
నేతల్లో నైరాశ్యం
పంచాయతీ, పరిషత్ ఎన్నికలు ఎప్పుడు జరిగినా సత్తా చాటాలని హస్తం పార్టీ హైకమాండ్ దిశా నిర్దేశం చేసింది. అందుకు తగ్గట్టే పార్టీలో పై స్థాయి నాయకులు ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని అంటున్నారు. కానీ క్షేత్రస్థాయి నాయకత్వంలో మాత్రం అంతగా జోష్ కనిపించడం లేదని ఆ పార్టీ వారే చెబుతున్నారు.
– సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం
అసంతృప్తిలో నేతలు
సంప్రదాయ కాంగ్రెస్ వాదులు, తెలంగాణ వచ్చిన తర్వాత పార్టీనే అంటిపెట్టుకుని ఉన్న నేతల్లో అసంతృప్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేక రాష్ట్రం వచ్చిన తర్వాత బీఆర్ఎస్ ఉధృతిని, అప్పటి ప్రభుత్వ ఒత్తిడులు, బెదిరింపులు, ప్రలోభాలను తట్టుకుని పార్టీ కోసం పని చేసిన తమకు ప్రస్తుతం తగిన గుర్తింపు దక్కడం లేదనే భావన వారిలో నెలకొంది. ఇప్పటికే కొందరు పార్టీ కార్యక్రమాల్లో అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తుంటే, మరికొందరు వ్యక్తిగత పనులకే ఎక్కువ సమయం కేటాయిస్తూ పార్టీ వ్యవహారాలపై పెద్దగా ఆసక్తి చూపించడం లేదనే అభిప్రాయం కాంగ్రెస్ వర్గాల్లో వినిపిస్తోంది.
పని చేస్తున్నా పదవులు దక్కడం లేదని అసంతృప్తి
● నామినేటెడ్ పోస్టుల భర్తీలో జాప్యంపై ఆందోళన
● కష్టపడినా గుర్తింపు లేదంటున్న కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నేతలు
● పార్టీ కార్యక్రమాలకు దూరంగా పలువురు..
బీఆర్ఎస్ హవాను తట్టుకుని..
తెలంగాణ వచ్చిన తర్వాత 2014, 2018 అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్రమంతటా బీఆర్ఎస్ హవా కనిపిస్తే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో కాంగ్రెస్ సత్తా చాటింది. దీంతో 2023 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసేందుకు భద్రాద్రి జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకర్గాల నుంచి అనేక మంది ఆశావహులు ముందుకొచ్చారు. పార్టీ టికెట్ దక్కించుకోవడం కోసం ఎన్నికలకు రెండు, మూడేళ్ల ముందు నుంచే నియోజకర్గ స్థాయిలో శ్రమించారు. కొత్తగూడెం నుంచి పోటీ చేసేందుకు పోట్ల నాగేశ్వరరావు, నాగ సీతారాములు వంటి వారు ఆసక్తి చూపించగా పినపాక నుంచి బట్టా విజయ్గాంధీ, చందా సంతోష్, పోలెబోయిన శ్రీవాణి, అశ్వారావుపేట నుంచి మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు, సున్నం నాగమణి టికెట్ ఆశించారు. ఇక రాష్ట్రంలోనే అత్యధిక మంది అభ్యర్థులు ఇల్లెందు అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ కోసం పోటీ పడ్డారు. ఇందులో చివరి నిమిషం వరకు శంకర్నాయక్, డాక్టర్ రవి, చీమల వెంకటేశ్వర్లు తదితర నేతలు టికెట్ రేసులో మిగిలారు. ఆయా నియోజకవర్గాల పరిధిలో గ్రామ, మండల స్థాయిల్లో తమకంటూ అనుచరగణం ఏర్పాటు చేసుకుని పని చేశారు.
‘నామినేటెడ్’ భర్తీ ఎప్పుడో ?
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర దాటింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన పొదెం వీరయ్యకు అటవీ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్గా రాష్ట్ర స్థాయి నామినేటెడ్ పదవి దక్కింది. ఇక ఆ తర్వాత నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయిలో పెద్దగా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదు. దీంతో పార్టీ కోసం చెమటోడ్చిన తమను ఇంకెప్పుడు గుర్తిస్తారని కాంగ్రెస్ నేతలు ప్రశ్నిస్తున్నారు. 18 నెలలుగా ఎలాంటి పదవులు దక్కలేదని, తమను నమ్ముకున్న వారికి కనీస స్థాయిలో సాయం చేసే పరిస్థితి లేదని ఆవేదన చెందుతున్నారు. స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు కింది స్థాయి కేడర్లో ఉత్సాహం నింపేలా, గతంలో టికెట్లు దక్కని నేతల రాజకీయ భవిష్యత్తుకు భరోసా కల్పించేలా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయాలని కోరుతున్నారు. మరికొందరు మాత్రం పార్టీ కోసం ఓపికగా పని చేసుకుంటూ వెళితే సరైన సమయంలో తగిన గుర్తింపు లభిస్తుందనే నమ్మకంతో ఉన్నారు.
అసెంబ్లీ ఎన్నికల నుంచి..
ఎన్నికల సమీకరణలు, వ్యూహాల్లో భాగంగా కొత్తగూడెం టికెట్ సీపీఐకి కేటాయించగా, పినపాక, ఇల్లెందు, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో ప్రస్తుత మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెంట నడిచిన పాయం వెంకటేశ్వర్లు, కోరం కనకయ్య, జారే ఆదినారాయణకు అవకాశం దక్కింది. భద్రాచలంలో సిట్టింగ్ ఎమ్మెల్యే పొదెం వీరయ్యకు టికెట్ ఇచ్చారు. అయితే కొత్తగూడెంలో మిత్రపక్షమైన సీపీఐ, మరో మూడు చోట్ల కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. భద్రాచలంలో పొదెం వీరయ్య ఓడిపోయారు. కాగా, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో తమ శ్రమకు తగిన గుర్తింపు ఉంటుందని టికెట్ దక్కని ఆ పార్టీ నేతలు ఆశించారు.