
వానాకాలంలో వ్యాధుల ముప్పు
బుట్టాయగూడెం: వర్షాకాలం వచ్చేసింది. మరికొద్ది రోజుల్లో వర్షాలు విస్తారంగా కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. ఈ నేపథ్యంలో వాతావరణంలో మార్పులతో వచ్చే సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని లేకుంటే పలు రోగాల బారిన పడే అవకాశం ఉందని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా విస్తారంగా వర్షాలు కురిసిన సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు. నీటి కలుషితం ద్వారా సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, మురికి నీటి నిల్వలతో దోమలు కూడా వృద్ధి చెందుతాయని వైద్యాధికారులు అంటున్నారు. వర్షాకాలంలో గిరిజన ప్రాంతంలో ఎక్కువగా వాతావరణ మార్పుల వల్ల మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్, డయేరియా, కామెర్లు వంటి వ్యాధులు వ్యాప్తి చెందుతాయని అధికారులు చెబుతున్నారు. ఏ చిన్న లక్షణం కనిపించినా వెంటనే అందుబాటులో ఉన్న ప్రభుత్వాస్పత్రులకు సూచిస్తున్నారు.
జిల్లాలో 153 మలేరియా సమస్యాత్మక గ్రామాలు
జిల్లాలోని గిరిజన మండలాలైన పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల పరిధిలో సుమారు 153 మలేరియా వ్యాపించే సమస్యాత్మక గ్రామాలుగా అధికారులు గుర్తించారు. గతంలో 143 సమస్యాత్మక గ్రామాలు ఉండగా ఈ సంఖర్య పెరిగింది. ఆయా గ్రామాల్లో ప్రస్తుతం మొదటి విడత మలేరియా స్ప్రేయింగ్ పనులు మే 1 నుంచి ప్రారంభించారు. ఇందుకోసం 53 టన్నుల మలాథియన్ స్ప్రేయింగ్ మందు డబ్బాలు సిద్ధం చేశారు. గ్రామాల్లో మొదటి విడత పనులు పూర్తయినట్లు అధికారులు చెప్పారు. జున్ 15 నుంచి 2వ విడత మలాథియన్ స్ప్రేయింగ్ పనులకు ఏర్పాట్లు చేస్తున్నారు.
మలేరియా జ్వరం
ఎనాఫిలస్ దోమ కుట్టడం ద్వారా ఈ జ్వరం వస్తుంది. వైవాక్స్ మలేరియా, ఫాల్స్ ఫారమ్ మలేరియా అనే రెండు రకాలు ఉన్నాయి. ఇందులో రెండో రకం అత్యంత ప్రమాదకరమైంది. జ్వరం వచ్చినప్పుడు టెస్ట్లు చేయించుకుని సకాలంలో చికిత్స చేయించుకోకపోతే రోగి చనిపోయే ప్రమాదం ఉంది. తీవ్రమైన జ్వరం, రోజు విడిచి రోజు జ్వరం, తీవ్రమైన తలనొప్పి ఉంటే అవి మలేరియా లక్షణాలు. ఈ లక్షణాలు కనిపించిన వెంటనే వైద్యులను సంప్రదించి రక్త పరీక్షలు చేయించుకోవాలి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం. మురికినీరు నిల్వలేకుండా చూసుకోవడం. దోమల నివారణకు చర్యలు తీసుకోవడం వంటి పనులు చేయాలి.
టైఫాయిడ్
కలుషిత నీటిని తాగడం వల్ల, బహిరంగ మలవిసర్జన వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందుతుంది. జ్వరం త్వరగా తగ్గకపోవడం, ఒంటి నొప్పులు, తలనొప్పి, కడుపులో అల్సర్ను వ్యాధి లక్షణాలుగా గుర్తించాలి. సురక్షిత నీటిని తాగడం, జ్వరం వచ్చిన వెంటనే రక్త పరీక్షలు చేయించుకుని వైద్యం పొందడం ద్వారా నయం కావచ్చు.
డయేరియా
కలుషిత నీరు తాగడం, కలుషిత ఆహారం తీసుకోవడం వల్ల డయేరియా వస్తుంది. ఒకరి నుంచి మరొకరికి త్వరగా వ్యాప్తి చెందుతుంది. నిరంతరాయంగా విరోచనాలు, వాంతులు కావడం ఈ వ్యాధి లక్షణాలు. డయేరియా నివారణకు వైద్యులు ఫ్లూయిడ్స్ ఎక్కిస్తారు. సురక్షిత, కాచి చల్లార్చిన నీటిని తాగాలని, పులుపు, కారం ఉండే ఆహారాన్ని తగ్గించడం, ఫాస్ట్ ఫుడ్ వంటివి తినకపోవడం ఉత్తమమని వైద్యులు సూచిస్తున్నారు.
సీజనల్ వ్యాధులపై అప్రమత్తత అవసరం
దోమల నివారణకు ముందస్తు చర్యలు
జాగ్రత్తలు తప్పనిసరి
వర్షాకాలంలో వచ్చే వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. కలుషిత నీటిని తాగడం వల్ల వ్యాధులు ప్రబరిల్లే అవకాశం ఉంది. ఎక్కడడపడితే అక్కడ నీరు తాగకూడదు. జ్వరం వస్తే అందుబాటులో ఉన్న ఆస్పత్రికి వెళ్ళి రక్త పరీక్షలు చేయించుకుని వ్యాధిని బట్టి వైద్యం పొందాలి. దోమతెరలు వాడటం మంచిది.
ఎన్ఎస్ఎస్ ప్రసాద్, మలేరియా అధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం
మొదటి స్ప్రేయింగ్ పనులు పూర్తి
మలేరియా సమస్యాత్మక గ్రామాల్లో మొదటివిడత స్ప్రేయింగ్ పనులు పూర్తయ్యాయి. ఉన్నతాధికారులు పర్యవేక్షణలో పనులు చేస్తున్నాం. జున్ 15 నుంచి రెండో విడత స్ప్రేయింగ్ పనులు జరుగుతాయి. ప్రజలు పనులకు పూర్తి సహకారం అందించాలి. పి. పెద్దిరాజు,
సబ్ యూనిట్ ఆఫీసర్, బుట్టాయగూడెం
జిల్లాలో మలేరియా సమస్యాత్మక గ్రామాలు– 153
పోలవరం, బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో –117 గ్రామాలు
విలీన మండలాలైన వేలేరుపాడు, కుక్కునూరులో
– 36 గ్రామాలు
మొదటి విడత స్ప్రేయింగ్ పనులకు వచ్చిన మలాథియన్ – 53 టన్నులు

వానాకాలంలో వ్యాధుల ముప్పు

వానాకాలంలో వ్యాధుల ముప్పు

వానాకాలంలో వ్యాధుల ముప్పు