
ఖర్చంతా గ్రంథ పాలకులదే
దెందులూరు: వేసవి సెలవుల్లో విద్యార్థులకు విజ్ఞానం పెంపొందించి, ఆటలు పాటలు ద్వారా మానసిక, శారీరక దృఢత్వం పెంచేందుకు గ్రంథాలయాల్లో వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులు నెలరోజుల పాటు నిర్వహించారు. పుస్తకాలు, పత్రికలు చదివించడం, నీతి కథలు, ప్రముఖుల జీవితాలు వివరించడం, వ్యాసరచన, డ్రాయింగ్, బొమ్మల తయారీ, చెస్, కబడ్డీ, కోకో పోటీలను నెలరోజుల పాటు గ్రంథాలయంలో గ్రంథ పాలకులు, రిసోర్స్ పర్సన్లు నిర్వహించారు. ప్రతిరోజు ఉదయం, సాయంత్రం వివిధ విభాగాల్లో శిక్షణ ఇచ్చారు. ప్రతిరోజు బిస్కెట్లు, మజ్జిగ ఏదోకటి ఇచ్చారు. ప్రతి గ్రంథాలయంలో చదువరి సంఖ్యను బట్టి 15 మంది నుంచి 20 మంది కొన్ని గ్రంథాలయాల్లో 20 నుంచి 30 వరకు విద్యార్థులు శిక్షణ పొందారు. రోజుకు బిస్కెట్లు, మజ్జిగ నిమిత్తం రూ.150 నుంచి 200 వరకు ఖర్చులయ్యాయి. శిక్షణ అనంతరం వివిధ విభాగాల్లో విజేతలకు మెడల్స్, సర్టిఫికెట్లు, బొకేలు, చాక్లెట్లు ఇచ్చారు. నెల మొత్తం మీద ఒక్కో గ్రంథాలయానికి అన్ని ఖర్చులకు రూ.10 వేల నుంచి రూ.14 వేల వరకు పెట్టుబడి పెట్టారు.
జిల్లా గ్రంధాలయ సంస్థ, ఒక రూపాయి కూడా గ్రంథాలయాలకు నిర్వహణ ఖర్చులు మంజూరు చేయలేదు. చాలీచాలని తక్కువ జీతాలతో కాలం నెట్టుకు వస్తుంటే వేసవి శిక్షణ తరగతులు పేరిట నెలకు రూ.10 వేల నుంచి 14 వేలు తాము పెట్టుబడి పెట్టడం తలకు మించిన భారంగా తయారైందని అనేకమంది గ్రంథ పాలకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఖర్చుతో కూడుకున్న కార్యక్రమానికి నిర్వహణ నిమిత్తం కూడా డబ్బులు మంజూరు చేయకపోతే తాము ఎలా పెట్టుబడి పెడతామని తక్కువ జీతాలతో చాలా ఇబ్బందులు పడుతున్నామని అంటున్నారు.
తీరని ఉద్యోగుల సమస్యలు
కూటమి ప్రభుత్వం ఏర్పడి సంవత్సరం పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో గ్రంథాలయ ఉద్యోగుల పీఆర్సీ, డీఏ ఊసెత్తలేదు. డీఎస్సీ ఇతర పోటీ పరీక్షలకు గ్రంథాలయాల్లో ఇదివరకు ఉన్న జీకే పుస్తకాలే తప్ప నూతనంగా కొన్న పుస్తకాలు ఏవీ లేవు. విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా కొత్త పుస్తకాలు కొనాల్సిన అవసరం ఉంది. శాఖ పరంగా పీఆర్సీ, డీఎ సమస్యలు పరిష్కరించకపోగా డబ్బుతో కూడుకున్న కార్యక్రమాలు తమపై రుద్దితే ఎలాగని గ్రంథాలయ ఉద్యోగుల అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఉద్యోగుల పదోన్నతులపై కూడా చర్యలు లేవు. జిల్లాలో అనేకచోట్ల నేటికీ అద్దె భవనాల్లోనే గ్రంథాలయాలు నిర్వహిస్తున్నారు. ఇన్ని సమస్యలతో గ్రంథాలయాలు సతమతమవుతున్నాయి. వేసవి విజ్ఞాన శిక్షణ తరగతులకు పెట్టుబడి పెట్టామని, ప్రభుత్వం బిల్లులు మంజూరు చేయాలని కోరుతున్నారు.
ప్రభుత్వం ఇస్తే చెల్లిస్తాం
వేసవి విజ్ఞానశిక్షణ తరగతులు నిర్వహణకు ప్రభుత్వం నిధులు మంజూరు చేయలేదని... నిధులు వస్తే జమ చేస్తామని ఏలూరు జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యదర్శి శేఖర్ బాబు అన్నారు.
వేసవి తరగతుల నిర్వహణ బిల్లులు చెల్లించని ప్రభుత్వం