4,5 తేదీల్లో ఎస్వీ వెటర్నరీలో జాతీయ సమావేశం
చంద్రగిరి: శ్రీవేంకటేశ్వర పశువైద్య కళాశాలలో ఈ నెల 4, 5వ తేదీల్లో రెండు రోజుల పాటు పీజీ, డాక్టరల్, యూజీ చివరి సంవత్సరం విద్యార్థులకు వెటర్నరీలో పరిశోధన, నూతన ఆవిష్కరణలు, పశువుల ఆరోగ్యం, ఉత్పాదనపై ప్రభావం అనే అంశంపై రెండు రోజుల పాటు జాతీయ సమావేశాలు నిర్వహించనున్నట్లు పశువైద్య కళాశాల అసోసియేట్ డీన్ డాక్టర్ జగపతి రామయ్య తెలిపారు. మంగళవారం ఆయన తన చాంబర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. విద్యార్థుల ఆలోచనలు, వారి ఆవిష్కరణల ద్వారా పశువుల్లో వ్యాధులు తగ్గించి, పాలు, మాంసం ఉత్పత్తులు పెంచి జాతీయ స్థూల ఉత్పత్తిని పెంచడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశమన్నారు. దేశంలోని 8 రాష్ట్రాల నుంచి సుమారు 120 మంది విద్యార్థులు పాల్గొనడంతోపాటు వారి పరిశోధన పత్రాలను సమావేశంలో చర్చించడం జరుగుతుందన్నారు. ఈ జాతీయ సమావేశంలో మొత్తం 6 అంశాలపై చర్చించి, ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అవార్డు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రకాష్ ఫుడ్స్, ఫీడ్ మిల్ చైర్మన్ డాక్టర్ ప్రకాష్రావు, వీసీ జేవీ రమణ, అంకో సీక్ కంపెనీ చైర్మన్ డాక్టర్ శ్రీలత, న్యూజీలాండ్, అస్ట్రేలియాకు చెందిన జీఓటీఎస్ కంపెనీ సీనియర్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ పాల్గొనున్నారన్నారు.


