
బతుకు‘బండి’ బస్టాండు
● రోడ్డున పడ్డ ఆపరేటర్లు ● రేషన్ షాపుల్లోనే రేషన్ పంపిణీ మొదలు ● ఇకపై వాహనాలకు డ్యూలు చెల్లించని ప్రభుత్వం ● ఆపరేటర్లే మిగిలిన అప్పును చెల్లించాలి ● మూడు డ్యూలు చెల్లించకుంటే వాహనం సీజ్ తప్పదు ● ఉపాధి కోల్పోయిన వాహన నిర్వాహకులు
ప్రభుత్వం మోసం చేస్తుందని అనుకోలేదు..
ఇటీవల సంబంధిత మంత్రిని కలిసి మాట్లాడినా మీకెలాంటి ఇబ్బందులు ఉండవని హామీ ఇచ్చారు. కానీ ప్రభుత్వం ఇకపై డీలర్ల ద్వారానే సరుకులు పంపిణీ అని ఉత్తర్వులను జారీ చేసింది. ఇకపై వాహనాలకు కంతులు ఎలా కట్టుకోవాలి. మా కుటుంబాలను ఎలా పోషించాలో అర్థం కావడంలేదు. – వేణు, ఎండీయూ వాహనాల
ఆపరేటర్ల సంఘ జిల్లా అధ్యక్షుడు
వాహనాన్నే నమ్ముకొని ఉన్నాం
గత ప్రభుత్వంలో నుంచి ఆపరేటర్గా నిత్యావసరాలను అందిస్తూ ప్రభుత్వం అందించే వేతనంతో కుటుంబాన్ని పోషించుకుంటున్నాం. ఇకపై రేషన్ పంపిణీకి వాహనాలు లేవని ఆదేశాలందాయి. ఆ ఉన్న పనిపోయింది. మళ్లీ ఇప్పుడు పనికోసం వెతుక్కోవాలి. బండికి డ్యూలు కట్టాలంటే అద్దెలు దొరికితేనే కదా. దీన్నే నమ్ముకుని ఉన్న మాలాంటి వాళ్ల బాధలు ఈ ప్రభుత్వానికి అర్థం కాలేదు. – బాబు, ఎండీయూ ఆపరేటర్, నక్కపల్లి
ఉపాధి లేకుండా చేశారు
ఏదో పని ఉందని దాన్ని చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాళ్లం. ఉన్నట్టుండి మమ్మల్ని తీసేశారు. వాహనాలకు ఇంకా బ్యాంకు అప్పు పెండింగ్లో ఉంది. దాన్ని మేమే కట్టుకోవాలంట. ఏమి చేసేదో అర్థం కాలేదు. ఉన్న వాహనాన్ని బాడుగకు తిప్పదామన్నా బాడుగలు దొరకడంలేదు. ఏం చేయాలో దిక్కుతోచడం లేదు.
– ప్రసాద్రెడ్డి, ఆపరేటర్, గంటావూరు
పలమనేరు : నిన్న మొన్నటి దాకా సంచార వాహనంలోనే రేషన్ సరుకులను పంపిణీ చేస్తామన్న కూటమి ప్రభుత్వం ఇకపై వాహనాలు వద్దని ఆయా డీలర్ల వద్దే సరుకులు పంపిణీ చేపడుతోంది. దీంతో ఇన్నాళ్లు దీన్నే నమ్ముకున్న ఆపరేటర్ల కుటుంబాలు రోడ్డున పడ్డాయి. దీంతో పాటు వారు బ్యాంకు రుణం ద్వారా వాహనం కోసం తీసుకున్న అప్పులో భాగంగా మిగిలిన కంతులు ఆపరేటర్లు చెల్లించాలి. మూడు నెలలు ఇన్స్టాల్మెంట్లు చెల్లించకుంటే బ్యాంకర్లు ఆ వాహనాలను స్వాధీనం చేసుకోవడం ఖాయం. దీంతో ఎండీయూ (మొబైల్ డిస్పాచింగ్ యూనిట్స్) ఆపరేటర్లకు కష్టాలు తప్పేలా లేవు.
వాహనాల నుంచే ఇప్పటి దాకా సరఫరా
