
నేడు మంత్రి పొంగులేటి పర్యటన
కొత్తగూడెంఅర్బన్ : రాష్ట్ర రెవెన్యూ, గృహనిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదివారం కొత్తగూడెంలో పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు కొత్తగూడెం క్లబ్లో జరిగే కార్యక్రమంలో చుంచుపల్లి, పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, సుజాతనగర్ మండలాల ఇందిరమ్మ ఇళ్ల పథకం లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నారు. చుంచుపల్లి మండలం ఎస్ఆర్టీ, మాయాబజార్, వనమా కాలనీ నిర్వాసితులకు ఇంటి స్థలాల మంజూరు పత్రాలను పంపిణీ చేస్తారు. మధ్యాహ్నం 12 గంటలకు లక్ష్మీదేవిపల్లి మండలం సీతారాంపురం– రూప్లా తండా హైలెవల్ బ్రిడ్జి పనులకు, ఒంటి గంటకు చింతపెంటిగూడెంలో బ్రిడ్జి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం పాల్వంచలో జరిగే పలు ప్రైవేట్ కార్యక్రమాలకు హాజరవుతారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు తదితరులు పాల్గొననున్నారు.
ఆర్థికాభివృద్ధి సాధించాలి
ఇల్లెందురూరల్: సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకుని ఆర్థికాభివృద్ధి సాధించాలని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్, డీఆర్డీఓ విద్యాచందన సూచించారు. శనివారం ఆమె మండలంలోని రొంపేడులో ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ యూనిట్ నెలకొల్పేందుకు స్థల పరిశీలన చేశారు. కొమ్ముగూడెం గ్రామపంచాయతీ నాయకులగూడెం గ్రామంలో పౌల్ట్రీ మదర్ యూనిట్ నిర్మాణ పనులను, బొజ్జాయిగూడెం గ్రామంలో కమ్యూనిటీ టాయిలెట్స్, షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. ఎంపీడీవో ధన్సింగ్, ఎంపీఓ చిరంజీవి, ఏపీఎం దుర్గారావు పాల్గొన్నారు.
జనన ధ్రువీకరణ పత్రాలకు దరఖాస్తు చేసుకోవాలి
కొత్తగూడెంఅర్బన్: జిల్లా విద్యాశాఖ ఇచ్చిన ఫార్మాట్లలో జనన ధ్రువీకరణ పత్రాల కోసం విద్యార్థులు మీ సేవలో దరఖాస్తు చేసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటేశ్వరాచారి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని పాఠశాలల్లో చదువుతున్న 4,369 మంది విద్యార్థులకు ఆధార్ కార్డులు లేవని మండల విద్యాధికారులు నివేదిక ఇచ్చారని తెలిపారు. ఈ విషయాన్ని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లగా ఆధార్ కార్డుల జారీకి ముందుగా జనన ధ్రువీకరణ పత్రాలు జారీ చేయాలని ఆర్డీఓలకు సూచనలు చేశారని వివరించారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయాల్లో జనన ధ్రువీకరణ పత్రాలు పొందాలని, ఆ తర్వాత పాఠశాలల్లో, ఎంఈఓ కార్యాలయాల్లో ఏర్పాటు చేసిన కేంద్రాల్లో ఆధార్ కార్డు పొందాలని వివరించారు. తహసీల్దార్ నుంచి పొందిన రెసిడెన్స్ సర్టిఫికెట్ ద్వారా ఆధార్ కార్డుల్లో మార్పులు చేర్పులు కూడా చేసుకోవాలని తెలిపారు. ఏ ఒక్క విద్యార్థి పేరు కూడా ఆధార్ లేని కారణంగా యూడైస్ వెబ్సైట్లో నమోదు చేయకుండా ఉండొద్దని మండల విద్యాధికారులకు, ప్రధానోపాధ్యాయులకు సూచించారు.
సార్వత్రిక సమ్మెను
జయప్రదం చేయాలి
ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం
సింగరేణి(కొత్తగూడెం): దేశ రక్షణ కోసం జరిగే సార్వత్రిక సమ్మెలో కార్మికులు, కర్షకులు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ప్రజా సంఘాల పోరాట వేదిక రాష్ట్ర బాధ్యుడు తమ్మినేని వీరభద్రం పిలుపునిచ్చారు. శనివారం మంచికంటి భవన్లో సీఐటీయూ జిల్లా కార్యదర్శి ఏజే రమేష్ అధ్యక్షతన నిర్వహించిన ప్రజాసంఘాల పోరాట వేదిక జిల్లా సదస్సులో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను నిరసిస్తూ సార్వత్రిక సమ్మె చేస్తున్నట్లు తెలిపారు. రైతులకు గిట్టుబాటు ధరల చట్టం తేవాలని డిమాండ్ చేశారు. నాయకులు పోతినేని సుదర్శన్, మధు, యలమంచిలి రవికుమార్, మచ్చా వెంకటేశ్వర్లు, రేపాకుల శ్రీనివాస్, అన్నవరకు కనకయ్య, వంశీకృష్ణ, బ్రహ్మాచారి, కే.పుల్లయ్య, ఎండీ నర్సిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

నేడు మంత్రి పొంగులేటి పర్యటన