
మట్టి కోసం టీడీపీలో వర్గపోరు
నూజివీడు: చెరువుల్లో మట్టిని కొల్లగొట్టి జేబులు నింపుకునేందుకే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినట్లుగా ఉంది. చెరువుల్లో మట్టిని తాము తోలుకోవాంటే తాము తోలుకుంటామంటూ నాయకులు పోటీ పడుతున్నారు. పలు గ్రామాల్లో మట్టి కోసం వర్గపోరు తారాస్థాయికి చేరింది. కొన్నిచోట్ల ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమ మట్టితోలకాలను యథేచ్ఛగా నిర్వహిస్తుంటే మరికొన్ని చోట్ల చెరువుల్లో మట్టిని అనుమతులు లేకుండా ఎలా తోలతారని టీడీపీ నాయకులే అడ్డుకుంటున్నారు.
మట్టి తవ్వకాలను అడ్డుకున్న రైతులు
నూజివీడు పట్టణంలోని పెద్దచెరువులో మాజీ కౌన్సిలర్ టీడీపీ నాయకుడు వేమూరి వెంకట కృష్ణారావు ఇరిగేషన్ అధికారుల నుంచి అనుమతులు తీసుకొని మట్టి తోలకాలను శుక్రవారం చేపట్టగా అదే పెద్దచెరువు సాగునీటి సంఘం సభ్యులు, రైతులు తమ చెరువులో మట్టిని తోలడానికి వీల్లేదని మట్టిని తోలకుండా అడ్డుకున్నారు. వేమూరు వెంకట కృష్ణారావుకు ఆర్ఎస్ నెంబరు 871–3లోని ఎకరం భూమిని మెరక చేసుకొనుటకు గాను వెయ్యి క్యూబిక్ మీటర్ల మట్టిని పెద్ద చెరువు నుంచి తవ్వి తీసుకెళ్లేందుకు గాను ఇరిగేషన్ ఈఈ అనుమతి ఇచ్చారు. దీంతో మట్టి తవ్వకాలను చేపట్టగా సాగునీటి సంఘం సభ్యులు, ఆయకట్టు రైతులు అడ్డుకోవడంతో కొంతసేపు వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. చెరువుకు నాలుగు చోట్ల గండ్లు పడి దాదాపు 10నెలలు గడిచినా ఇంత వరకు గండ్లు పూడ్చకుండా చెరువులో మట్టిని వేరే వాళ్లు ఎలా తవ్వుకొని తీసుకెళ్తారని రైతులు ప్రశ్నించారు. అసలు అనుమతుల కోసం దరఖాస్తు పెట్టేటప్పుడు కనీసం నీటి సంఘం అధ్యక్ష, కార్యదర్శులను సంప్రదించకుండా ఎలా మట్టిని తవ్వుతారని నిలదీశారు. సాగునీటి సంఘం సభ్యులు ట్రాక్టర్లను అడ్డుకోవడాన్ని టీడీపీకి చెందిన కొందరు మంత్రి కొలుసు పార్థసారథి దృష్టికి తీసుకెళ్లారు. దీంతో ఈ వ్యవహారంపై మంత్రి ఎలా స్పందిస్తారోనని ఆసక్తి నెలకొంది.
కొన్నంగుంటలో మట్టి అక్రమ తవ్వకాలు
బోర్వంచ శివారు కొన్నంగుంటలోని గోరింత చెరువులో గురువారం అర్ధరాత్రి నుంచి తెల్లవార్లూ అక్రమ మట్టి తవ్వకాలు యథేచ్ఛగా కొనసాగాయి. ట్రాక్టర్లలో మట్టి తరలిపోయింది. గ్రామానికి చెందిన కొందరు టీడీపీ నాయకులు మట్టి అక్రమ తవ్వకాలకు తెరలేపి ఇష్టారాజ్యంగా కొనసాగించారు. అక్రమ తోలకాలు చేస్తున్నట్లు తెలుసుకున్న బోర్వంచ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకుడు హరికోటి సంగీతరావు ట్రాక్టర్లను ఆపి ఎలాంటి అనుమతులు లేకుండా మట్టిని ఎందుకు తోలుతున్నారని నిలదీశారు. అయినప్పటికీ మా ఇష్టం వచ్చినట్లుగా మేము తోలతామని చెప్పి ట్రాక్టర్లలో మట్టిని అడ్డూ అదుపూ లేకుండా తెల్లవార్లు తరలించారు.
ఒక వర్గం మట్టి తోలుతుంటే అడ్డుకుంటున్న మరో వర్గం
నూజివీడు పెద్దచెరువులో, కొన్నంగుంటలో మట్టి తవ్వకాలు

మట్టి కోసం టీడీపీలో వర్గపోరు