రేషన్ దుకాణ పరిధిలోని కార్డుదారులకు ఎండీయూ వాహనాల ద్వారా ఇంటి వద్దకే వెళ్లి రేషన్ పంపిణీ చేసేవారు. పీడీఎస్ రైస్కు సంబంధించి ఐసీడీఎస్(అంగన్వాడీలు) స్కూళ్లు, హాస్టళ్లకు ఈ వాహనాల్లోనే సరఫరా చేసేవాళ్లు. రేషన్ దుకాణం ఉన్న గ్రామానికి ఏడెనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే ఆవాస గ్రామాల్లోని కార్డుదారులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఈ వాహనాల ద్వారా సరుకులు ప్రతినెలా అందేవి. దీంతో అటవీ సమీప గ్రామాలు, వ్యవసాయ పొలాల వద్ద నివసాలుండే వారికి ఎంతో సౌకర్యంగా ఉండేది.
ఆపరేటర్ల పరిస్థితి ఏంటంటే..
రేషన్ షాపుల పరిధిలో ఆపరేటర్లను ఎంపిక చేశారు. యూనిట్ కాస్ట్ రూ.5,81,190 కాగా ఇందులో వేయింగ్ సామగ్రి కోసం రూ.9,260గా నిర్ణయించారు. వీరికి వాహనాలను బ్యాంక్ ఆఫ్ బరోడా ద్వారా రుణాలను అందించారు. ఈ వ్యవహారాలను ఏపీ సివిల్ సప్లయిస్ కార్పొరేషన్ లిమిటెడ్( ఏపీఎసీసీఎల్) చేపట్టింది. ఈ సందర్భంగా ఆపరేటర్లు 10శాతం కాంట్రిబ్యూషన్,90శాతం లోనుగా ఈ ప్రాజెక్టు ఫిబ్రవరి 2021 నుంచి జనవరి 2027 దాకా జరిగేలా అగ్రిమెంట్ ఉంది. ఇందులో ఆపరేటర్కు నెల జీతం రూ.21 వేలుగా నిర్ణయించారు. ఇందులో బ్యాంకుకు ప్రభుత్వం ద్వారా కంతుకు రూ.5879, ఆపరేటర్ రూ.3 వేలు చెల్లించాలి. రూ.21 వేలలో కంతు కోసం రూ.3 వేలు, ఇంధనానికి రూ.3 వేలు, అసిస్టెంట్కు రూ.5 వేలు పోగా నెలకు ఆపరేటర్కు రూ.10 వేలు మిగిలేది.
రేషన్ డీలర్లకు మేలు చేసేందుకే...
ఎండీయూల ద్వారా రేషన్ పంపిణీ డిజిటల్ తూకాల ద్వారా పక్కాగా ఇన్నాళ్లు సాగేది. ఇప్పుడు పంపిణీ ఆయా డీలర్లకు ఇవ్వడంతో చాలా చోట్ల త్రాసులు వాడి సరుకుల పంపిణీ సాగుతోంది. దీంతో అక్రమాలు జరిగేందుకు అవకాశాలు ఎక్కువ. కొందరు డీలర్లు అందుబాటులో ఉండక ప్రజలకు కష్టాలు తప్పవు. దీంతో పాటు రేషన్ సరుకుల్లో అక్రమాలు అప్పుడే మొదలైనట్లు ఇటీవల జరుగుతున్న సంఘటనలు చూస్తూనే ఉన్నాం.
మిగిలిన డ్యూలు కట్టుకోవాలి..
ఇప్పటి దాకా 72 నెలల్లో 53 నెలలు ప్రభుత్వం ప్రతి నెలా బ్యాంకు అప్పుగా రూ.5879 చెల్లించింది. ఇప్పుడు ఈ వ్యవస్థను రద్దు చేయడంతో ఆపరేటర్లు నెలకు డ్యూ రూ.3 వేలు చొప్పున మిగిలిన 20 నెలలు కట్టాల్సిందే. మూడు నెలలు డ్యూ కట్టకుంటే వాహనాన్ని ఫైనాన్స్ ఇచ్చిన బ్యాంకు జప్తు చేస్తుంది. దీంతో ఆపరేటర్లు తమ వాహనాలను పాల ట్యాంకర్లు తోలేందుకు, ఇతర అద్దెలకు తిప్పాల్సి వస్తోంది. అద్దెలు లేకుంటే కంతు కట్టలేక వాహనాన్ని వదుకోవాల్సిన పరిస్థితి నెలకొంది.

బతుకు‘బండి’ బస్టాండు

బతుకు‘బండి’ బస్టాండు

బతుకు‘బండి’ బస్టాండు