కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’.. | - | Sakshi
Sakshi News home page

కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..

Jun 9 2025 7:05 AM | Updated on Jun 9 2025 7:05 AM

కనుమర

కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..

ఖమ్మం వ్యవసాయం: ఖమ్మం వ్యవసాయ మార్కె ట్‌ జ్ఞాపకాలు కనుమరుగవుతున్నాయి. మోడల్‌ మార్కెట్‌ నిర్మాణంలో భాగంగా పాత నిర్మాణా లను తొలగిస్తున్నారు. కాగా, రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మిర్చి అమ్మకాలకు ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌ ప్రసిద్ధి కావడంతో ఉమ్మడి ఖమ్మం, వరంగల్‌, కరీంగనర్‌, నల్లగొండ, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌ జిల్లాలతో పాటు పొరుగున ఉన్న ఏపీ రాష్ట్రంలోని పలు జిల్లాల రైతుల సైతం అమ్మకాలకు ఇక్కడకు వస్తుంటారు. దీంతో మిర్చి సీజన్‌లో నిత్యం లక్ష నుంచి 2 లక్షల బస్తాల వరకు పంట విక్రయాలు సాగుతున్నాయి. ఈ క్రమంలో యార్డులు సరిపోవడం లేదని పరిగణనలోకి తీసుకున్న రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధునాతన మార్కెట్‌ నిర్మాణాలకు రూ. 155.30 కోట్లు మంజూరు చేయించారు. ప్రస్తుతం మిర్చి సీజన్‌ ముగియడం, వేసవి సెలవులు ప్రకటించడంతో పాత నిర్మాణాలను సమూలంగా తొలగిస్తూ నూతన నిర్మాణ పనులను చకచకా చేయిస్తున్నారు.

75 ఏళ్ల నాటి గుర్తులు..

బ్రిటీష్‌ కాలం 1937లో నలుగురైదుగురు వ్యాపారులు కలిసి పరిసరప్రాంతాల రైతుల సౌకర్యార్థం గాంధీచౌక్‌లో బీట్‌బజార్‌ ఏర్పాటు చేశారు. కాలానుగుణంగా జిల్లాలో నీటి వనరులు పెరగడం, సాగు విస్తీర్ణం పెరగడంతో మార్కెట్‌ ఆవశ్యకత పెరిగి ఖమ్మం వ్యవసాయ మార్కెట్‌గా గుట్టల బజార్‌లో ఏర్పాటైంది. అయితే 1969 నుంచి ప్రభుత్వం మార్కెట్‌ చట్టాన్ని అమలు చేయగా.. క్రమక్రమంగా దాదాపు 40 ఎకరాల విస్తీర్ణంగా రూపుదిద్దుకుని పంటల కొనుగోళ్లలో గుర్తింపు సాధించింది. తొలుత అపరాలు, ఆపై పత్తి, మిర్చి పంటల సాగు పెరగడంతో ఖమ్మం మార్కెట్‌ అభివృద్ధి సాధించింది. అపరాల కొనుగోళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన యార్డు ప్రస్తుతం మిర్చి యార్డుగా మారింది. ఈ యార్డులో 22 షెడ్లు, భూసార పరీక్షా కేంద్రం, మార్కెట్‌ కార్యాలయం ఉన్నాయి. దీంతో పాటు ఈ యార్డుకు పక్కనే మిర్చికి ప్రత్యేకంగా నిర్మించి.. మరో షెడ్‌, గోదాములు, జిల్లా మార్కెటింగ్‌ శాఖ కార్యాలయం, కార్మికుల కార్యాలయాలను కూడా తొలగించడంతో ఆనాటి గుర్తులన్నీ కనుమరుగయ్యాయి.

పాత నిర్మాణాలపై భావోద్వేగం

మార్కెట్‌ పాత నిర్మాణాలు కనుమరుగవుతుండడంతో ఇక్కడ పనిచేసే వ్యాపారులు, కార్మికులు భావోద్వేగానికి గురవుతున్నారు. కొందరు మార్కె ట్‌ తొలగిస్తున్న వీడియోలు తీసి పాటలు జోడించి సోషల్‌ మీడియాలో పెడుతుండగా.. మరికొందరు యార్డులో వ్యాపారులకు కేటాయించిన స్థానాలు, నిత్యం పనిచేసే ప్రాంతాలు, భోజనం చేసే ప్రాంతాలు, చెట్ల తొలగింపు చూసి బాధను వ్యక్తపరుస్తున్నారు. ఈ మార్కెట్‌లో సుమారు 600 మంది వ్యాపారులు, 3 వేల మంది కార్మికులు పని చేస్తుండగా.. పరోక్షంగా నగరంలోని త్రీటౌన్‌ ప్రజలు వివిధ రకాలుగా ఆధారపడి జీవనం సాగిస్తున్నారు.

రైతుల ప్రయోజనం కోసం

రైతుల ప్రయోజనం కోసం ఖమ్మం మార్కెట్‌ను అభివృద్ధిలో భాగంగా పాత నిర్మాణాలను తొలగించి మోడల్‌ మార్కెట్‌గా రూపురేఖలు మార్చుతోంది. 7 అధునాతన షెడ్లతో పాటు ఒక కోల్డ్‌ స్టోరేజీ నిర్మాణాలకు శ్రీకారం చట్టారు. మార్చి నుంచి మార్కెట్‌లోని ఓ భాగంలో ప్రారంభించిన పనులను ప్రస్తుతం వేసవి సెలవులు కావడంతో పూర్తిస్థాయిలో పనులను చేపట్టారు. రెండేళ్ల క్రితం గత ప్రభుత్వం రూ.10 కోట్లతో నిర్మించిన షెడ్లను కూడా తొలగించి 15.39 ఎకరాల్లో నిర్మాణాలను చేపట్టారు. అజిలిటి భూమి కంపెనీ ఈ నిర్మాణ పనులను నిర్వహిస్తుండగా.. 2026 జూన్‌ నాటికిపనులను పూర్తయ్యేలా ఒప్పందం కుదుర్చుకుంది.

బీట్‌బజార్‌ నుంచి ఎదిగిన

ఖమ్మం మార్కెట్‌

తొలుత గ్రెయిన్‌ మార్కెట్‌గా పేరు..

మోడల్‌ మార్కెట్‌ పేరుతో

పాత నిర్మాణాల తొలగింపు

రూ.155.30 కోట్లతో

మారుతున్న రూపురేఖలు

కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..1
1/1

కనుమరుగవుతున్న ‘జ్ఞాపకం’..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement