
హెచ్ఎం పోస్టులు భర్తీ చేయాలి
చర్ల: వేసవి సెలవులు ముగిసే లోగా ఖాళీగా ఉన్న 700 హైస్కూలు ప్రధానోపాధ్యాయుల పోస్టులను భర్తీ చేయాలని, స్కూల్ అసిస్టెంట్లకు పదోన్నతులు ఇవ్వాలని టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి డిమాండ్ చేశారు. శనివారం చర్లలో టీఎస్ యూటీఎఫ్ నాయకుడు రాంబాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాట్లాడారు. ఐదు డీఏలకు ఒక్క డీఏ మాత్రమే ఇచ్చి ప్రభుత్వం ఉద్యోగులను మభ్యపెడుతోందని ఆరోపించారు. ఉద్యోగుల ఆరోగ్య పథకాన్ని అన్ని యాజమాన్యాల ఉద్యోగులకు వర్తింపజేయాలని కోరారు. పీఆర్సీ ఇప్పటికే 23 నెలలు ఆలస్యమైనందున వెంటనే నివేదిక తెప్పించుకుని అమలు చేయాలని డిమాండ్ చేశారు. విద్యాశాఖలో డీఈఓ, డిప్యూటీ డీఈఓ, ఎంఈఓ పోస్టులను శాశ్వత ప్రాతిపదికన నియమించాలని కోరారు. రాష్ట్ర కార్యదర్శి బి.రాజు మాట్లాడుతూ బడిబాట ముగిసే వరకు ఉపాధ్యాయుల సర్దుబాటును వాయిదా వేయాలని, మెమో 1267ను సవరించాలని డిమాండ్ చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో పూర్వ ప్రాథమిక తరగతులను ప్రారంభించాలని, తరగతికో ఉపాధ్యాయుడిని నియమించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు బి.మురళీమోహన్, రాష్ట్ర కమిటీ సభ్యులు నంది కృష్ణ, జిల్లా కార్యదర్శి సోడె విజయ్ కుమార్, గిరిజన సంక్షేమ విభాగం కన్వీనర్ తేజావత్ బాలు, మండల ప్రధాన కార్యదర్శి ఉయిక బాలకృష్ణ, ఎం.యాడమరాజు, హిమగిరిబాబు, శ్యామల, సావిత్రి తదితరులు పాల్గొన్నారు.
టీఎస్ యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి