Karachi University Blast: Who Was the Female Suicide Bomber, Details Inside - Sakshi
Sakshi News home page

Karachi University Blast: ఇద్దరు పిల్లల తల్లి, సైన్స్‌ టీచర్‌.. మహిళా సుసైడ్‌ బాంబర్‌ గురించి షాకింగ్‌ విషయాలు

Apr 27 2022 5:00 PM | Updated on Apr 27 2022 7:15 PM

Karachi University Blast: Who Was The Female Suicide Bomber, Details Inside - Sakshi

పాకిస్థాన్‌లోని కరాచీ విశ్వవిద్యాలయంలో చైనా జాతీయులను లక్ష్యంగా చేసుకొని ఆత్మాహుతి దాడి జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనలో ముగ్గురు చైనీయులతోపాటు నలుగురు మృత్యువాతపడ్డారు. దీనికి తామే బాధ్యులమని బలూచిస్థాన్‌ లిబరేషన్‌ ఆర్మీ ఇప్పటికే ప్రకటించింది. అలాగే ఓ మహిళా సుసైడ్‌ బాంబర్‌ ఈ దారుణానికి పాల్పడినట్లు  వెల్లడించింది. తాజాగా హ్యుమన్‌ బాంబర్‌గా మారిన మహిళ గురించి షాకింగ్ వివరాలు వెల్లడయ్యాయి. 

బలూచిస్తాన్‌లోని నియాజర్‌ అబాద్‌కు చెందిన  30ఏళ్ల షరి బలోచ్ ఈ దాడికి పాల్పడింది. ఆమె ఎంఎస్సీ జువాలజీ పూర్తిచేసి.. సైన్స్ టీచర్‌గా విధులు నిర్వహిస్తోంది. ఓ వైద్యుడిని వివాహం చేసుకున్న ఆమెకు ఇద్దరు పిల్లలున్నారు. వారిలో ఒకరికి ఎనిమిదేళ్లు పేరు మహర్రోష్.. మరొకరికి నాలుగేళ్లు పేరు మీర్ హాసన్. రెండేళ్ల క్రితమే బలూచిస్థాన్ లిబరేషన్ ఆర్మీలోని మజీద్ బ్రిగేడ్‌కు చెందిన స్పెషల్ సెల్ఫ్ శాక్రిఫైజ్ (ఆత్మ బలిదానం) బృందంలో చేరింది. 
చదవండి👉 Viral Video: పెను ప్రమాదం నుంచి బిడ్డను కాపాడిన తల్లి.. క్షణం ఆలస్యమైనా..

తొలి మహిళా బాంబర్
అయితే తనకు ఇద్దరు పిల్లలు ఉండడంతో దీని నుంచి తప్పుకోవడానికి అవకాశం కల్పించినా ఆమె ఒప్పుకోలేదు. షరి మిలిటెంట్ గ్రూప్‌లో తొలి మహిళా బాంబర్. ఆరు నెలల క్రితమే తాను ఆత్మబలిదాన దాడికి కట్టుబడి ఉన్నానని ఆమె ధ్రువీకరించింది. ఆత్మాహుతి దాడికి బాధ్యత ప్రకటించుకున్న బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీ ఈ విషయాలను ఓ ప్రకటన ద్వారా వెల్లడించింది. 

చైనా స్పందన
మరోవైపు చైనీయులే లక్ష్యంగా జరిగిన కరాచీ విశ్వవిద్యాలయంలో జరిగిన ఆత్మాహుతి దాడిని ఆ దేశం తీవ్రంగా ఖండించింది. ఘటనపై లోతుగా విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేసింది.  అదే విధంగా పాకిస్థాన్‌లో నివసిస్తున్న చైనీయులకు మరింత భద్రతను అందిచాలని కోరింది. ఈ ఘటన వెనక బాధ్యులు తప్పకుండా తగిన మూల్యం చెల్లించుకుంటారని చైనా విదేశాంగ వాఖ హెచ్చరించింది. 

Advertisement
 
Advertisement
Advertisement