
నేటి నుంచి వేణుగోపాల స్వామి వార్షికోత్సవాలు
చింతలపూడి: మండలంలో యర్రగుంటపల్లిలో సంతాన వేణుగోపాలస్వామి వార్షిక మహోత్సవాలు సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం రుక్మిణీ సత్యభామ సమేత వేణుగోపాలస్వామి, శ్రీ షిరిడీ సాయిబాబా ,అయ్యప్ప స్వామి వైభవంగా విశేష పూజలు ప్రారంభమవుతాయి. ముందుగా గోపూజ, గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభిస్తారు. 1893లో చంద్రగిరి కాశీ అనే భక్తుడికి స్వామివారు స్వప్నంలో కనిపించి యర్రగుంటపల్లి గ్రామంలో వేణుగోపాలస్వామి ఆలయం నిర్మించాలని ఆదేశించడంతో ఆలయ నిర్మాణం చేపట్టినట్లు చెబుతారు. చివరి రోజుల అన్నదానం చేయడానికి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ ధర్మకర్త చంద్రగిరి శేష కిరణ్ తెలిపారు.
23 నుంచి పీ సెట్ ఎంపికలు
దెందులూరు: వ్యాయామ కళాశాలలో ప్రవేశాలకు ఫిజికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (పీ–సెట్ ) ఎంపికలు ఈ నెల 23 నుంచి ప్రారంభమవుతాయని గోపాన్నపాలెం వ్యాయామ విద్య కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.నతానియల్ అన్నారు. రూ.వెయ్యి అపరాధ రుసుంతో ఈనెల 11 వరకు, రూ.2 వేల అపరాధ రుసుంతో 13 వరకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు.