
నిరుద్యోగులకు వరం
ఏజెన్సీలో ఆధునిక
గ్రంథాలయం..
భద్రాచలం: ఏజెన్సీ నిరుద్యోగులకు అధునాతన గ్రంథాలయం అందుబాటులోకి వచ్చింది. ఐటీడీఏ అధికారులు కావాల్సినంత మెటీరియల్, చల్లదనం కోసం కూలర్లు కూడా ఏర్పాటు చేశారు. దీంతో ఉద్యోగాలు, ఉన్నత విద్య కోసం ప్రశాంతంగా సిద్ధమయ్యే అవకాశం ఏర్పడింది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని గిరిజన విద్యార్థులు భద్రాచలంలో ఉంటూ ఇంటర్, డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, టీటీసీ, బీఈడీ వంటి కోర్సులు చదువుతుంటారు. కోర్సుల అనంతరం ప్రభుత్వ ఉద్యోగాల కోసం సాధన చేస్తుంటారు. సుదూర ప్రాంతాలకు, ప్రైవేట్ కోచింగ్ సెంటర్లకు వెళ్లలేని వారికి ఇక్కడి ఐటీడీఏ గ్రంథాలయం ఎంతో ఉపయోగపడుతోంది. గతంలో పురాతన భవనంలో, చాలీ చాలని వసతులతోనే ప్రిపరేషన్ను నెట్టుకొచ్చే వారు. లైబ్రేరియన్గా ఎస్కే జానీ బాధ్యతలు చేపట్టాక స్థానిక దాతల సహకరాలతో బెంచీలు, కుర్చీలు, ఫ్యాన్లు, కొంత మెటీరియల్ చేకూర్చారు. వీటిని సద్వినియోగం చేసుకున్న విద్యార్థులు పోలీసు, టీచర్, గ్రూపు పరీక్షల్లో సుమారు 30 మంది ఉద్యోగాలు సాధించారు.
ఐటీడీఏ పీఓ చొరవతో..
ఏజెన్సీ నిరుద్యోగులను ప్రోత్సహించేలా భద్రాచలం ఐటీడీఏ పీఓ రాహుల్ గ్రంథాలయ అభివృద్ధికి మరింత చొరవ తీసుకున్నారు. ఐటీడీఏ నుంచి రూ. 28 లక్షల నిధులు కేటాయించడంతో గ్రంథాలయ ప్రాంగణంలో సుమారు ఎకరం స్థలంలో విశాలమైన గది, ప్రత్యేక తరహా షెడ్, మరుగుదొడ్లు నిర్మించారు. కేవలం మూడు నెలల సమయంలోనే నిర్మాణ పనులు పూర్తికాగా, రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇటీవల ప్రారంభించారు. గ్రామపంచాయతీ నిధులతో కుర్చీలు, ప్యాడ్లు, ఫ్యాన్లు, కూలర్లు ఇతరత్రా వసతులు కల్పించారు. అన్ని ప్రభుత్వ ఉద్యోగాలకు అవసరమైన స్టడీ మెటీరియల్ అందుబాటులో ఉంచారు. వెంకటాపురం, వాజేడు, చర్ల, దుమ్ముగూడెం, భద్రాచలం, ఇల్లెందు, టేకులపల్లి, ములకలపల్లి, మండలాల విద్యార్థులతో పాటు ఆంధ్రప్రదేశ్కు చెందిన చింతూరు, కూనవరం, వీఆర్పురం తదితర మండలాల నిరుద్యోగులు భద్రాచలంలో గదులను అద్దెకు తీసుకుని ఉంటూ గ్రంథాలయంలో 24 గంటలు ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు.
డిజిటల్ లైబ్రరీ కూడా ఏర్పాటైతే..
మారుతున్న కాలానికి అనుగుణంగా లైబ్రరీని డిజిటలైజేషన్ చేయాలని, కంప్యూటర్లు, ల్యాప్ట్యాప్లు, నోట్ ప్యాడ్లను అందుబాటులోకి తేవాలని నిరుద్యోగులు కోరుతున్నారు. దీంతో దేశంలో ఉన్న అన్ని స్టడీ సెంటర్ల మెటీరియల్ అందుబాటులోకి వచ్చి ప్రిపరేషన్ సులభతరం అవుతుందని పేర్కొంటున్నారు. ఇప్పటికే గిరిజన విద్యాభివృద్ధికి కృషి చేస్తున్న పీఓ ఆ దిశగా చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
అన్ని హంగులతో భద్రాచలంలో లైబ్రరీ
రూ.28 లక్షలతో అదనపు హాల్ నిర్మాణం, మెటీరియల్ కొనుగోలు
పోటీ పరీక్షలకు ప్రశాంతంగా సిద్ధమవుతున్న గిరిజన అభ్యర్థులు
డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేయాలి
పోటీ పరీక్షలు, వివిధ సెట్లకు సిద్ధమయ్యేందుకు లైబ్రరీ అనుకూలంగా ఉంది. ప్రస్తుత పరిస్థితులకు తగినట్లు డిజిటల్ లైబ్రరీగా మార్చితే మరింత ఉపయోగం జరుగుతుంది. గ్రూప్స్, సివిల్స్ ప్రిపరేషన్ తేలికవుతుంది. పీఓ సారు దృష్టి సారించాలి. –శిల్ప, భద్రాచలం
ప్రశాంతంగా ప్రిపరేషన్
మాది ఇల్లెందు. కేవలం ప్రిపరేషన్ కోసమే భద్రాచలంలో గది తీసుకుని ఉంటున్నా. అప్పుడు ఆరు బయట, అరకొర వసతుల మధ్య చదువుకునేవాళ్లం. ప్రస్తుతం అన్ని హంగులతో లైబ్రరీ అందుబాటులోకి వచ్చింది. ఇక్కడే 24 గంటలు చదువుకుంటున్నా. –గుగులోత్ మంగీలాల్, ఇల్లెందు

నిరుద్యోగులకు వరం

నిరుద్యోగులకు వరం