
కోకో గింజల చోరీ కేసులో నలుగురి అరెస్టు
జంగారెడ్డిగూడెం: కోకో గింజల చోరీ కేసుల్లో నలుగురిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం డీఎస్పీ యు.రవిచంద్ర తెలిపారు. ఆదివారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. జంగారెడ్డిగూడెం, టి.నరసాపురం, లక్కవరం పోలీస్స్టేషన్ల పరిధిలో ఇటీవల కోకో గింజల చోరీ జరిగింది. దొంగిలించిన రూ.8 లక్షలు విలువైన 2 వేల కేజీల కోకో గింజలు అమ్మేందుకు ప్రయత్నించిన క్రమంలో, దాడి చేసి జంగారెడ్డిగూడెం మండలం చక్రదేవరపల్లికి చెందిన కంకిపాటి కీర్తిరాజు, మానికల మంగరాజు, దొప్పసాని వెంకన్నబాబు, పుట్లగట్లగూడెంకు చెందిన కటారి సుబ్రహ్మణ్యంను అరెస్టు చేశామన్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారని తెలిపారు. వీరిలో కంకిపాటి కీర్తిరాజు పగలు మేకలు కాస్తూ పొలాల్లో ఉన్న కోకో గింజలు ఆరబెట్టిన ప్రదేశాలు గమనించి, బృందంలోని మరో ఐదుగురికి చెబుతాడు. ఆటోలో రహస్య ప్రదేశానికి తరలించేవారు. వీలుచూసుకుని అమ్మేవారు. వీరిపై జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, లక్కవరం పోలీస్స్టేషన్ పరిధిలో 2 కేసులు, టి.నరసాపురం పీఎస్ పరిధిలో ఒక కేసు నమోదైంది. ద్వారకాతిరుమల, తడికలపూడి పోలీస్స్టేషన్ల పరిధిలో సైతం కేసులు ఉన్నట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుల నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకోవడం పాటు, చోరీకి వినియోగించిన ఆటోను సీజ్ చేసినట్లు చెప్పారు. కేసును చేధించిన ఎస్సై జబీర్, ఏఎస్సై సంపత్కుమార్, పీసీలు రమేష్, బి.రాజశేఖర్లకు రివార్డు కోసం ఎస్పీకి సిపార్సు చేస్తున్నట్లు తెలిపారు.