సంక్షోభంలో మామిడి రైతులు | - | Sakshi
Sakshi News home page
breaking news

సంక్షోభంలో మామిడి రైతులు

Jun 9 2025 7:01 AM | Updated on Jun 9 2025 7:01 AM

సంక్ష

సంక్షోభంలో మామిడి రైతులు

నూజివీడు: ఈ ఏడాది బంగినపల్లి మామిడి రైతులను, వ్యాపారులను సంక్షోభంలోకి నెట్టేసింది. ప్రతికూల వాతావరణం, నల్లతామర కారణంగా బంగినపల్లి దిగుబడి దారుణంగా తగ్గిపోగా ఉన్న కాస్త కాయలకు మార్కెట్లో ధర లేకుండా పోయింది. దీనికి తోడు సిండికేట్‌ మాయాజాలంతో మామిడి ధరలు పతనమయ్యాయి. దీంతో పెట్టిన పెట్టుబడులు కూడా రాక రైతులు నష్టాలపాలయ్యారు. జిల్లాలో మామిడితోటలు దాదాపు 40 వేల ఎకరాల్లో సాగవుతుండగా ఒక్క నూజివీడు నియోజకవర్గంలోనే 35 వేల ఎకరాల్లో మామిడి తోటలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని రైతులకు ప్రధాన ఆదాయ వనరు మామిడే. ఖరీఫ్‌ సీజన్‌లో సాగుచేసిన పంటలు నష్టపోయినా, మామిడి ఆదుకుంటుందనే ధీమాతో రైతులు మామిడిపై నమ్మకం పెట్టుకుంటారు. బంగినపల్లి రకం తోటలు దాదాపు 25 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్నాయి. ఈ ప్రాంతం నుంచి మామిడి కాయలను స్థానికంగా ఉన్న మార్కెట్‌లతో పాటు నున్న, హైదరాబాద్‌లలోని మార్కెట్‌, ముంబాయి, ఇండోర్‌, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాలకు ఎగుమతి చేస్తారు.

దిగజారిన ధర

మామిడి ధర కూడా దిగజారుతూ వచ్చిందే తప్ప ఈ ఏడాది పెరిగిన దాఖలాలు లేవు. సీజన్‌ ప్రారంభమైన మార్చి మొదటి వారంలో బంగినపల్లి టన్ను ముంబాయి మార్కెట్‌లో రూ.80 వేల నుంచి రూ.90 వేల ధర పలకగా స్థానికంగా రూ.40 వేలు పలికింది. రానురాను రూ.30 వేలకు, రూ.20 వేలకు తగ్గుతూ ప్రస్తుతం కాయ బాగుంటే రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ధర లభిస్తోంది. ఏ మాత్రం నాణ్యత లేకపోయినా టన్ను కేవలం రూ.10 వేలకే లభిస్తోందని రైతులు వాపోతున్నారు. మామిడికి ఇంత దారుణమైన పరిస్థితి గత 25 ఏళ్లలో ఎన్నడూ చూడలేదని పేర్కొంటున్నారు. నున్న, హైదరబాద్‌లలో ఉన్న మామిడి మార్కెట్‌కు కాయలను కొనుగోలు చేయడానికి వచ్చే ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన సేట్‌లు సిండికేట్‌ కావడం వల్ల ధరలు పెరగడం లేదని రైతుల నుంచి వ్యక్తమవుతున్న అభిప్రాయం. రైతులకు నష్టం చేకూరుస్తున్న సిండికేట్‌ను నిలువరించేందుకు ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రయత్నాలు చేయకపోవడం, అసలు మామిడి రైతులను ప్రభుత్వం పట్టించుకున్న దాఖలాలే లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో మామిడిపై రైతులు పెట్టుకున్న ఆశలు రాలిపోయాయి.

అకాల వర్షాలు దెబ్బతీశాయి

ఈ ఏడాది మే నెల అంతా కురిసిన అకాల వర్షాల వల్ల బంగినపల్లి మామిడి కాయలు నాణ్యత కోల్పోవడంతో ధర పతనమైంది. కొన్ని రోజులైతే మామిడి కాయలను ఎవరూ కొనుగోలు చేయకపోవడంతో కోతలను సైతం నిలిపివేశారు. వర్షాలు పడిన దగ్గర నుంచి కాయలను పురుగులు ఆశించడంతో కొనేవారే లేకుండా పోయారు. ఇలా ప్రతికూల వాతావరణంతో పాటు పలు కారణాల వల్ల ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర నష్టాల్లో కూరుకుపోయారు.

ధర లేని బంగినపల్లి మామిడి

రూ.60 వేల నష్టం వచ్చింది

నాలుగు ఎకరాల మామిడి తోట ఉంది. పెట్టుబడి రూ.1.70 లక్షలైంది. బంగినపల్లి రకం కాయలు కోసి మార్కెట్‌లో విక్రయిస్తే కోతకూలి, కిరాయి పోను రూ.1.10 లక్షలు మాత్రమే వచ్చాయి. దీంతో రూ.60 వేల నష్టం వాటిల్లింది. ఈ ఏడాది కాపు తక్కువగా ఉన్నప్పటికీ ఆశించిన ధర లేదు. –నీలపాల కోటేశ్వరరావు,

మామిడి రైతు, యనమదల, నూజివీడు మండలం

సంక్షోభంలో మామిడి రైతులు 1
1/1

సంక్షోభంలో మామిడి రైతులు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement