
● పండుగ.. త్యాగానికి, మత సామరస్యానికి ప్రతీక ● కొత్తగూడ
సూపర్బజార్(కొత్తగూడెం): ముస్లింలు శనివారం భక్తి శ్రద్ధలతో బక్రీద్ పండుగ నిర్వహించారు. జిల్లావ్యాప్తంగా మసీదులు, ఈద్గాలలో ప్రార్థనలు చేశారు. మత పెద్దలు సందేశం వినిపించారు. జిల్లా కేంద్రంలో భక్తులతో ఈద్గాలు, మసీదులు కిటకిటలాడాయి. పేదలకు ఖుర్బానీ పంపిణీ చేశారు. ఇల్లెందు, పాల్వంచ, మణుగూరు, అశ్వారావుపేట, భద్రాచలం తదితర ప్రాంతాల్లో వేడుకలను ఘనంగా జరిపారు. కొత్తగూడెంలోని బోడగుట్ట ఈద్గా మైదానంలో ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు పాల్గొని ముస్లింలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని పండుగలను కులమతాలకు అతీతంగా జరుపుకోవడం ప్రజాస్వామ్య భారతదేశ గొప్పతనమని పేర్కొన్నారు. కేంద్రంలోని మోదీ సర్కార్ ముస్లిం వ్యతిరేక చట్టాలను తీసుకొస్తూ ముస్లిం మైనారిటీలను ముప్పుతిప్పలు పెడుతోందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో కొత్తగూడెం డీఎస్పీ అబ్దుల్ రెహమాన్, సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్కే సాబీర్పాషా, మైనార్టీ సంఘాల నాయకులు డాక్టర్ నయీం ఖురేషి, సీపీఐ, ముస్లిం మైనార్టీ నాయకులు వాసిరెడ్డి మురళి, అన్వర్ అలీ, అమీర్ ఖాద్రీ, అయూబ్, ఇస్మాయిల్ ఖాన్, అబ్దుల్ రబ్, అబీద్ హుస్సేన్, కరీం పాషా, జావెద్ తదితరులు పాల్గొన్నారు.