
అక్రమంగా రవాణా చేస్తున్న రేషన్ బియ్యం సీజ్
ద్వారకాతిరుమల: మండలంలోని సీహెచ్ పోతేపల్లి నుంచి కాకినాడకు జరుగుతున్న రేషన్ బియ్యం అక్రమ రవాణాకు సివిల్ సప్లయిస్ అధికారులు శుక్రవారం అడ్డుకట్ట వేశారు. 19 టన్నుల 80 క్వింటాళ్ల బియ్యాన్ని సీజ్ చేశారు సీహెచ్ పోతేపల్లి గ్రామానికి చెందిన తోట శ్రీకాంత్ ఆయిల్పామ్ తోటలోని పెంకిటింట్లో నిల్వ చేసిన రేషన్ బియ్యాన్ని అక్రమంగా తరలిస్తున్నట్టు సివిల్ సప్లయిస్ అధికారులు సమాచారం అందుకున్నారు. దాంతో డీఎస్ఓ సత్యనారాయణరాజు, సివిల్ సప్లయిస్ డీటీ తహసీల్దార్ టి.కామేశ్వరరావులు ఆ ఇంటిపై దాడి చేశారు. ఆ సమయంలో ఐసర్ వ్యాన్లో లోడ్ చేస్తున్న మొత్తం 19 టన్నుల 80 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. వీటిని కాకినాడ జిల్లా, పిఠాపురం మండలం, బి.ప్రత్తిపాడుకు చెందిన వ్యాన్ డ్రైవర్లు గంగిరెడ్ల శివస్వామి, నామా వీరబాబులు, కాకినాడకు చెందిన చోడిశెట్టి మహేష్కు సరఫరా చేస్తున్నట్టు గుర్తించారు. ఇదిలా ఉంటే చోడిశెట్టి మహేష్పై గతంలో సైతం పలు కేసులు నమోదైనట్టు డీఎస్ఓ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్టు చెప్పారు.