
16 మందికి హెడ్ నర్సులుగా ఉద్యోగోన్నతి
గుంటూరు మెడికల్: ఉమ్మడి గుంటూరు, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో స్టాఫ్ నర్సులుగా పని చేస్తున్న 16 మందికి గురువారం కౌన్సెలింగ్ నిర్వహించి హెడ్ నర్సులుగా ప్రమోషన్ ఉత్తర్వులు ఇచ్చారు. గుంటూరు ప్రాంతీయ వైద్య ఆరోగ్య శాఖ సంచాలకుల కార్యాలయంలో జరిగిన కౌన్సెలింగ్కు 17 మంది స్టాఫ్ నర్సులను ప్రమోషన్ కోసం పిలువగా, ఒకరు ప్రమోషన్ వద్దని లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చారు. ప్రమోషన్ ద్వారా గుంటూరు జీజీహెచ్లో ఎనిమిది మంది, ఒంగోలు జీజీహెచ్లో ఐదుగురు, నెల్లూరు జిల్లాలో ముగ్గురు హెడ్ నర్సులుగా చేరారు. సుమారు ఆరు నెలలుగా ప్రమోషన్ల కోసం ఎదురు చూస్తున్న నర్సింగ్ సిబ్బంది ఎట్టకేలకు కౌన్సెలింగ్ జరగడంతో నర్సింగ్ యూనియన్ నేతలతో కలిసి గురువారం మెడికల్ అండ్ హెల్త్ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ కె.సుచిత్రాదేవిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. కౌన్సెలింగ్ ప్రక్రియలో ఆర్డీతోపాటు, డెప్యూటీ డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి, ఆఫీస్ సూపరింటెండెంట్ షేక్ నాగూర్ షరీఫ్, సీనియర్ అసిస్టెంట్ సుబ్బారావు పాల్గొన్నారు. ఆర్డీకి కృతజ్ఞతలు తెలిపిన వారిలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నర్సుల సంఘం జిల్లా సెక్రటరీ వెల్లంపల్లి పద్మజ, వైస్ ప్రెసిడెంట్ శ్రీదేవి, ఎగ్జిక్యూటివ్ మెంబర్లు సునీత, అరుణ తదితరులు పాల్గొన్నారు.