
సెలవుల్లో తరగతుల నిర్వహణపై ఆగ్రహం
ఏలూరు (ఆర్ఆర్పేట): వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహిస్తున్న నగరంలోని విద్యానగర్లోని శ్రీ చైతన్య పాఠశాల గుర్తింపు రద్దుచేయాలని పీడీఎస్యూ ఆధ్వర్యంలో గురువా రం పాఠశాల వద్ద ఆందోళన నిర్వహించారు. అనంతరం తరగతులు బాయ్ కాట్ చేయించి విద్యార్థులను ఇంటికి పంపించి వేశారు. ఈ సందర్భంగా పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని మాట్లాడుతూ వేసవి సెలవుల్ని పక్కన పెట్టి గురువారం నుంచి ఈ పాఠశాలలో తరగతులు నిర్వహించడం అంటే విద్యాశాఖ నిబంధనలను ఉల్లంఘించడమే అన్నారు. అలాగే పదో తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్ష కూడా నిర్వహించడం గుర్తించామన్నారు. విద్యాశాఖ నిబంధనలు ఉల్లంఘించిన ఈ బ్రాంచ్ గుర్తింపు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగర అధ్యక్షుడు వై.యశ్వంత్ పాల్గొన్నారు.