చిత్తూరు కలెక్టరేట్ : జిల్లా వ్యాప్తంగా విరివిగా మొక్కలు నాటేందుకు చర్యలు చేపట్టాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ అటవీశాఖ అధికారులను ఆదేశించారు. ఆ శాఖ అధికారులతో గురు వారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. జిల్లాలో జూన్లో మొక్కలు నాటే కార్యక్రమానికి అటవీ, డ్వామా, వ్యవసాయ శాఖల అధికారులు సమన్వ యంతో పనిచేయాలన్నారు. జూన్, జులై నెలల్లో జిల్లాలోని ప్రభుత్వ భూములు, రోడ్లకు ఇరువైపులా మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టాలన్నారు.
అలసత్వం వహిస్తే చర్యలు
జిల్లా వ్యాప్తంగా గృహ నిర్మాణాలపై విధులు సక్రమంగా నిర్వహించని వారికి షోకాజ్ నోటీసులు జారీ చేయాలని కలెక్టర్ సుమిత్ కుమార్ గాంధీ ఆదేశించారు. హౌసింగ్ శాఖ అధికారులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇంజనీరింగ్ అసిస్టెంట్లు తప్పనిసరిగా క్షేత్రస్థాయిలో ఇళ్ల పురోగతిని పరిశీలించాలన్నారు. లబ్ధిదారులతో మాట్లాడి ఇళ్ల నిర్మాణాలను త్వరతిగతిగా పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలన్నారు. సమావేశంలో డీఎఫ్వో భరణి, సామాజిక అటవీశాఖ అధికారి జ్ఞానప్రకాష్, డ్వామా పీడీ రవికుమార్, జిల్లా వ్యవసాయశాఖ అధికారి మురళీకృష్ణ, హౌసింగ్ పీడీ గోపాల్నాయక్, ఈఈ, డీఈలు పాల్గొన్నారు.

విరివిగా మొక్కలు నాటండి