
ముగిసిన చెస్ పోటీలు
వరంగల్ స్పోర్ట్స్: హనుమకొండ పబ్లిక్గార్డెన్ వద్ద ఉన్న టీటీడీ కల్యాణ మండపంలో రెండు రోజులపాటు నిర్వహించిన ఓపెన్ టు ఆల్ చెస్ పోటీలు ఆదివారం సాయంత్రం ముగిశాయి. వరంగల్ జిల్లా చదరంగ సమాఖ్య ఆధ్వర్యంలో హోరాహోరీగా సాగిన పోటీల్లో గండు రిత్విక్, దారా సాయివివేశ్, జె.రంజిత్, నిక్రీ ప్రహర్ణ విజేతలుగా నిలిచినట్లు నిర్వహణ కార్యదర్శి పి.కన్నా తెలిపారు. ముగింపు వేడుకల్లో ఆర్బిటర్లు సీహెచ్ శ్రీనివాస్, రజినీకాంత్, ఫ్రాంక్లిన్, అక్షయ్ తల్లిదండ్రులు, పీఈటీలు తదితరులు పాల్గొన్నారు.
దరఖాస్తుల ఆహ్వానం
హన్మకొండ కల్చలర్: వరంగల్ నటరాజ కళాకృష్ణ నృత్యజ్యోతి అకాడమీ, బోర్టు ఫర్ ప్రమోషన్ ఆఫ్ భారత్ కల్చరల్ అండ్ ట్రెడిషనల్ ఆర్ట్స్ సౌజన్యంతో ఆగస్టులో నిర్వహించే పేరిణి నాట్య విశారద పరీక్షలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు అకాడమీ నిర్వాహకుడు, చీఫ్ ఎగ్జామినర్ గజ్జెల రంజిత్ తెలిపారు. ఈ మేరకు శనివారం రాత్రి హైదరాబాద్లో తెలంగాణ రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ సంచాలకులు డాక్టర్ మామిడి హరికృష్ణ పరీక్షల నోటిషికేషన్ విడుదల చేశారు. ఈసందర్భంగా రంజిత్ మాట్లాడుతూ.. పేరిణి నాట్య విద్యార్థులు ఈ నెల 21 వరకు పరీక్షలకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో పేరిణి గురువు ఉస్తాద్ బిస్మిల్లాఖాన్, ధరావత్ రాజ్కుమార్ నాయక్, పి.సందీప్ పాల్గొన్నారు.
వ్యాధులపై
జాగ్రత్తగా ఉండాలి
హన్మకొండ: వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హనుమకొండ జిల్లా పశు సంవర్థక, పశు వైద్యాధికారి డాక్టర్ విజయభాస్కర్ అన్నారు. ప్రపంచ జూనోసిస్ డేను పురస్కరించుకుని హనుమకొండ వడ్డేపల్లిలోని పశు వైద్య కేంద్రంలో పెంపుడు జంతువులకు వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని విజయ భాస్కర్ ప్రారంభించారు. మొత్తం 107 శునకాలకు టీకాలు వేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు వ్యాధులు సంక్రమించకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో జంతువుల రోగ నిర్ధారణ ప్రయోగశాల సహాయ సంచాలకురాలు డాక్టర్ నాగమణి, జిల్లా పశు సంవర్థక, పశు వైద్య కార్యాలయం సహాయ సంచాలకుడు డాక్టర్ శ్రీనివాస్, వడ్డేపల్లి పశు వైద్యాధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, సిబ్బంది కొమురయ్య, యాదలక్ష్మి, వంశీ పాల్గొన్నారు.
రాష్ట్రస్థాయి పోటీలకు
జిల్లా జట్ల ఎంపిక
వరంగల్ స్పోర్ట్స్: ఈనెల 11 నుంచి 13వ తేదీ వరకు గద్వాలలో జరగనున్న అండర్–18 బాలబాలికల రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీల్లో పాల్గొనే జిల్లా జట్ల కోసం ఆదివారం కాజీపేటలోని సీబీఎస్ఈ మాన్ట్ఫోర్ట్ స్కూల్లో ఎంపిక పోటీలు నిర్వహించారు. ఎంపిక పోటీలకు హనుమకొండ జిల్లా నుంచి బాలురు 22, బాలికలు 26 మంది పాల్గొననున్నట్లు హనుమకొండ జిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు తాళ్లపెల్లి రాజు, డోలి సాంబయ్య తెలిపారు. ఇందులో ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు తెలిపారు. ఎంపికై న బాలుర జట్టులో అక్షత్, శ్రీవైభవ్, మాషూక్, రేహాన్, షాహీద్, సహన్, సాత్విక్, భువన్ ఆదిత్య, మసూద్, అభినయ్, రిషి, హర్శ, బాలికల విభాగంలో మేరీ హాసిని, యుక్తి, తేజస్వి, వేలిక, మీనాక్షి, షారోన్, సహస్ర, భార్గవి, పూర్విక, యఘ్నసేవి, సుధీక్ష, శ్రేష్టపటేల్ ఉన్నారు. కార్యక్రమంలో పీఈటీలు విజయ్కుమార్, సునీలా కోచ్ ఇర్ఫాన్, అసిస్టెంట్ కోచ్ యశ్వంత్, సీనియర్ క్రీడాకారులు సాగర్, సందీప్ పాల్గొన్నారు.

ముగిసిన చెస్ పోటీలు