింగ్లు ఊడుతాయని చెప్పినట్లు సమాచారం. ఈ క్రమంలో ప్రస్తుతం పోస్టింగ్ పొందిన పోలీసు అధికారులు బాధ్యతలు స్వీకరించి 15 రోజులు గడుస్తున్నా.. ఆ నియోజకవర్గానికి చెందిన అధికార పార్టీ నాయకుడిని కలవకపోవడం గమనార్హం. దీంతో సదరు నాయకుడి అనుచరులు పోలీసు అధికారుల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలోని ఓ పెద్ద మండలానికి చెందిన తన బంధువును ఇటీవల ఎస్సైగా నియమించడంతో అక్కడ చాలామంది అధికార పార్టీ కార్యకర్తలకు ఇబ్బందులు తలెత్తుతున్నాయని, అతడిని బదిలీ చేయించాలని మరో ముఖ్య నాయకునడిపై ఒత్తిడి పెంచుతున్నాడని, దీనికి అతను అక్కడే ఉండాలని మరో నాయకుడు ఉన్నతాధికారులపై ఒత్తిడి తెస్తున్నాడని సమాచారం. ఇద్దరు అధికార పార్టీ నాయకుల మధ్య సయోద్య కుదరకపోవడంతో పోలీసు నియామకాల్లో వర్గపోరు మొదలైంది. మరో రెండు మూడు రోజుల్లో ఎస్సైల బదిలీలు కానున్న నేపథ్యంలో ఇద్దరు నాయకులు తమకు అనుకూలమైన వారికి పోస్టింగ్లు ఇవ్వాలని సిఫారసు లేఖలు అందించినట్లు విశ్వసనీయ సమాచారం.
‘పసుపుబోర్డు’తో రైతుల కల సాకారం
మల్లాపూర్: నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయం ప్రారంభంతో రైతుల కల సాకారమైందని బీజేపీ రాష్ట్ర నాయకుడు చిట్నేని రఘు అన్నారు. మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీని బీజేపీ నిలబెట్టుకుందని, ప్రధాని మోదీ మాట ఇస్తే అమలు చేసి తీరుతారని నిరూపితం అయ్యిందని పేర్కొన్నారు. బోర్డు ఏర్పాటుతో పసుపు పంటకు గిట్టుబాటు ధర లభిస్తుందని, ఎగుమతి గణనీయమైన అవకాశాలు ఉంటాయన్నారు. అనంతరం జర్నలిస్టులకు హెల్త్ కార్డులు అందించారు. కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు గోపిడి శ్రీనివాస్రెడ్డి, జిల్లా కార్యదర్శి ఎర్ర లక్ష్మీ, బీజేవైఎం మండల అధ్యక్షుడు పందిరి నాగరాజు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
మున్సిపల్ కమిషనర్ మోహన్కు పదోన్నతి
మెట్పల్లి: మున్సిపల్ మేనేజర్ హోదాలో కమిషనర్ బాధ్యతలు నిర్వర్తిస్తున్న మోహన్కు గ్రేడ్–3 కమిషనర్గా ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. రాష్ట్రవ్యాప్తంగా పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా మోహన్కు కమిషనర్గా పదోన్నతి కల్పిస్తూ మెట్పల్లిలోనే కొనసాగాలని సూచించింది.
కిక్బాక్సింగ్ విజేతలకు అభినందన
జగిత్యాలఅగ్రికల్చర్:కిక్ బాక్సింగ్ పోటీల్లో పొలాస వ్యవసాయ కళాశాల విద్యార్థులు పతకాలు సాధించడం అభినందనీయమని కళాశాల అసోసియేట్ డీన్ భారతి నారాయణభట్ అన్నారు. ఇటీవల నిర్వహించిన కిక్బాక్సింగ్ పోటీల్లో విజయం సాధించిన విద్యార్థులను ఆమె కళాశాలలో అభినందించారు. విద్యార్థులు చదువుతోపాటు ఆటపాటల్లో ముందుండాలన్నారు. ఆటలతో మానసిక ప్రశాంతత చేకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో స్టూడెంట్ కో–ఆర్డినేటర్ మహేశ్రెడ్డి, కోచ్ రామాంజనేయులు పాల్గొన్నారు.

నలిగిపోతున్న నాలుగో సింహం