
ఆర్అండ్బీలో బదిలీలు
చిత్తూరు కార్పొరేషన్ : జిల్లాలోని ఆర్అండ్బీ, నేషనల్ హైవే (ఎన్హెచ్) పరిధిలో పలువురిని బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఆర్అండ్బీ జిల్లా ఎస్ఈగా సురేష్బాబును నియమించారు. కర్నూలులో ఈఈగా ఉన్న ఆయనను జిల్లా ఇన్చార్జి ఎస్ఈగా నియమించారు. చిత్తూరు ఎన్హెచ్ డీఈ కృష్ణయ్యను అనంతపురం ఎన్హెచ్ సర్కిల్ ఇంచార్జి ఈఈగా బదిలీ చేశారు. సబ్ డివిజన్ డీఈగా ఉన్న సత్యమూర్తిని టెక్కలి ఇన్చార్జి ఆర్అండ్బీ ఈఈగా బదిలీ చేశారు. ఏఈగా ఉన్న సుజాతను ఉద్యోగోన్నతిపై చిత్తూరు ఎన్హెచ్ డీఈగా నియమించారు.
విద్యుత్ గ్రీవెన్స్లను
వెంటనే పరిష్కరించాలి
చిత్తూరు కార్పొరేషన్ : సకాలంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ట్రాన్స్కో చిత్తూరు అర్బన్ ఈఈ మునిచంద్ర తెలిపారు. బుధవారం చిత్తూరు అర్బన్ డివిజన్ కార్యాలయంలో గ్రీవెన్స్ కార్యక్రమం నిర్వహించారు. డివిజన్ పరిధిలో పలు సమస్యలను వినియోగదారులు తెలియజేశారు. బిల్లు రివిజన్ సమస్యను కొత్తపల్లె నుంచి, వాణిజ్య సర్వీసు నుంచి గృహ సర్వీసుకు మార్పు చేయాలని ఓబనపల్లె నుంచి, విద్యుత్ సర్వీసుకు ఉన్న మొబైల్ నంబర్ను మార్పు చేయాలని మురకంబట్టుకు చెందిన వినియోగదారుడు ఫిర్యాదులు చేశారు. వీటిని అప్పటికప్పుడు మార్పు చేసినట్లు ఈఈ తెలిపారు. కార్యక్రమంలో డీఈ ప్రసాద్, టెక్నికల్ ఏఈ మాధురి తదితరులు పాల్గొన్నారు.
ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల నియామకం
చిత్తూరు అర్బన్ : చిత్తూరులోని రెండు న్యాయస్థానాలకు ఇద్దరు పబ్లిక్ ప్రాసిక్యూటర్లను నియమిస్తూ రాష్ట్ర హోంశాఖ బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. చిత్తూరులోని ప్రిన్సిపల్ జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి వీఆర్.రామకృష్ణ, 6వ అదనపు జిల్లా, సెషన్స్ న్యాయస్థానానికి అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్గా ఎం.బాలాజీని నియమించింది. మూడేళ్ల పాటు వీరు ఈ పదవిలో కొనసాగనున్నారు.
ముగిసిన డీఎస్సీ పరీక్షలు
చిత్తూరు కలెక్టరేట్: చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో గత నెల 6వ తేదీ నుంచి నిర్వహిస్తున్న డీఎస్సీ పరీక్షలు బుధవారంతో ముగిశాయ్. చిత్తూరు డీఈఓ వరలక్ష్మి, తిరుపతి డీఈఓ కేవీఎన్ కుమార్ పరీక్షలను పకడ్బందీగా పర్యవేక్షించారు. చిత్తూరు జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 33,181 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా, 30,952 మంది హాజరయ్యారు. మిగిలిన 2,229 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. అదేవిధంగా తిరుపతి జిల్లాలోని 8 పరీక్ష కేంద్రాల్లో పరీక్షలకు మొత్తం 21,340 మంది అభ్యర్థులు హాజరుకావాల్సి ఉండగా 19,550 మంది హాజరయ్యారు. మిగిలిన 1,790 మంది అభ్యర్థులు గైర్హాజరైనట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు.

ఆర్అండ్బీలో బదిలీలు

ఆర్అండ్బీలో బదిలీలు