19 నుంచి ఉత్సవాలకు ఏర్పాట్లు
జంగారెడ్డిగూడెం : బ్రహ్మోత్సవాలకు పారిజాతగిరి సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. ఈ నెల 19 నుంచి ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. జాతీయ రహదారిని ఆనుకుని ఆహ్లాదకరమైన వాతావరణంలో ఉన్న పారిజాత గిరి వెంకటేశ్వరస్వామి ఆలయం పుణ్యక్షేత్రంగా ప్రసిద్ధిగాంచింది. క్షేత్ర పురాణం ప్రకారం.. చిట్టియ్య అనే భక్తుడికి వేంకటేశ్వరుడు కలలో కనిపించి జంగారెడ్డిగూడెం ఉత్తరాన కొండల్లో తన పాదాలు వెలుస్తాయని ఆ ప్రాంతంలో ఆలయాన్ని నిర్మించాలని తెలిపారు. చిట్టియ్య అన్వేషించగా, ఉత్తర వైపున ఉన్న 7 కొండలలో 6వ కొండపై పారిజాతగిరి వక్షం కింద స్వామి వారి పాదాలుదున్న శిలను గుర్తించి చిన్న ఆలయాన్ని నిర్మించారు. నాటి నుంచి భక్తుల అభీష్టాలు తీర్చుతూ ఆలయం అభివృద్ధి చెందింది. పాడిపంటలు కలిగిన ప్రదేశం కాబట్టి గోకులం అనిని, పారిజాత గిరి వృక్షాలు ఉండడంతో పారిజాత గిరి అని, వేంకటేశుడు కొలువై ఉన్నందున తిరుపతి అంటాడు. అందుకు గోకుల తిరుమల పారిజాతగిరిగా ప్రసిద్ధిగాంచింది. పారిజాతగిరిలో.. కొండ వెనుక వరుసగా ఏడు కొండలు ఉండగా ఒక కొండపై పారిజాతగిరి వాసుడి పాదపద్మాలు అవతరించాయి. దీంతో అప్పటి నుంచి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నారు. పారిజాతగిరి వాసుడికి ఎదురుగా గరుడకొండ ఉంది.
గిరి ప్రదక్షిణ కోసం రోడ్డు నిర్మాణం
దేవాలయం చుట్టూ ప్రదక్షిణ చేస్తే స్వామి నుంచి వెలువడే శక్తిని భక్తులు గ్రహించి పునీతులవుతారని నమ్మకం. దాత సహకారంతో గిరి ప్రదక్షిణ రోడ్డు నిర్మాణం పూర్తయ్యింది. పారిజాతగిరి ఆరు కొండల చుట్టూ సుమారు 2.5 కిలోమీటర్ల మేర దాత గోకరాజు గంగరాజు అందజేసిన రూ.60 లక్షలతో సీసీ రోడ్డు నిర్మించారు. ఈ తరహా గిరి ప్రదక్షిణ అరుణాచలం, ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం, శ్రీకాళహస్తిలో మాత్రమే ఉన్నాయి. ఆలయంలో ప్రతి శనివారం అన్నదానం, మే నెలలో బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తారు.
19 నుంచి బ్రహ్మోత్సవాలు
పారిజాతగిరిలో 19వ తేదీ నుంచి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. 19న సాయంత్రం బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ చేస్తారు. 20న శేష వాహన సేవ, 21న హనుమంత వాహన సేవ, 22న శ్రీనివాస కళ్యాణం, చంద్ర ప్రభ సేవ, 23న గరుడ వాహన సేవ, 24న వసంతోత్సవం, చక్రస్నానం, 25న శ్రీపుష్ఫయాగం నిర్వహిస్తారు.
బ్రహ్మోత్సవాల బ్రోచర్ ఆవిష్కరణ
బ్రహ్మోత్సవాల బ్రోచర్ను శనివారం ఆలయ అభివృద్ధి కమిటీ ఆవిష్కరించింది. ఈ సందర్భంగా కమిటీ ప్రతినిధులు మాట్లాడుతూ సోమవారం సాయంత్రం బ్రహ్మోత్సవాల ప్రారంభ పూజలు జరుగుతాయన్నారు. సాయంత్రం 6 గంటలకు విశ్వక్సేన పూజ, అంకురార్పణ, వైనతేయ ప్రతిష్ఠ జరుగుతాయన్నారు. కార్యక్రమంలో కమిటీ చైర్మన్ పేరిచర్ల జగపతిరాజు, అబ్బిన దత్తాత్రేయ, రాజన పండు, గొట్టుముక్కల భాస్కరరాజు, అర్జుల మురళి, దండు ధనరాజు, రెడ్డి రంగప్రసాద్, వాసవీ సాయి నగేష్ తదితరులు పాల్గొన్నారు.
బ్రహ్మోత్సవాలకు ఏర్పాట్లు పూర్తి
బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశాం. 22న స్వామి కల్యాణోత్సవం జరగనుంది. ఆలయ మాడవీధుల్లో అర్చకుల వేద మంత్రాల నడుమ స్వామికి వివిధ వాహన సేవలు నిర్వహించనున్నాం. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి కృపకు పాత్రులు కావాలి.
ఎం.రాంబాబు, ఈవో, పారిజాతగిరి